సేంద్రియ పాల ఆవశ్యకత

11 Feb, 2020 06:55 IST|Sakshi

డెయిరీ డైరీ–24

వ్యవసాయ రంగానికి ఏర్పడుతున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పాడి పరిశ్రమ

రైతులకు బాసటగా నిలుస్తున్నది. మన దేశం సగటున రోజుకు 170 మిలియన్‌ టన్నుల పాలను ఉత్పత్తి చేస్తూ, ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. అధిక పాల ఉత్పత్తితో పాటుగా, నాణ్యమైన పాలను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సేంద్రియ పాల ఉత్పత్తి ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

ఈ పూర్వరంగంలో మనం కూడా సేంద్రియ పాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. భూమిలో సేంద్రియ ఎరువులు వేసి పండించిన దాణాలను, పశుగ్రాసాలను మేసిన పశువులు ఇచ్చే పాలే సేంద్రియ పాలు. ఇందులో ఎటువంటి రసాయనిక అవశేషాలు ఉండవు. సేంద్రియ పాలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి..
     
► రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గడం, తద్వారా ఖర్చు తగ్గడం.
► రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవశేషాలు లేని నాణ్యమైన, కల్తీ లేని పాలను ఉత్పత్తి చేయటం.
► సేంద్రియ పాలలో ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. అలానే పాలీ సాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఎక్కువే.
► సేంద్రియ పాల పదార్థాలలో ఎక్కువ ప్రొటీన్‌ ఉంటుంది.
► రసాయనిక ఎరువుల అవశేషాలు పాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు అవి శరీరంలోని ముఖ్యభాగాలను – కాలేయాన్ని, మూత్రపిండాలను, పేగులను దెబ్బతీస్తాయి.
► సేంద్రియ పాలను ఉత్పత్తి చేయటం అంత తేలికైన విషయం కాదు. పశువుకు మేపే దాణా, మేత మొత్తాన్నీ సేంద్రియ పద్ధతుల్లోనే పండించాలి. మొక్కజొన్న, జొన్నలు, తవుడు మొదలైనవి.
► సాధారణంగా భూమిలో మేలు చేసే సూక్ష్మజీవులు చాలా ఉంటాయి. రసాయనిక ఎరువుల వాడకం వలన ఇవి నశిస్తాయి. దీని వలన భూసారం తగ్గిపోయి, భూమి తన ఉత్పాదక శక్తిని కోల్పోతుంది.
► రసాయనిక ఎరువులు గాని, పురుగుమందులు గాని పశుగ్రాసాల సాగులో వాడితే ఆ పశుగ్రాసాలను తిన్న పశువుల పాలలో వాటి అవశేషాలు పేరుకుంటాయి. కొవ్వులతో జత కట్టే గుణం రసాయనాలకు ఉండటమే ఇందుకు కారణం. ఇటువంటి పాలు అనారోగ్యాన్ని కలిగిస్తాయి.
► పిల్లలు త్వరగా పరిపక్వ దశకు రావడానికి కూడా ఇదే కారణం. కాబట్టి సేంద్రియ పాల ఉత్పత్తిపై దృష్టి పెట్టడం ఉత్తమం.

– డా. ఎం.వి.ఎ.ఎన్‌. సూర్యనారాయణ, ప్రొఫెసర్‌ అండ్‌ హెడ్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లైవ్‌స్టాక్‌ ఫామ్‌ కాంప్లెక్స్, కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్, తిరుపతి.

మరిన్ని వార్తలు