మెడనొప్పి మరీ తీవ్రం...

1 Jul, 2016 23:41 IST|Sakshi
మెడనొప్పి మరీ తీవ్రం...

ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నా వయసు 48 ఏళ్లు. నాకు మెడనొప్పి వస్తోంది. ఇటీవల అది మరీ తీవ్రమైంది. మందులు వాడటం అంటే నాకు కాస్త భయం. నొప్పి తగ్గడానికి జాగ్రత్తలు చెప్పండి.
- సుధాకర్, నల్లగొండ

 
మనం నిల్చునే, కూర్చొనే భంగిమలు సరిగా లేకపోవడం వల్లనే మెడనొప్పి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఒక్కోసారి వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ వల్ల కూడా విపరీతమైన సమస్యలు వస్తాయి. ఈ డిస్క్ జారి నరాల మీద ఒత్తిడి కలిగినప్పుడు నొప్పి వస్తుంటుంది. వెన్నుపూస నుంచి మెదడులోకి వెళ్లే రెండు రక్తనాళాలైన వర్టిబ్రల్ ఆర్టరీస్ చిన్న మెదడుకు రక్తప్రసరణ అందిస్తాయి. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ఆర్టరీస్ రక్తప్రసారంలో తేడాలు వచ్చి మెదడుకు సరిగా రక్తప్రసరణ జరగకపోవచ్చు. దీనివల్ల నొప్పితో పాటు తలతిరగడం, దిమ్ముగా అనిపించడం, వాంతులు కావడం జరుగుతుంది.
 
మెడ దగ్గర ఉండే వెన్నుపూసల్లో ఏడు పూసలు ఉంటాయి. వాటిలో మొదటి వెన్నుపూసను అట్లాస్ అని, రెండో వెన్నుపూసను యాక్సిస్ అని అంటారు. ఆ తర్వాత వెన్నుపూసలను 3, 4, 5, 6, 7 అని నెంబర్లతో పిలుస్తారు. ఇవన్నీ ఒకదానితో మరొకటి జాయింట్ అయినట్లుగా అమరి ఉంటాయి. అందులో ఏర్పడ్డ బోలు ప్రదేశంలో స్పైనల్‌కార్డ్ అంటే వెన్నుపాము ఉంటుంది. మెదడు నుంచి కాళ్లకు, చేతులకు నరాలను తీసుకెళ్తూ ఉంటుంది. ఒక వెన్నుపూసకు, మరొక వెన్నుపూసకు మధ్యలో ఉండే ఖాళీ స్థలం ఇంటర్ వర్టిబ్రల్ పారామినా నుంచి ఒక్కొక్కనరం బయటకు వస్తుంది.

ఈ నరాలు ఒక్కోవైపునకు విస్తరించి ఉంటాయి. వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ ఒక షాక్ అబ్జార్బర్‌లా పనిచూస్తుంది. డిస్క్‌కి రక్తప్రసరణ అవసరం ఉండదు. మనం తీసుకున్న ఆహారం ద్వారానే దీనికి పోషకాలు అందుతాయి. శరీర బరువు, తలబరువును బ్యాలెన్స్ చేయడానికి ఇది దోహదపడుతుంది.
 
నిర్ధారణ మెడనొప్పి వచ్చే వారికి ఎక్స్-రే తీస్తే సమస్య తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఎక్స్-రే బట్టి మెడపూసల్లో ఏవైనా తేడాలు ఉన్నాయా అని తెలుసుకొని దాన్ని బట్టి చికిత్స చేస్తారు. సూక్ష్మమైన సమస్యలు ఉన్నవారికి ఎమ్మారై స్కాన్ ద్వారా పరీక్షలు నిర్వహించి, దాని సహాయంతో ఏ నరం మీద ఎంత ఒత్తిడి ఉంది తెలుసుకోవచ్చు.

ఆ ఒత్తిడి దేని వల్ల వచ్చింది, ఏదైనా ఎముక ఫ్రాక్చర్ అయిందా, నరాల్లో వాపు ఏమైనా ఉందా, గడ్డలు ఉన్నాయా వంటి అంశాలను తెలుసుకోవచ్చు. డిస్క్ ప్రొలాప్స్ (డిస్క్ తాను ఉన్న స్థానం నుంచి తొలగడం) జరిగితే... ఆ సమస్య ఎంత మేర ఉందో గమనించి, దానికి చికిత్స చేస్తారు.
 
జాగ్రత్తలు ఇవి...

మెడ నొప్పి వచ్చినప్పుడు వేడినీళ్లలో మెత్తటి వస్త్రాన్ని ముంచి, పిండి మెడపైన కాపడం పెట్టడం లేదా ఐస్ ముక్కను గుడ్డలో చుట్టి కాపడం పెట్టడం వల్ల సాధారణ నొప్పి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది  మెడ కండరాలలో నొప్పి ఉన్నప్పుడు వాటికి తప్పనిసరిగా విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే... అలా నొప్పి వస్తుందంటే కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి.

అందుకే విశ్రాంతి ఇవ్వాలి. లేదంటే నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంది ఫిజియోథెరపిస్ట్‌ను కలిసి కండరాల విశ్రాంతి కోసం నెక్ ఎక్సర్‌సైజ్‌లు తెలుసుకొని వాటిని క్రమం తప్పకుండా చేయాలి  సాధారణ నొప్పి అయితే పెయిన్‌కిల్లర్ ఆయింట్‌మెంట్స్ ఉంటాయి. వాటిని రాస్తూ సున్నితంగా రోజుకు ఐదారుసార్లు మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి రిలీఫ్ ఉంటుంది  బరువైన బ్యాగ్‌లను ఒకే భుజానికి తగిలించుకొని నడవడం వల్ల మెడ కండరాలపై, నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది  నడిచేటప్పుడు ఒకేవైపునకు ఒంగడం సరికాదు.

మరిన్ని వార్తలు