ఇలా పకోడీ అయ్యింది

27 Jul, 2019 13:21 IST|Sakshi

నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ

వానలు పడుతుంటే... నోటికి కరకరలు కావాలి... వేడివేడిగా... అప్పటికప్పుడు చేసుకుని తినాలి... వెంటనే పకోడీలు గుర్తుకు వచ్చాయి కదూ... అబ్బా... అవే పకోడీలా అనుకుంటున్నారా...
అవును... అవే పకోడీలు... కానీ పకోడీ మారింది... ఏంటా అనుకుంటున్నారా... షేప్‌ అందాజాగా అలాగే ఉంది... స్వరూపం మారలేదు...   స్వభావం మారింది...మీరు కూడా ప్రయత్నించండి...
నోటికి కరకరలు అందించండి... వానలను ఆస్వాదించండి...

కార్న్‌ పకోడీ

కావలసినవి: మొక్కజొన్న గింజలు – 2 కప్పులు (ఉడికించాలి); సెనగ పిండి – రెండు కప్పులు; ఉల్లికాడల తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 6; అల్లం తురుము – పావు టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; గరం మసాలా – పావు టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; మిరియాల పొడి – పావు టీ స్పూను; సోంపు పొడి – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – తగినన్ని; చాట్‌ మసాలా – కొద్దిగా; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారీ: ∙ఒక పాత్రలో ఉల్లికాడల తరుగు, ఉడికించిన మొక్కజొన్న గింజలు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, మిరప కారం, పసుపు, గరం మసాలా, ఇంగువ, మిరియాల పొడి, సోంపు పొడి, ఉప్పు వేసి కలపాలి ∙సెనగ పిండి, తగినన్ని నీళ్లు జత చేసి పకోడీల పిండిలా కలుపుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి ∙పిండిని పకోడీల మాదిరిగా నూనెలో వేసి బాగా దోరగా వేయించి, పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోచాలి (కరకరలాడేలా వేయించుకోవాలి) ∙ప్లేట్‌లో అందించేటప్పుడు పైన చాట్‌ మసాలా చల్లాలి ∙గ్రీన్‌ చట్నీ, టొమాటో సాస్‌లతో తింటే రుచిగా ఉంటాయి.

బ్రెడ్‌ పకోడీ

కావలసినవి: బంగాళ దుంపలు – 2 (మీడియం సైజువి); పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – 5 టీ స్పూన్లు; పుదీనా తరుగు – 2 టీ స్పూన్లు; మిరప కారం – పావు టీ స్పూను; ఆమ్‌ చూర్‌ పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత.

పిండి కోసం: సెనగ పిండి – ఒక కప్పు; వాము – అర టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; గరం మసాలా పొడి – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; బేకింగ్‌ సోడా – చిటికెడు; నీళ్లు – కొద్దిగా; ఉప్పు – తగినంత; వీట్‌ బ్రెడ్‌ – 5 స్లైసులు; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారీ: ∙బంగాళ దుంపలను కుకర్‌లో ఉంచి మెత్తగా ఉడికించాలి ∙బయటకు తీసి తొక్క వేరు చేసి, బంగాళ దుంపను సన్నగా తురిమి పక్కన ఉంచాలి ∙కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, పచ్చి మిర్చి తరుగు, మిరప కారం, ఆమ్‌ చూర్‌ పొడి, ఉప్పు, బంగాళ దుంప తరుగులను ఒక పాత్రలో వేసి బాగా కలపాలి ∙పెనం మీద కొద్దిగా నూనె వేసి బ్రెడ్‌ స్లైసులను దోరగా కాల్చి, చిన్న చిన్న ముక్కలుగా చేయాలి ∙ఒక పాత్రలో సెనగ పిండి, వాము, మిరప కారం, గరం మసాలా, ఇంగువ, ఉప్పు, బేకింగ్‌ సోడా వేసి బాగా కలపాలి ∙అర కప్పు నీళ్లు జత చేసి మరోమారు కలపాలి ∙ఒక టీ స్పూను వేడి వేడి నూనె జత చేయాలి ∙బ్రెడ్‌ ముక్కలను ఈ పిండిలో వేసి బాగా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, సిద్ధంగా ఉంచుకున్న పిండిని పకోడీల మాదిరి గా వేసి దోరగా వేయించి, పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.

రైస్‌ పకోడీ

కావలసినవి:
అన్నం – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 4; మిరప కారం – ఒక టీ స్పూను; అల్లం తురుము – అర టీ స్పూను; కొత్తిమీర తరుగు – పావు కప్పు; వాము – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – చిటికెడు; సెనగ పిండి – 5 టేబుల్‌ స్పూన్లు; నీళ్లు – తగినన్ని; ఉప్పు – తగినంత; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారీ: ఒక పాత్రలోకి అన్నం తీసుకుని, మెత్తగా అయ్యేలా చేతితో మెదపాలి (అన్నం మెత్తగా ఉండాలి) ∙నూనె మినహా మిగతా పదార్థాలన్నీ జత చేసి పకోడీ పిండిలా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, పిండి మిశ్రమాన్ని పకోడీల మాదిరిగా వేసి దోరగా వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.

కంద పకోడీ

కావలసినవి: కంద – పావు కేజీ; సెనగ పిండి – పావు కేజీ; బియ్యప్పిండి – 2 టీ స్పూన్లు; అల్లం తురుము – 2 టీ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – 6; జీలకర్ర – ఒక టీ స్పూను; వాము – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; ఉల్లి తరుగు – పావు కప్పు (సన్నగా తరగాలి); నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారీ: ∙కందను శుభ్రంగా కడిగి చెక్కు తీసేయాలి ∙చెక్కు తీసిన కందను మరోమారు శుభ్రంగా కడిగి, ఒక గిన్నెలోకి సన్నగా తురమాలి ∙ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, కంద తురుము, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు, జీలకర్ర, వాము, ఉప్పు వేసి బాగా కలపాలి ∙ఒక టేబుల్‌ స్పూను వేడి నూనె జత చేయాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి పకోడీల పిండిలా కలుపుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, పింyì ని పకోడీలుగా వేసి బాగా కరకరలాడేలా వేయించాలి ∙పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.

చీజ్‌ పకోడీ

కావలసినవి: సెనగ పిండి – అర కప్పు; ఇంగువ – కొద్దిగా; మిరియాల పొడి – పావు టీ స్పూను (రవ్వ మాదిరిగా ఉండాలి); ధనియాల పొడి – పావు టీ స్పూను (రవ్వ మాదిరిగా ఉండాలి); బేకింగ్‌ సోడా – చిటికెడు; పసుపు – అర టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; నువ్వులు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – కొద్దిగా; చీజ్‌ – 125 గ్రా.; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారీ: ∙ఒక పాత్రలో సెనగ పిండి, మిరియాల పొడి, ధనియాల పొడి, ఇంగువ, బేకింగ్‌ సోడా, పసుపు, మిరప కారం, నువ్వులు, ఉప్పు వేసి కలపాలి ∙కొద్దిగా నీళ్లు జత చేసి పకోడీ పిండిలా కలుపుకోవాలి (ఉండలు లేకుండా చూసుకోవాలి) ∙చీజ్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేయాలి (ఫ్రిజ్‌లో నుంచి తీసి, వెంటనే వాడాలి) ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక కొద్దిగా నూనెను పిండి మిశ్రమంలో వేసి కలపాలి ∙చీజ్‌ ముక్కలను సెనగ పిండి మిశ్రమంలో ముంచి, పకోడీల మాదిరిగా కాగిన నూనెలో వేయాలి (మీడియం మంట మీద వేయించాలి)  ∙కొద్దిగా గట్టి పడి, బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, కిచెన్‌ పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి ∙చట్నీతో కాని, సాస్‌తో కాని అందించాలి.

ఫిష్‌ పకోడీ

కావలసినవి: ముల్లు లేని చేప ముక్కలు – 250 గ్రా.లు; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; నిమ్మ రసం – టీ స్పూన్‌; పచ్చి మిర్చి – 2 (సన్నగా తరగాలి); వెల్లుల్లి రెబ్బలు – 2  (సన్నగా తరగాలి); అల్లం – చిన్నముక్క (తురమాలి).

పిండి తయారీకి: కారం – తగినంత; వాము – అర టీ స్పూన్‌; ధనియాల పొడి – టేబుల్‌ స్పూన్‌ (వేయించి, కచ్చాపచ్చాగా దంచాలి); తందూరీ మసాలా – తగినంత; బియ్యప్పిండి / కార్న్‌ ఫ్లోర్‌ – టేబుల్‌ స్పూన్‌; సెనగపిండి – 4 టేబుల్‌ స్పూన్లు; యోగర్ట్‌ – 2 టేబుల్‌ స్పూన్లు.

తయారీ: ∙చేప ముక్కలకు ఉప్పు, పసుపు, నిమ్మరసం, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి– అల్లం తరుగు వేసి కలిపి పైన మూత పెట్టి 20 నిమిషాలు అలాగే ఉంచాలి ∙స్టౌ మీద బాణలి పెట్టి కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి ∙ఒక గిన్నెలో పిండి, దాంతో పాటు మిగతా దినుసులన్నీ వేసి బాగా కలపాలి ∙సిద్ధంగా ఉంచుకున్న చేప ముక్కలకు పిండికి పట్టేలా కలపాలి ∙కావాలనుకుంటే పిండి మృదువుగా అవడానికి మరికాస్త యోగర్ట్‌ని వాడుకోవచ్చు ∙పిండి కోటింగ్‌ ఉన్న చేప ముక్కలను కాగుతున్న నూనెలో వేసి అన్నివైపులా వేయించాలి ∙అన్నీ బంగారు రంగు వచ్చేలా వేయించుకొని, ప్లేట్‌లోకి తీసుకోవాలి ∙వీటిని ఏదైనా సాస్, పుదీనా–కొత్తిమీర చట్నీతో సర్వ్‌ చేయాలి.

చికెన్‌ పకోడీ

కావలసినవి: చికెన్‌ (బోన్‌లెస్‌) – పావు కేజీ (250 గ్రా.లు); ఉల్లిపాయ – 1 (సన్నని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి); పచ్చి మిర్చి – 2 (సన్నగా తరగాలి); అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ – టీ స్పూన్‌; కారం – టీ స్పూన్‌ (తగినంత వేసుకోవచ్చు); గరం మసాలా– అర టీ స్పూన్‌; పసుపు – కొద్దిగా; ఉప్పు – తగినంత; కరివేపాకు – 2 రెమ్మలు; సెనగ పిండి – పావు కప్పు (విడిగా మరో 2 టేబుల్‌ స్పూన్లు); బియ్యప్పిండి లేదా కార్న్‌ ఫ్లోర్‌ – 3 టేబుల్‌ స్పూన్లు; గుడ్డు – 1 (తెల్లసొన మాత్రమే); నీళ్లు – తగినన్ని; నూనె – వేయించడానికి
తగినంత.

తయారీ: ∙ఒక వెడల్పాటి గిన్నెలో సెనగ పిండి, బియ్యప్పిండి, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి కలపాలి ∙అన్నీ సరిపడా ఉన్నాయా లేదా చెక్‌చేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, తరిగిన కరివేపాకు పచ్చిమిర్చి వేసి కలపాలి ∙చిన్న చిన్న క్యూబ్స్‌లా కట్‌ చేసుకున్న చికెన్‌ ముక్కలను వేసి బాగా కలపాలి ∙కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు ∙పిండి లూజ్‌గా కాకుండా, గట్టి ముద్దలా తయారుచేసుకోవాలి.

ఇలా వేయించాలి: ∙స్టౌ య్యి మీద బాణలి పెట్టి తగినంత నూనె పోసి వేడి చేయాలి ∙చేత్తో కొద్ది కొద్దిగా పిండి ముద్ద తీసుకొని కాగిన నూనెలో వేసి, వేయించాలి ∙నూనె వేడిని బట్టి మంటను సరిచూసుకోవాలి ∙చికెన్‌ ముక్కలు అన్ని వైపులా బాగా వేగాక ప్లేట్‌లోకి తీసుకోవాలి ∙ఈ చికెన్‌ పకోడీని పుదీనా చట్నీ లేదా సాస్‌తో వడ్డించాలి.

ప్రాన్‌ పకోడీ

కావలసినవి: రొయ్యలు – పావు కేజీ; పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు; ఉల్లిపాయలు – 6 (సన్నగా తరగాలి); అల్లం ముక్క – చిన్నది (సన్నగా తరగాలి); వెల్లుల్లి – 5 రెబ్బలు (క్రష్‌ చేయాలి); పచ్చి మిర్చి – 2 (సన్నగా తరగాలి); కారం – టీ స్పూన్‌; ఉప్పు – తగినంత.
మరి కొన్ని... ఉల్లిపాయ – 1 ; సోంపు – టీ స్పూన్‌; కొత్తిమీర తరుగు – పావు కప్పు ; బియ్యప్పిండి – 2 టేబుల్‌ స్పూన్లు; నూనె – వేయించడానికి తగినంత; కరివేపాకు, ఉల్లికాడలు – తగినన్ని.

తయారీ: ∙రొయ్యలను శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉంచాలి ∙రొయ్యలు, కొబ్బరి పొడి కలిపి గ్రైండ్‌ చేసుకోవాలి ∙వెడల్పాటి గిన్నెలో బియ్యప్పిండి, రొయ్యలు కొబ్బరి ముద్ద, ఉల్లితరుగు, కొత్తిమీర, సోంపు, ఉప్పు, కారం.. ఇతర దినుసులన్నీ వేసి ముద్దలా కలుపుకోవాలి ∙పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని, గుండ్రంగా చేసి, చేత్తో అదిమి పక్కన పెట్టాలి ∙స్టౌ మీద బాణలి పెట్టి, నూనె పోసి వేడిచేయాలి ∙కాగుతున్న నూనెలో 5–6 చొప్పున సిద్ధంగా ఉంచుకున్న బాల్స్‌ వేసి, రెండువైపులా బంగారు రంగు వచ్చేలా వేయించుకోవాలి ∙కొత్తిమీర చట్నీ లేదా సాస్‌తో సర్వ్‌ చేయాలి.

ఖీమా పకోడీ

కావలసినవి: మటన్‌ ఖీమా – 250 గ్రా.లు; గుడ్డు – 1; ఉల్లిపాయ – 1 (తరగాలి); పచ్చి మిర్చి – 4 (సన్నని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి); సెనగ పిండి – అర కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; కొత్తిమీర తరుగు – 3 టేబుల్‌ స్పూన్లు; అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ – టీ స్పూన్‌; కారం – టీ స్పూన్‌; గరం మసాలా – కొద్దిగా; వంట సొడా – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె –వేయించడానికి
తగినంత
తయారీ: ∙ఒక గిన్నెలో పై పదార్ధాలన్నీ వేసి బాగా కలపాలి ∙చిన్న ముద్దలు తీసుకొని, బాల్స్‌ చేసి చేత్తో అదిమి, పక్కనుంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, అదిమి ఉంచుకున్న బాల్స్‌ను ఉల్లి పకోడీల్లా కొద్ది కొద్దిగా పిండి చేత్తో తీసుకుంటూ కాగుతున్న నూనెలో వేసి, అన్నివైపులా బంగారు రంగు వచ్చేలా వేయించుకొని, తీయాలి ∙టొమాటో సాస్‌ లేదా కొత్తిమీర చట్నీతో వడ్డించాలి.

మరిన్ని వార్తలు