అలల ఫ్యాక్టరీతో విద్యుత్‌ ఉత్పత్తి...

15 Feb, 2019 00:23 IST|Sakshi

సముద్రపు అలల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేయడం కొత్త కాకపోయినప్పటికీ... చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసేందుకు ఎడిన్‌బరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ కొత్త యంత్రాన్ని తయారు చేశారు. ఇప్పటికే ఉన్న సముద్ర తరంగ జలశక్తి కేంద్రాల్లో వీటిని నేరుగా వాడుకోవచ్చు. లేదంటే విడిగానూ ఏర్పాటు చేసుకోవచ్చు. తాము తయారు చేసిన నమూనా యంత్రం ద్వారా 500 కిలోవాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని.. ఇది వంద ఇళ్లకు సరిపడా ఉంటుందని డేవిడ్‌ ఇన్‌గ్రామ్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు.

డై ఎలక్ట్రిక్‌ ఎలాస్టోమీటర్‌ జనరేటర్‌ అని పిలిచే ఈ కొత్తయంత్రం రబ్బరుతో తయారైంది.గొట్టాల పైభాగంలో ఈ రబ్బరుతో తయారైన భాగాలను ఏర్పాటు చేస్తారు. గొట్టాల అడుగు భాగం నుంచి అలలు ప్రయాణిస్తాయి. ఫలితంగా ఈ రబ్బరు భాగంలో ఉండే గాలి పైకి ఎగుస్తుంది.. అల వెనక్కు వెళ్లగానే గాలి కూడా వెళ్లిపోతుంది. ఈ క్రమంలో రబ్బరు భాగాలపైన ఉండే జనరేటర్లు కూడా పనిచేస్తాయి. విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయన్నమాట. ప్రస్తుతం తాము 25 మీటర్ల వ్యాసమున్న ట్యాంక్‌లో నమూనా యంత్రాన్ని పరిశీలిస్తున్నామని, అన్నీ సవ్యంగా సాగితే త్వరలోనే దీన్ని మార్కెట్‌లోకి తీసుకొస్తామని చెప్పారు.   

మరిన్ని వార్తలు