స్వర్గానికి ఓ దారి

21 Aug, 2018 00:29 IST|Sakshi

చెట్టు నీడ

ముగ్గురు వ్యక్తులు పుష్పక విమానంలో స్వర్గానికి వెళ్తున్నారు. కిందికి చూస్తుంటే వారికి ఎత్తయిన కొండమీద ఒక పాము కప్పను మింగుతున్న దృశ్యం కనిపించింది. వారిలో ఒకడు వెంటనే కప్ప పడుతున్న బాధను చూసి ‘‘సర్పరాజమా! పాపం ఆ కప్పపై నీకు జాలి లేదా? దానిని వదిలి పెట్టు’’ అన్నాడు. ఆ మాటలకు పాముకు కోపం వచ్చింది. ‘‘నా ఆహారం నేను తినడం కూడా తప్పేనా? పైగా దానిని వదిలిపెట్టు అని చెబుతున్నావా?  నీవు నరకానికి పో’’ అని శపించింది. అతడు నరకానికి వెళ్లాడు. రెండవ వ్యక్తి అది చూసి విభ్రాంతికి గురయ్యాడు. ఆ తరువాత సర్పాన్ని సమర్థిస్తూ ఇలా అన్నాడు: ‘‘కప్ప నీకు సహజమైన ఆహారం. నీవు దానిని భుజించి నీ ఆకలి తీర్చుకోవడం తప్పేమీ కాదు’’ అన్నాడు. 

ఆ మాటలకు కప్పకు కోపం వచ్చింది. ‘‘నన్ను భుజించమని సర్పానికి సలహా ఇస్తావా? దయ, జాలీ లేని ఓ బండ మనిషీ! నువ్వు నరకానికి పోతావు’’ అని శపించింది. అతడు కూడా నరకంలో పడ్డాడు. మూడవ వ్యక్తి మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు. దాంతో అతను స్వర్గానికి చేరుకున్నాడు. బహుశా ఈ ఇతివృత్తాన్ని బట్టే మింగమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అనే సామెత ఏర్పడి ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో ఏదో ఒకటి మాట్లాడడం కంటె, మౌనంగా ఉండటమే మేలని ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది. 
– డి.వి.ఆర్‌. 

మరిన్ని వార్తలు