వర్షాకాలం.. జిడ్డుగా ఉంటే..

25 Jun, 2015 00:18 IST|Sakshi
వర్షాకాలం.. జిడ్డుగా ఉంటే..

వర్షాకాలం చర్మం కొంత అయోమయాన్ని కలిగిస్తుంది.
వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు నూనెగ్రంథులు ఎక్కువ నూనెను స్రవించడంతో చర్మం జిడ్డుగా అనిపిస్తుంది.
వానలో తడిసి, ఆరగానే పొడిబారినట్టుగా గరుకుగా చేతికి తగులుతుంది.
ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే...


♦  ఇంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపాలలో కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసి, చర్మానికి బాగా ఇంకాక శుభ్రపరుచుకోవాలి.
♦  దానిమ్మలో చర్మం ముడతలు పడనివ్వని ఓషధ గుణాలు ఉన్నాయి. దీనిలో ఉండే విటమిన్-సి, యాంటీయాక్సిడెంట్లు ఈ కాలం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, కాంతిని పెంచుతాయి. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల దానిమ్మ రసం, కప్పుడు ఓట్స్, 2 టేబుల్‌స్పూన్ల తేనె, 2 టేబుల్ స్పూన్ల మజ్జిగ వేసి, కలపాలి. కాసేపు ఈ మిశ్రమాన్ని అలాగే ఉంచి, మెత్తగా అయ్యాక ముఖానికి, చేతులకు పట్టించి, మృదువుగా మసాజ్ చేయాలి. చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి. నిగారింపు పెరుగుతుంది.
♦  ఈ కాలం మాయిశ్చరైజర్ రాసుకోవచ్చా, లేదా! అనే సందేహం తలెత్తుతుంది. జిడ్డు ఎక్కువ అనిపించేది కాకుండానూ, అలాగని పొడిబారనీయని లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్ లేదా సీరమ్ ఎంచుకోవాలి.
♦  వాతావరణం మబ్బులుగా ఉంటుంది కదా, సన్‌స్క్రీన్ అవసరం ఉండదని చాలా మంది అభిప్రాయం. కానీ, మబ్బుల దాటుకుని వచ్చే సూర్యకాంతిలోనూ అతినీలలోహిత కిరణాలు ఉంటాయి. అందుకని బయటకు వెళ్లేముందు సన్‌ప్రొటెక్షన్ లోషన్ (ఎస్.పి.ఎఫ్ -30) రాసుకోవాలి.
♦  జిడ్డును నియంత్రించాలంటే 2 టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జు, టేబుల్‌స్పూన్ పెరుగు, టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ కలిపి, ముఖానికి రాసి, మసాజ్ చేయాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి.
♦  ముఖాన్ని శుభ్రపరుచుకోవడానికి పదే పదే సబ్బును ఉపయోగిస్తే చర్మం త్వరగా పొడిబారుతుంది. అందుకని సోప్-ఫ్రీ ఫేస్ వాష్ లేదా క్లెన్సర్ (మార్కెట్లో లభిస్తుంది) ని ఉపయోగించడం మేలు.

మరిన్ని వార్తలు