ఫైబర్‌ రైస్‌తో షుగర్‌ వ్యాధికి చెక్‌!

14 May, 2019 18:11 IST|Sakshi

న్యూఢిల్లీ: పాలిష్‌ చేసిన బియ్యం (వైట్‌ రైస్‌)కి స్వస్తిచెప్పి.. పీచు పదార్థం ఎక్కువగా లభించే రైస్‌ తీసుకుంటే మధుమేహం, బ్లడ్‌ షుగర్‌ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం నుంచి బయటపడవచ్చని మద్రాస్‌ డయాబెటిస్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. వైట్‌ రైస్‌ వాడకం వలన టైప్‌–2 మధుమేహం వస్తుంది. ఆపై కళ్లు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, నరాల బలహీనత వంటి ఇతర జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఫైబర్‌ ఎక్కువగా లభించే పదార్థాలు ఆహారంగా తీసుకుంటే బ్లడ్‌ షుగర్‌ స్థాయి అదుపులో ఉంటాయి. అందుకే వైట్‌ రైస్‌ స్థానంలో హై ఫైబర్‌ రైస్‌ను తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అధిక బరువు సమస్యకూ ఇది చక్కని పరిష్కారమని వివరించారు.

నిద్రలేమి, పని ఒత్తిడితో హై బీపీ!
మ్యూనిచ్‌: నిద్రలేమి, పని ఒత్తిడి అనేవి హైపర్‌ టెన్షన్‌కు కారణమవుతున్నాయని జర్మనీలోని మ్యూనిచ్‌ టెక్నికల్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటుందని వారు వెల్లడించారు. అలాంటి వారికి గుండె జబ్బులు సంభవించే అవకాశం ఎక్కువని తెలిపారు. అధ్యయనంలో భాగంగా 25 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న 2 వేల మంది బీపీ రోగులను పరిశీలించారు.

మరిన్ని వార్తలు