వారానికి 50 నిమిషాల జాగింగ్‌తో..

5 Nov, 2019 14:46 IST|Sakshi

లండన్‌ : సమయం సరిపోవడం లేదనో..మరే కారణాలతోనో వ్యాయామం జోలికి వెళ్లని వారికి తాజా అథ్యయనం ఊరట ఇస్తోంది. వారానికి ఒకసారి 50 నిమిషాల పాటు జాగింగ్‌ చేసినా మెరుగైన ఫలితాలు ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. జాగింగ్‌తో అకాల మరణం ముప్పు 30 శాతం తగ్గుతుందని, గుండె జబ్బులు, క్యాన్సర్‌ ముప్పునూ ఇది గణనీయంగా నిరోధిస్తుందని పరిశోధకులు తెలిపారు. రన్నింగ్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఇప్పటకే పలు సర్వేలు తేల్చిచెప్పాయి. వారంలో ప్రతి ఒక్కరూ కనీసం 75 నిమిషాల పాటు రన్నింగ్‌, స్విమ్మింగ్‌ వంట కఠిన వ్యాయామం చేయాలని పరిశోధకులు సూచించారు.

2,33,149 మందికి సంబంధించిన 14 అథ్యయనాల గణాంకాలను పరిశీలించిన మీదట విక్టోరియా యూనివర్సిటీ ఈ వివరాలు వెల్లడించింది. 30 సంవత్సరాల పాటు వారి ఆరోగ్యాన్ని ట్రాక్‌ చేసిన క్రమంలో సర్వే సాగిన మూడు దశాబ్ధాల కాలంలో వారిలో 25,951 మంది మరణించారు. అసలు పరగెత్తని వారితో పోలిస్తే రన్నింగ్‌ చేసే వారిలో ఏ కారణం చేతనైనా మరణించే రేటు 27 శాతం తక్కువ ఉన్నట్టు గుర్తించారు. రన్నింగ్‌లో వేగం ఎంతైనా ఫలితాల్లో మాత్రం వ్యత్యాసం లేదని వెల్లడైంది. గంటకు ఎనిమిది కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో వారానికి కనీసం 50 నిమిషాలు పరిగెత్తినా మెరుగైన ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ఉన్నట్టు తేలిందని పరిశోధకులు చెప్పారు. అథ్యయన వివరాలు బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మెడిసన్‌లో ప్రచురితమయ్యాయి.

మరిన్ని వార్తలు