మొదలెడితే 'ఆపమ్'...

11 Mar, 2016 23:04 IST|Sakshi
మొదలెడితే ఆపమ్...

ఆప్పమ్
 
కావల్సినవి
బియ్యం - అర కేజీ, పంచదార - చిటికెడు; ఉప్పు - తగినంత, ఈస్ట్ - టేబుల్ స్పూన్ (మార్కెట్లో రెడీ మేడ్ ఈస్ట్ లభిస్తుంది); ఇంట్లోనే ఈస్ట్ తయారీ: పావు కప్పు మైదా, టీ స్పూన్ పెరుగు, అర టీ స్పూన్ పంచదార, అర టీ స్పూన్ సోంపు పొడి తీసుకొని తగినన్ని వేడి నీళ్లు పోసి దోసె పిండిలా బాగా కలపాలి. దాదాపు ఒక రోజంతా ఈ మిశ్రమాన్ని అలాగే ఉంచితే పైన బుడగల్లా వస్తాయి. ఇలా తయారుచేసుకున్న దానినే ఈస్ట్ అంటారు. ఫ్రిజ్‌లో పెట్టి 7 రోజుల వరకు దీనిని వాడుకోవచ్చు)
 
తయారీ
రాత్రి పూట బియ్యం కడిగి, నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం బియ్యం మెత్తగా దోసె పిండిలా రుబ్బుకోవాలి.ఈ పిండిలో ఈస్ట్, పంచదార కలపాలి. తర్వాత ఉప్పు కలిపి ఆపమ్ కడాయిలో వేసి, ఉడికించి, బయటకు తీయాలి. (నాన్‌స్టిక్ కడాయిని కూడా వాడుకోవచ్చు) దీనికి కొబ్బరిపాలు,  కాయ్ స్టూ వడ్డించాలి.
 
కాయ్ స్టూ
కావల్సినవి
క్యారట్ - 50 గ్రా.లు, బీన్స్ - 50 గ్రా., బంగాళదుంపలు - 80 గ్రా.లు , బఠాణీలు - 30 గ్రా.లు, పచ్చిమిర్చి - 3, అల్లం తరుగు - టేబుల్ స్పూన్, ఉల్లిపాయ తరుగు - 2 టేబుల్ స్పూన్లు, లవంగాలు - 4, యాలకులు - 4, బిర్యానీ ఆకు - ఒకటి, కరివేపాకు - 1, కొబ్బరి నూనె - 30 ఎం. ఎల్, కొబ్బరి పాలు - 400 ఎం.ఎల్, మిరియాలు - టీ స్పూన్, ఉప్పు - రుచికి తగినంత
 
తయారీ

గిన్నెలో కొబ్బరి నూనె వేడి చేసి, మిరియాలు, బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాలు, మధ్యకు కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం తరుగు, కరివేపాకు వేసి వేయించాలి.ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యారట్, బంగాళదుంప ముక్కలు, పచ్చిబఠాణీలు, బీన్స్ వేసి వేగించాలి. దీంట్లో కొబ్బరి పాలు పోసి మిశ్రమం చిక్కబడేంతవరకు ఉడికించాలి.అన్నీ సరిపడా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని ఆపమ్‌కి కాంబినేషన్‌గా వడ్డించాలి.
 
మలబార్ పరాటా
కావల్సినవి
మైదా - అర కేజీ, పాలు - 100 ఎం.ఎల్; ఉప్పు - తగినంత, పంచదార - తగినంత, నూనె - 100 ఎం.ఎల్, నీళ్లు -తగినన్ని
 
తయారీ

మైదాలో ఉప్పు, పంచదార వేసి కలపాలి.దీంట్లో పాలు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. మూత పెట్టి అరగంట వదిలేయాలి.పిండిని సమ భాగాలు చేసుకొని ఉండలు చేయాలి. కొద్దిగా నూనె అద్దుకుంటూ పిండిని చపాతీలా చేసుకోవాలి. దీన్ని చుట్టలా చుట్టి, మళ్లీ గుండ్రటి ముద్దలా చేసుకోవాలి.ఇలా తయారుచేసుకున్నదాన్ని మళ్లీ చపాతీలా వత్తి, పెనం మీద నూనె వేసుకుంటూ కాల్చుకోవాలి. రెండువైపులా కాల్చుకున్నాక ఈ పరాటాలు పొరలు పొరలుగా వస్తాయి. ఏదైనా గ్రేవీ కర్రీతో వీటిని వడ్డించవచ్చు.
 
నెయ్ చోరు
కావల్సినవి
 బియ్యం - 250 గ్రా.లు, సోంపు - టీ స్పూన్, నెయ్యి - 50 ఎంఎల్, యాలకులు- 5, దాల్చిన చెక్క - చిన్న ముక్క, లవంగాలు - 5, బిర్యానీ ఆకు - 1, ఉల్లిపాయల తరుగు - 50 గ్రా.లు, పచ్చిమిర్చి - 4 (నిలువుగా కట్ చేయాలి), కరివేపాకు - 1 రెమ్మ, పాలు - 50 ఎం.ఎల్, ఉప్పు - తగినంత, నీళ్లు - తగినన్ని
 
తయారీ:   బియ్యాన్ని కడిగి, నానబెట్టాలి  గిన్నెలో నెయ్యి వేసి వేడి చేయాలి. దీంట్లో సోంపు, గరం మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.   బియ్యం వడకట్టి అందులో వేసి కలపాలి. దీంట్లో పాలు, తగినన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి కలపాలి. అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి సరిచూసుకొని అన్నం పూర్తిగా ఉడికాక దించాలి.
 
కోళి వర్తద్
కావల్సినవి
చికెన్ బోన్‌లెస్- అర కేజీ, కొబ్బరి నూనె - 80 ఎం.ఎల్, సోంపు - టీ స్పూన్, గరం మసాలా - 15 గ్రా.లు, ఉల్లిపాయల తరుగు - 100 గ్రా.లు, టొమాటో ముక్కలు - 180 గ్రా.లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 12. గ్రా.లు, పసుపు - చిటికెడు, ధనియాల పొడి - 2 టీ స్పూన్లు, కారం - 2 టీ స్పూన్లు, మిరియాల పొడి - చిటికెడు, కరివేపాకు - 1, ఉప్పు - తగినంత, కొబ్బరి తరుగు - 50 గ్రా.లు
 
తయారీ
చికెన్‌ను శుభ్రపరిచి, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్, కారం వేసి కలిపి పక్కన ఉంచాలి.కొబ్బరి నూనె వేడి చేసి అందులో సోంపు, గరం మసాలా, ఉల్లిపాయలు వేసి వేయించాలి. దీంట్లో టొమాటో ముక్కలు వేసి ఉడికించాలి.దీంట్లో చికెన్ ముక్కలు, కరివేపాకు వేసి కలిపి ఉడికించాలి. చికెన్ ఉడికిన తర్వాత ఉప్పు, కొత్తిమీర, కొబ్బరి తరుగు వేసి వేడి వేడిగా వడ్డించాలి.
 
ఎరచి ఉలర్తియదు
కావల్సినవి
మటన్ - 500 గ్రా.లు, కొబ్బరి నూనె - 80 ఎం.ఎల్, సోంపు - 10 గ్రా.లు, ఉల్లిపాయ తరుగు - 150 గ్రా.లు, కొబ్బరి తరుగు - 50 గ్రా.లు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 30 గ్రా.లు, కరివేపాకు - ఒకటి, పసుపు - అర టీ స్పూన్, ధనియాల పొడి - 30 గ్రా.లు, కారం - టేబుల్ స్పూన్, మసాలా - అర టీ స్పూన్, తరిగిన టొమాటో - కప్పు
 
తయారీ
మటన్‌ను శుభ్రపరిచి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు కలిపి పక్కన ఉంచాలి.కొబ్బరి నూనె వేడి చేసి అందులో సోంపు, ఉల్లిపాయలు వేసి వేగించాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దీంట్లో మటన్ వేసి కలిపి, కప్పుడు నీళ్లు పోసి ఉడికించాలి. మటన్ ముప్పావు వంతు ఉడికాక అందులో టొమాటో తరుగు, మిగిలిన మసాలా పొడులు వేసి ఉడకనివ్వాలి,. మటన్ ఉడికాక కరివేపాకు, కొబ్బరి తురుము వేసి వేడి వేడిగా అన్నంలోకి వడ్డించాలి.
 
పరుప్పు ప్రదమన్
కావల్సినవి
పెసరపప్పు - పావు కేజీ, బెల్లం - 400 గ్రా.లు, నెయ్యి - 100 గ్రా.లు, జీడిపప్పు - 50 గ్రా.లు, కొబ్బరి తరుగు - 3 టేబుల్ స్పూన్లు, కొబ్బరి పాలు - ఒకటిన్నర కప్పు, యాలకుల పొడి - పావు టీ స్పూన్, జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
 
తయారీ
కడాయిలో సగం నెయ్యి వేసి పెసరపప్పును దోరగా వేయించుకోవాలి  బెల్లంలో కప్పు నీళ్లు పోసి, కరిగించాలి  బెల్లం నీళ్లలో వేయించిన పెసరపప్పు వేసి ఉడికించాలి  పప్పు ఉడికాక, కొబ్బరి పాలు పోయాలి  కడాయిలో మిగతా సగం నెయ్యి వేసి జీడిపప్పు, కొబ్బరి తరుగు వేయించి ప్రదమన్‌లో కలపాలి. చివరగా యాలకుల పొడి వేసి దించాలి. కప్పులో పోసి వేడి వేడిగా అందించాలి. కావాలనుకుంటే దీంట్లో కిస్‌మిస్, బాదంపప్పులు కూడా వేసుకోవచ్చు.
 
ప్రయోగశాల
వంటగది ప్రయోగశాల వంటిది. శుచి, శుభ్రత పాటిస్తేనే పదార్థాల రుచి, మన ఆరోగ్యం పెరుగుతాయి.వంటకంలో పదార్థాలు ఎంత తాజాగా ఉంటే ఆ వంట అంత రుచిగా ఉంటుంది  నేటి రోజుల్లో అన్ని కాయ గూరలు, పండ్లు అన్ని కాలాల్లోనూ దొరుకుతున్నాయి. కానీ, రుచి మాత్రం ఉండటం లేదు పదార్థాలను కాలాను గుణంగా వాడితేనే వాటి రుచి, ప్రయోజనాలు మనకు అంతగా అందుతాయి.   మిక్సీలో కన్నా పిండి, పచ్చళ్లు రోట్లో నూరితే రుచి పెరగడానికి కారణం మన చేతి స్పర్శ.  
 
కరె్టిసీ:
సింప్లీ సౌత్
బై షెఫ్
చలపతి రావు,
ఫిల్మ్‌నగర్,
హైదరాబాద్
 

>
మరిన్ని వార్తలు