నట్‌ఇంట్లో

27 Aug, 2016 00:52 IST|Sakshi
నట్‌ఇంట్లో

నట్ అంటే ఏంటని గింజుకోకండి!
గింజల గురించి మాట్లాడుతున్నాం.
గింజల్లో పోషకాలుంటాయని అందరికీ తెలుసు.
మరి... ఇన్ని రుచులుంటాయని తెలుసా?
వంటింట్లో చేయండి...
నట్టింట్లో ఆస్వాదించండి.
వదలకండి. నట్ బిగించండి!!

 

ఉలవల రసం
కావలసినవి: ఉలవలు - 100 గ్రా; చింతపండు - 50 గ్రా మిరియాలు - 10 గ్రా; ఉప్పు - తగినంత  వెల్లుల్లి రేకలు- నాలుగు; కరివేపాకు- రెండు రెమ్మలు ఎండు మిర్చి - మూడు; పచ్చిమిర్చి- మూడు కారం- 20 గ్రా; జీలకర్ర- 10 గ్రా; కొత్తిమీర- చిన్న కట్ట ధనియాలు- 10 గ్రా; నూనె- ఒక టేబుల్ స్పూన్

తయారీ: ఉలవలను మూడు గంటల సేపు నానబెట్టాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో మెత్తగా ఉడికించి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. రుబ్బేటప్పుడు ఉలవకట్టు (ఉడికించిన ప్పుడు మిగిలిన నీరు), చింతపండు రసం కలపాలి. తగినంత ఉప్పు చేర్చాలి. ఇప్పుడు తాలింపు పెట్టాలి. ఒక గిన్నెలో నూనె వేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మిరియాలు,  ధనియాలు, వెల్లుల్లి రేకలు, జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత, కరివేపాకు వేయాలి. ఇప్పుడు ఉలవల రసం మిశ్రమాన్ని పోయాలి. చివరగా కొత్తిమీర వేసి వేడెక్కిన తర్వాత ఆపేయాలి. ఈ రసం వర్షాకాలం ఆరోగ్యానికి మంచిది.

 

రాజ్మా మసాలా కర్రీ
కావలసినవి: రాజ్మా గింజలు- 200 గ్రా నూనె - 4 టేబుల్ స్పూన్లు; పచ్చిమిర్చి- 6 టొమాటోలు- 4 పెద్దవి; వెల్లుల్లి రేకలు- 4  గరం మసాలా పొడి- 10 గ్రా కొత్తిమీర- ఒక కట్ట; ఉప్పు- తగినంత  ఉల్లిపాయలు- 2 (మీడియం సైజు)  క్రీమ్ - ఒక టీ స్పూన్; ఉప్పు- తగినంత  నెయ్యి- ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి- ఒక టీ స్పూన్ ధనియాలపొడి - ఒక టీ స్పూన్ రాజ్మా మసాలా పొడి- ఒక టేబుల్ స్పూన  వెన్న- ఒక టేబుల్ స్పూన్; కారం : టీ స్పూన్

 
తయారీ: రాజ్మా గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం ఉడికించి పక్కన పెట్టాలి. టొమాటోలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి తరగాలి. మందపాటి పెనం తీసుకుని నూనె వేసి కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి సన్నమంట మీద బంగారు రంగు వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రేకలు వేసి వేగిన తర్వాత టొమాటో ముక్కలు వేసి వేగేటప్పుడు నెయ్యి వేయాలి.

     
ఇప్పుడు ఉడికించిన రాజ్మా గింజలు (నీటితోపాటుగా), కారం, గరం మసాలా పొడి వేసి సన్నమంట మీద ఐదు నిమిషాలు ఉంచాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, రాజ్మా మసాలా పొడి, ఉప్పు వేసి బాగా కలిపి ఐదు నిమిషాల సేపు ఉడకనివ్వాలి. చివరగా వెన్న వేసి మంట తగ్గించి రెండు నిమిషాల తర్వాత క్రీమ్ వేసి దించేయాలి.

 

బొబ్బర్ల వడలు
కావలసినవి: అలసందలు (బొబ్బర్లు)- 100 గ్రా పచ్చి శనగలు- 25 గ్రా  మినప్పప్పు- 15 గ్రా పచ్చిమిర్చి- 15 గ్రా  ఉల్లిపాయ ముక్కలు- 10 గ్రా జీలకర్ర- 5గ్రా  ఉప్పు- తగినంత అల్లం తరుగు- రెండు గ్రాములు  నూనె- వేయించడానికి సరిపడినంత


తయారీ: అలసందలు, పచ్చిశనగలు, మినప్పప్పు కడిగి రెండు గంటల సేపు నానబెట్టాలి. అన్నింటినీ కలిపి ఉప్పు వేసి కొంచెం పలుకుగా రుబ్బాలి. పిండి మరీ జారుడుగా ఉండకూడదు. వడ చేయడానికి వీలుగా ఉండాలి. ఇందులో తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర వేసి బాగా కలపాలి.


బాణలిలో నూనె పోసుకుని కాగిన తర్వాత మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని వడలాగ వత్తి నూనెలో వేసి రెండు వైపులా దోరగా వేయించి తీయాలి. ఈ వడలకు కొబ్బరి పచ్చడి, టొమాటో పచ్చడి చక్కటి కాంబినేషన్. ఇదే పిండిని పకోడీల్లా వేసుకుంటే సూప్‌తో స్టార్టర్‌గా తినడానికి కూడా బాగుంటాయి.

 

కాజు-మోతీ పులావ్
కావలసినవి:  బాసుమతి బియ్యం- 200 గ్రా బిర్యానీ ఆకులు - రెండు ఉప్పు - తగినంత  జీడిపప్పు - 50 గ్రా  తాలింపు కోసం: నెయ్యి- మూడు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి- 5 (తరగాలి)  పుదీన- ఒక కట్ట  కొత్తిమీర- చిన్న కట్ట  ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు  జీలకర్ర- ఒక టీ స్పూన్ ధనియాలు- ఒక టీ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టేబుల్ స్పూన్


పన్నీర్ బాల్స్ కోసం:  పనీర్- 50 గ్రా  గరమ్ మసాలా పొడి- 10 గ్రా  కార్న్‌ఫ్లోర్- ఒక టీ స్పూన్  ఉప్పు- తగినంత నూనె- రెండు టేబుల్ స్పూన్లు

 
తయారీ: బియ్యాన్ని కడిగి అరగంట సేపు నానబెట్టాలి.   పన్నీరును తురిమి ఉప్పు, గరం మసాలా పొడి, కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలు చేయాలి. వాటిని నూనెలో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టాలి.  ఇప్పుడు బియ్యంలో బిర్యానీ ఆకులు, ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టాలి.  బాణలి పెట్టి నెయ్యి వేసి  జీడిపప్పును నేతిలో వేయించి పక్కన పెట్టాలి. మిగిలిన నెయ్యితో తాలింపు దినుసులన్నీ వేసి వేగనివ్వాలి. అందులో రైస్ కలిపి కాజు, వేయించిన పన్నీరు ఉండలతో గార్నిష్ చేయాలి.


హాజల్‌నట్ సూప్
కావలసినవి: బటర్- 15 గ్రా; మైదా-100 గ్రా; ఉప్పు : తగినంత  బే లీఫ్- ఒకటి; మిరియాలు- ఆరు గింజలు హాజల్‌నట్ - 50 గ్రా (వీటి బదులు బాదం తీసుకోవచ్చు) క్రీమ్- అర టీ స్పూన్; పాలు- 125 మి.లీ

 
తయారీ:  హాజల్ నట్ లేదా బాదం గింజలను పెనంలో దోరగా వేయించి చల్లారిన తర్వాత కొద్దిగా నీటిని చేరుస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి. గార్నిష్ కోసం కొన్ని పలుకులు పక్కన పెట్టుకోవాలి. పెనంలో వెన్న వేసి వేడెక్కిన తర్వాత మిరియాలు, బే లీఫ్, మైదా, ఉప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాలి.  మరొక పెనంలో పాలు పోసి కాగిన తర్వాత హాజల్‌నట్ లేదా బాదం గింజల పేస్టు వేసి కలుపుతూ ఐదు నిమిషాల సేపు మరగబెట్టాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మైదా మిశ్రమంలో నీటిని పోసి కలిపి మొత్తాన్ని పాలలో వేసి కలపాలి. మిశ్రమం వేడయిన తర్వాత దించి పైన క్రీమ్, బటర్, హాజల్‌నట్ లేదా బాదం పలుకులు వేసి సర్వ్ చేయాలి.

 

ఆపిల్ వాల్‌నట్ సలాడ్
కావలసినవి: ఆపిల్ - 150 గ్రా  వాల్‌నట్- 25 గ్రా సెలెరీ - రెండు కాడలు  (ఇది ఆకుకూరల్లో ఒక రకం. అది లేనప్పుడు ఉల్లికాడలు తీసుకోవాలి)  ఉప్పు - తగినంత  క్రీమ్- 25 మి.లీ  మయనైజ్ - 10 గ్రా లేదా వెన్న

తయారీ:  ఆపిల్‌ను శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి. సెలెరీ కాడలను సన్నగా తరగాలి. ఒక పాత్ర తీసుకుని ఆపిల్ ముక్కలు, సెలెరీ తరుగు, వాల్‌నట్, క్రీమ్, ఉప్పు, మయనైజ్ లేదా వెన్న వేసి కలపాలి.

 

పిస్తా  మిల్క్ షేక్
కావలసినవి: పిస్తా - 100 గ్రా  క్రీమ్ - 75 గ్రా  బటర్ - 15 గ్రా  చక్కెర - 100 గ్రా వెనిలా ఐస్‌క్రీమ్ - 50 గ్రా (రెండు స్కూప్‌లు)  పాలు- 100 మి.లీ పిస్తా ఎసెన్స్- రెండు చుక్కలు

తయారీ: పిస్తా ను అర గంట సేపు నానబెట్టి కొన్ని పలుకులు పక్కన ఉంచుకుని మిగిలిన వాటిని మెత్తగా పేస్టు చేయాలి. అందులో క్రీమ్, బటర్, చక్కెర, పాలు, పిస్తా పలుకులు, ఎసెన్స్ వేసి బాగా కలపాలి. తర్వాత ఐస్‌క్రీమ్ ఒక స్కూప్ వేసి ఒక మోస్తరుగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడవాటి గ్లాసులో పోసి మరొక ఐస్‌క్రీమ్ స్కూప్ వేసి పైన పిస్తా పలుకులతో గార్నిష్ చేయాలి. ఇష్టమైతే లిక్విడ్ చాకొలెట్ కూడా వేసుకోవచ్చు.

 

చెఫ్: రాఘవేంద్ర
హోటల్ ఇన్నర్ సర్కిల్, హైదరాబాద్

మరిన్ని వార్తలు