నేను మీ పేగుని

17 Feb, 2016 22:10 IST|Sakshi
నేను మీ పేగుని

ఆనంద్ శరీరంలో నేనో అనాకారి భాగాన్ని. మిగిలిన అవయవాలన్నీ వాటి పని అవి చేసుకుంటూ కాస్త మొహమాటానికి పోతాయి గానీ, నేనలా కాదు. బిగదీసే నొప్పి ద్వారా, ఇబ్బందికరమైన శబ్దాల ద్వారా ఆనంద్‌కు నా ఉనికిని నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటాను, ఒక్కోసారి అతిగా పనిచేస్తుంటాను. ఒక్కోసారి మందకొడిగా పనిచేస్తుంటాను. నేను ఆనంద్ పేగును. ఎనిమిది మీటర్ల పొడవు ఉంటాను.నేను లుంగలుగా చుట్టుకున్న పెద్ద గొట్టంలా తన శరీరంలో ఉంటానని ఆనంద్ అనుకుంటూ ఉంటాడు. నిజమే! నేను లుంగలుగా చుట్టుకున్న గొట్టాన్నే! అంతకు మించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను కూడా. నన్ను తనే పోషిస్తున్నాడని ఆనంద్ అనుకుంటూ ఉంటాడు. నిజానికి నేనే అతడిని పోషిస్తున్నాను.
 
ఆహారాన్ని ఆమోదయోగ్యంగా మారుస్తా
ఆనంద్ తినే ఆహారం నేరుగా రక్తంలో కలసిపోతే అది రక్తపింజర విషం కంటే ప్రమాదకరంగా మారుతుంది. అలాంటి ఆహారాన్ని నేను ఆమోదయోగ్యంగా తయారు చేస్తాను. అతడి రక్తప్రవాహంలో కలిసే సాధారణ పదార్థాలుగా విడగొడతాను. అవే అతడి శరీరంలోని లక్షలాది కోట్ల కణాలకు ఆహారంగా మారుతాయి. అతడి కండరాలకు శక్తినిస్తాయి. ఆనంద్ తినే ఆహారంలోని కొవ్వులను నేను ఫ్యాటీ యాసిడ్స్‌గా, గ్లిజరాల్‌గా మార్చేది నేనే. ప్రొటీన్స్‌ను అమినో యాసిడ్స్‌గా, పిండి పదార్థాలను గ్లూకోజ్‌గా మారుస్తాను. నాకు ఈ రసాయనిక శక్తే లేకుంటే, ఆనంద్ మనుగడ సాగించలేడు. అతడు తినే ఎలాంటి ఆహారాన్నయినా నేను జీర్ణం చేసుకుంటాను. తర్వాత ఆ ఆహారంలోని పోషకాలను అతడి రక్తంలోకి పంపుతాను. జీర్ణం చేసుకున్న తర్వాత నాలో మిగిలే వ్యర్థంలో కోట్లాది మృత బ్యాక్టీరియా కణాలు, కాస్త జారుడుగా ఉండే మ్యూకస్ నిండి ఉంటాయి. వాటితో పాటే నేను పీల్చుకోలేని పదార్థాలు కూడా ఉంటాయి.

దిగువభాగమే  సూక్ష్మజీవులకు ఆవాసం
నా నిర్మాణం సంక్లిష్టమైన జీర్ణక్రియకు అనుగుణంగా ఉంటుంది. కడుపు దిగువన ఉండే నా భాగాన్ని చిన్నపేగు అంటారు. ఇందులో ఎగువన 25 సెంటీమీటర్ల పొడవున ఉండే భాగాన్ని డువోడినమ్ అని అంటారు. దాని దిగువనే నాలుగు సెంటీమీటర్ల వ్యాసంతో రెండున్నర మీటర్ల పొడవున ఉండే భాగాన్ని జెజునమ్ అంటారు. నాలుగు మీటర్ల పొడవున ఉండే చివరి భాగాన్ని ఇలియమ్ అంటారు. దాని తర్వాత రెండు మీటర్ల పొడవున పెద్ద పేగు ఉంటుంది. సాధారణంగా నా పైభాగంలో ఎలాంటి సూక్ష్మజీవులు ఉండవు. కడుపులో తయారయ్యే శక్తిమంతమైన ఆమ్లాలు చాలావరకు సూక్ష్మజీవులను చంపేస్తాయి. అయితే, నా దిగువ భాగమే సూక్ష్మజీవులకు ఆవాసంగా ఉంటుంది. అక్కడ యాభై రకాలకు పైగా సూక్ష్మజీవులు లక్షల కోట్ల సంఖ్యలో ఉంటాయి.
 
మూడు నుంచి ఎనిమిది గంటల్లో జీర్ణం
ఆనంద్ తీసుకునే ఆహారాన్ని మొత్తంగా జీర్ణం చేసుకోవాలంటే, నా చిన్నపేగుకు మూడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది. ఆనంద్ మూడు పూటలా తింటుంటాడు. అందువల్ల నా చిన్నపేగుకు విశ్రాంతి లభించడమే అరుదు. చిన్నపేగు ద్వారా జీర్ణమైన ఆహారం చిక్కని ద్రవరూపంలో పెద్దపేగుకు చేరుకుంటుంది. పెద్దపేగు అందులోని నీటిని పీల్చేసుకుని, రక్తంలోకి పంపుతుంది. తీరికగా జరిగే ఈ ప్రక్రియకు 12 నుంచి 24 గంటల సమయం పడుతుంది. ఒకవేళ ఆనంద్ రోజు మొత్తంలో ఎనిమిది లీటర్ల నీటిని కోల్పోతే, కొద్ది వ్యవధిలోనే డీహైడ్రేషన్‌కు గురై పూర్తిగా శుష్కించిపోతాడు. పెద్దపేగు నీటిని పీల్చేసుకున్న తర్వాత అందులో మెత్తటి ఘనరూపంలో వ్యర్థపదార్థం మిగులుతుంది. నెమ్మదిగా ఇది అడుగు భాగానికి చేరి, బయటకు పోతుంది. అయితే, ఆనంద్ ఒకవేళ తీవ్రమైన ఒత్తిడికి గురైనా, పెద్దపేగులోకి ఆహారం చేరే వేగం పెరిగినా, బ్యాక్టీరియా సోకినా.. నీటిని పీల్చుకునే ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. అలాంటప్పుడు ఆనంద్‌కు నీళ్ల విరోచనాలు మొదలవుతాయి. ఒకవేళ ఆనంద్ దిగులుతో కుంగిపోతున్నా, పీచుపదార్థాలు తగినంతగా లేని ఆహారం తీసుకున్నా, తగినంత నీరు తాగకపోయినా అతడికి మలబద్ధకం మొదలవుతుంది. అయితే, మలబద్ధకం కంటే నీళ్ల విరోచనాలతోనే ప్రమాదం ఎక్కువ. వాటి వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆనంద్ మరింత ఎక్కువగా నీళ్లు, ద్రావకాలు తాగాల్సి ఉంటుంది.
 
నోటి నుంచే జీర్ణక్రియ ప్రారంభం
ఆనంద్‌లో జీర్ణక్రియ అతడి నోటి నుంచే ప్రారంభమవుతుంది. నోటితో నమిలి మింగిన ఆహారం కాస్త మెత్తటి స్థితిలో కడుపులోకి చేరుతుంది. కడుపు ఆ ఆహారాన్ని చిలికేస్తుంది. దాంతో చిక్కటి సూప్‌లా మారిన పదార్థం నాలోకి చేరుతుంది. ఈ ప్రక్రియకు కాస్త సమయం పడుతుంది. ఆనంద్ ఓ గ్లాసుడు నీరు తాగితే, ఆ నీరు నాలోకి చేరడానికి పది నిమిషాలు పడుతుంది. ఘనాహారం తీసుకుంటే, అది నా వరకు చేరడానికి నాలుగు గంటలు పడుతుంది. కడుపు నుంచి నాలోకి విడుదలయ్యే ఆహారం శక్తిమంతమైన యాసిడ్‌తో నిండి ఉంటుంది. కడుపు నుంచి నాలోకి ఒకేసారి పెద్దమొత్తంలో యాసిడ్ విడుదలైతే సున్నితమైన నా లైనింగ్ దెబ్బతింటుంది. దాంతో నేను జీర్ణక్రియను సక్రమంగా నిర్వర్తించలేను. అయితే, చాలా వరకు నేను నాలోకి చేరే యాసిడ్‌ను ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తాను. నాలోని డువోడినమ్ ఉత్పత్తి చేసే పదార్థం ఆనంద్ రక్తంలోకి చేరి, రక్తం ద్వారా అతడి క్లోమగ్రంథికి (పాంక్రియాస్‌కు) చేరుకుంటుంది. వెంటనే అతడి పాంక్రియాస్ క్షారస్వభావం గల జీర్ణరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ జీర్ణరసం నాలోని డువోడినమ్‌కు చేరి, అక్కడకు వచ్చిపడే యాసిడ్స్‌ను నిర్వీర్యం చేస్తాయి. పాంక్రియాస్ ఉత్పత్తి చేసే జీర్ణరసంలోని మూడు ముఖ్యమైన ఎంజైమ్స్ ఆహారంలోని ప్రొటీన్లు, కొవ్వులు, కార్బొహైడ్రేట్లను శరీరానికి పనికొచ్చేలా తయారు చేస్తాయి. పాంక్రియాస్ ద్వారా విడుదలయ్యే జీర్ణరసంతో పాటు నాలోకి వేర్వేరు మార్గాల ద్వారా రకరకాల రసాలు వచ్చి చేరుతూనే ఉంటాయి. నాలోకి రోజుకు రెండు లీటర్ల లాలాజలం, కడుపు ద్వారా మూడు లీటర్ల ఆమ్లరసాలు, లివర్ ద్వారా పిత్తరసం (బైల్), వివిధ గ్రంథుల ద్వారా మరో రెండు లీటర్ల స్రావాలు నాలోకి చేరుతాయి. ఈ ప్రక్రియకు ఏదైనా విఘాతం కలిగితే, ఆనంద్‌కు అల్సర్లు ఏర్పడతాయి. దాదాపు 75 శాతం అల్సర్లు డువోడినమ్‌లోనే ఏర్పడతాయి.
 
తిండి జాగ్రత్తతో సురక్షితంగా ఉంటా
చాలామందిలాగే ఆనంద్ కూడా తనకు తానే పెద్ద ఆహార నిపుణుడిని అనుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు తలెత్తే మలబద్ధకాన్ని వదిలించుకునేందుకు తనకు తోచిందల్లా తినేస్తూ ఉంటాడు. యవ్వనంలో సరే ఆనంద్ ఏం తిన్నా హరాయించుకునే శక్తి నాకు ఉండేది. ఈ నడివయసులోనూ అలాగే తింటే ఎలా కుదురుతుంది? ఆనంద్ కాస్త తిండి జాగ్రత్త పాటిస్తే చాలు, నేను సురక్షితంగా ఉంటా. అతడికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటా. ఈ వయసులో ఆనంద్ గ్యాస్‌ను అతిగా ఉత్పత్తి చేసే ఉల్లిపాయలు, క్యాబేజీ, బీన్స్ వంటివి అతిగా తినకుండా ఉంటేనే మంచిది. వాటి బదులుగా పుష్కలంగా ఆకుకూరలు, చిరుధాన్యాలు, పండ్లు తీసుకోవడం మంచిది. అలాగే తను బాగా నీరు కూడా తాగాలి. ఒత్తిడికి, దిగులుకు దూరంగా ప్రశాంతంగా ఉండాలి.
 
విశ్రాంతితో సర్దుకుంటా
చాలామందిలాగానే ఆనంద్ కూడా తిండి విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటాడు. ఒక్కోసారి వేళాపాళా లేకుండా తింటుంటాడు. నడి వయసుకొచ్చాననే ధ్యాస కూడా లేకుండా రుచుల కోసం ఆత్రపడి నాలుకకు నచ్చినదల్లా లాగించేస్తూ ఉంటాడు. నడి వయసుకు వచ్చే సరికి నా వెలుపలి వైపు చిన్న చిన్న బుడగల్లా ఏర్పడతాయి. ఇవి మహా అయితే ఒక ద్రాక్షపండు పరిమాణంలో ఉంటాయి. ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటే, వీటి వల్ల ప్రమాదమేమీ ఉండదు. ఇన్ఫెక్షన్లు సోకితే మాత్రం వీటికి వాపు ఏర్పడి నాకు ఇబ్బందులు కలుగుతాయి. వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు, కొన్ని రసాయనాల వల్ల ఇలా జరుగుతుంది. వాటి వల్ల నొప్పి, వికారం, నీళ్ల విరోచనాలు మొదలవుతాయి. అలాంటప్పుడు ఒక రోజంతా విశ్రాంతినిస్తే నా అంతట నేనే తేరుకుంటాను. నా పెద్ద పేగులో లైనింగ్ దెబ్బతిన్నప్పుడు కూడా కడుపునొప్పి తప్పదు. ఒత్తిడి, కుంగుబాటు వంటి కారణాల వల్ల కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. ఆనంద్ ఒత్తిడి నుంచి తేరుకుని, ప్రశాంతంగా మారితే నేనూ కోలుకుంటాను. పెద్దపేగు లోపలి గోడలు బాగా దెబ్బతిని అల్సర్ ఏర్పడితే, రక్తస్రావం కూడా జరగొచ్చు. అదృష్టవశాత్తు ఆనంద్‌కు ఇంతవరకు అలాంటి పరిస్థితి తలెత్తలేదు. ఒకవేళ ఆ పరిస్థితే తలెత్తితే, వైద్యుల సాయం తీసుకోక తప్పదు.
 
మూడ్స్‌తో మారే పనితీరు
ఆనంద్ శరీరంలోని చాలా ఇతర అవయవాల మాదిరిగానే నా పనితీరు కూడా అతడి మూడ్స్‌కు అనుగుణంగా మారుతూ ఉంటుంది. అతడి మూడ్స్ వల్ల ఒక్కోసారి నా కదలికలు వేగంగా మారడం లేదా ఒక్కోసారి కదలికలు నిలిచిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంతేకాదు, నేను ఆనంద్‌కు తరచుగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాను. ఒక్కోసారి శబ్దాలు తెప్పిస్తుంటా. నాలోని గ్యాస్ బుడగలు కదిలేటప్పుడు వచ్చే శబ్దాలవి. ఎక్కువగా అవి ఆనంద్ మింగిన గాలి వల్ల ఏర్పడినవే. అయితే, నేను కూడా కొంత గ్యాస్‌లను ఉత్పత్తి చేస్తా. వాటిలో ముఖ్యంగా మీథేన్, హైడ్రోజన్ ఉంటాయి.
 
 

మరిన్ని వార్తలు