ఉప్పు తెచ్చే ముప్పు

28 Dec, 2019 01:08 IST|Sakshi

ఆయుర్వేదం

ఉప్పుని శరీరానికి హితశత్రువు అనుకోవచ్చు. వంటకానికి రుచి తెప్పించి, నాలుకని ఆకర్షించి, మనిషిని తనకు బానిసగా మార్చేసుకుంటుంది ఉప్పు. ఉప్పుని సోడియం క్లోరైడ్‌ అంటారు. మానవ శరీరం అసంఖ్యాక కణజాల నిర్మితం. కణం లోపల ఉండే పొటాషియానికి, కణం బయట ఉండే సోడియానికి ఉండే పరిమాణ నిష్పత్తి 8:1; ఇది సృష్టి ధర్మం. ప్రకృతి దత్తమైన ఆహార పదార్థాలు అపక్వంగా ఉన్నప్పుడు వాటిలో ఉండే పొటాషియం, సోడియముల నిష్పత్తి దాదాపు 8:1 గానే ఉంటుంది. మన ఆహారసేవన లో ఈ రెంటి నిష్పత్తిని ఇలాగే కాపాడుకోవాలి. మనం వంట వండే విధానం వల్ల స్వతస్సిద్ధమైన పరిమాణాలు తారుమారవుతాయి. అంటే పొటాషియం తగ్గిపోయి, సోడియం గణనీయంగా పెరిగిపోవటం. ఇది ప్రమాదకరం. లవణాన్ని ఎక్కువ తినకూడదని ఆయుర్వేదం చెప్పింది.

చరక సంహిత విమానస్థానంలో: ‘‘అథ ఖలు త్రీణి ద్రవ్యాణి న అతి ఉపయుంజీతాధికం... పిప్పలీ క్షారం లవణమితి’ అంటే పిప్పళ్లు, క్షారం (కొన్ని ద్రవ్యాల నుండి వెలికి తీసిన గాఢమైన సారం), ఉప్పు ఎక్కువ తినవద్దు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ఒక వ్యక్తికి రోజుకి 3 – 5 గ్రాముల ఉప్పు సరిపోతుంది. (బయట కొన్న ఉప్పు, ప్రకృతి ద్రవ్యాలైన పళ్లు, ఆకు కూరలు, శాకాలు, పాలు మొదలైనవి కలిపి). కాని మనం రోజుకి 15 – 20 గ్రాములు సేవిస్తున్నాం. ఇలా తినడం అనేక రోగాలకు దారి తీస్తుంది.

పరిమిత పరిమాణంలో... వాగ్భట సంహితలో: లవణం స్తంభ సంఘాత బంధ విధ్మాపనో అగ్ని కృత్‌ స్వేహనః స్వేదనః తీక్ష›్ణ రోచనః ఛేద భేద కృత్‌ ‘‘ రుచిని పెంచుతుంది. జీర్ణక్రియ త్వరగా జరుగుతుంది. శరీరంలో కొవ్వును, కంతులను కరిగించి జడత్వాన్ని పోగొడుతుంది. స్వేదాన్ని కలిగిస్తుంది.

అతిగా సేవిస్తే అనర్థాలు
రక్తస్రావం, దప్పిక పెరుగుతాయి. బలం నశిస్తుంది. విషతుల్యం. సంధులలో వాపు పుడుతుంది. జుత్తు నెరుస్తుంది. బట్టతల, చర్మంలో ముడతలు, ఇతర చర్మ వికారాలు కలుగుతాయి.

సోతియుక్తో అస్రపవనం ఖలితం పలితం వలిమ్‌ తృట్‌ కుష్ఠ విషవిసర్పాన్‌ జనయేత్‌ క్షపయేత్‌ బలమ్‌
శరీరంలో నీటిని నిల్వ ఉండేట్టు చేసి, ఊబకాయం, వాపులు కలుగచేస్తుంది. రక్తనాళాల లోపలి పొరను గట్టిపరచి, రక్త ప్రసరణకు అవరోధం కలిగిస్తుంది. తద్వారా బీపీ పెరిగి.. పక్షవాతం, హార్ట్‌ ఎటాక్, కీళ్లవాపులు వంటి వ్యాధులకు దారి తీస్తుంది. నేటి జీవనశైలి వలన ఈ వ్యాధులు కలగడానికి మరింత దోహదం చేస్తుంది. మన రక్తంలోని గ్లూకోజ్‌.. కణాలలోనికి ప్రవేశించినప్పుడే శక్తి లభిస్తుంది. కణం యొక్క పొరను దాటి గ్లూకోజ్‌ లోపలకి వెళ్లాలంటే ఇన్సులిన్‌ హార్మోను అవసరం. అక్కడ ఇన్సులిన్‌ సక్రమంగా పనిచెయ్యాలంటే ఉప్పు తక్కువ స్థాయిలో ఉండా లి. అందువల్లే మధుమేహ రోగులు ఉప్పు తక్కువ తినాలి. ఇటీవలి కాలంలో జపాన్‌ శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు.

ఐదు రకాల లవణాలు
సాముద్ర లవణం (90 శాతం సోడియం క్లోరైడ్‌ ఉంటుంది), ఔద్భిజ లేక రోమ లవణం (70 శాతం n్చఛి , సైంధవ లవణం (టౌఛిజు ట్చ ్ట: 70% N్చఛి ) బిడాల లవణం (కరక్కాయ, ఉసిరికాయ వంటి కొన్ని ద్రవ్యాల సారాన్ని తీసి, ప్రత్యేకంగా తయారుచేస్తారు. 40% N్చఛి ) సౌవర్చ లవణం (భూమిలోని లోపలి పొరలు, నదీ తీర ప్రాంతాలు దీనికి మూలాధారం. 30% N్చఛి )

తప్పించుకోవడం ఎలా?
నిషిద్ధం: ఊరగాయలు, నిల్వపచ్చళ్లు, అప్పడాలు, వడియాలు, మజ్జిగ మిరపకాయలు వంటివి, ఉప్పు కారం చల్లిన వేపడాలు, డీప్‌ ఫ్రైలు మానేయాలి. ఉడికించిన కూరలలో నామ మాత్రం ఉప్పు అలవరచుకోవాలి. జంక్, ఫాస్ట్‌ ఫుడ్స్‌ జోలికి పోకూడదు. బజారులో ఉప్పు కొనడం తగ్గించాలి.

సేవించవలసినవి
ఫలాలు, డ్రై ఫ్రూట్స్,  కూరగాయలు, పాలు, బీట్‌రూట్, ముల్లంగి, ఆకు కూరలు, గ్రీన్‌సలాడ్సు మొదలైనవి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, చెరకురసం వంటివి. కాయగూరలు, పండ్లు మొదౖలñ నవి పెస్టిసైడ్స్, కార్బైడ్స్‌ యొక్క విష ప్రభావాలకు గురైనవే మనకు లభిస్తున్నాయి. ఆ విషాల్ని కొంతవరకు నాశనం చేయాలంటే... గోరువెచ్చని నీళ్లలో రెండు చెంచాలు ఉప్పు, ఒక చెంచా నిమ్మరసం వేసి అందులో కాయగూరల్ని కాని, పళ్లని కాని ఓ అరగంట నానబెట్టి, అనంతరం మంచినీటితో రెండు మూడు సార్లు కడుక్కోవాలి.

గమనిక
రుచుల కోసం పాకులాడితే వచ్చే రోగాలను ‘రుచి రోగాలు’ అంటారు. ఇవి కూడా ‘సుఖరోగాల’ వలే అనర్థదాయకం. ఆరోగ్యప్రదమైన కొత్త రుచులను అలవాటు చేసుకోవడానికి నాలుకకు రెండు వారాల సమయం చాలు.

మరిన్ని వార్తలు