నాన్‌–వెజ్‌ స్పెషల్

11 Jan, 2020 01:11 IST|Sakshi

పచ్చిమిర్చి కోడి పులావ్‌
కావల్సినవి: చికెన్‌ – అరకేజీ; పచ్చిమిర్చి పేస్ట్‌ – టేబుల్‌ స్పూన్‌; పచ్చిమిర్చి – 6 (పొడవుగా చీల్చాలి); కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు ; ఉప్పు – తగినంత; సాజీర – అర టీ స్పూన్‌; పసుపు – పావు టీ స్పూన్‌; మసాలా దినుసులు (దాల్చిన చెక్క–చిన్నముక్క, లవంగాలు – 4 , యాలకులు–4) ; కరివేపాకు – 2 రెమ్మలు; పుదీనా ఆకులు – అరకప్పు; పెరుగు – కప్పు ; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; ఉల్లిపాయల తరుగు – కప్పు; కొబ్బరి – పావు కప్పు; బాస్మతి బియ్యం – 2 కప్పులు; నీళ్లు – తగినన్ని ; నిమ్మరసం టేబుల్‌ స్పూన్‌.

తయారీ:
►బియ్యాన్ని కడిగి, నీళ్లలో నానబెట్టాలి
►చికెన్‌లో ఉప్పు, కొద్దిగా ధనియాలపొడి, పసుపు, పెరుగు, పుదీనా ఆకులు వేసి బాగా కలిపి పక్కనుంచాలి
►పొయ్యిమీద పాన్‌ పెట్టి, గరం మసాలా దినుసులన్నీ వేసి వేయించి పక్కనుంచాలి
►చల్లారాక పొడి చేసుకోవాలి ∙విడిగా కొబ్బరి తురుమును పేస్ట్‌లా గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి
►పులావ్‌ కోసం పొయ్యిమీద మందపాటి గిన్నె పెట్టి, వేడయ్యాక నూనె వెయ్యాలి
►వేడి నూనెలో సాజీర, ఉల్లిపాయలు వేపాలి ∙దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి కలపాలి
►ఆ తర్వాత పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, కట్‌ చేసిన మిర్చి, కరివేపాకు వేసి మూడు నిమిషాలు వేగనివ్వాలి
►కొబ్బరిపొడి, ధనియాల పొడి వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి
►మసాలా కలిపిన చికెన్‌ను వేసి, పదినిమిషాలు ఉడకనివ్వాలి
►ఆ తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి కలపాలి
►ఆ తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి, పైన మూత పెట్టి, మిశ్రమం అంతా ఉడకనివ్వాలి
►అన్నం పూర్తిగా ఉడికేంతవరకు ఉంచి, మూత తీసి పైన వేయించిన జీడిపప్పు పలుకులు, కొత్తిమీర ఆకులు చల్లి సన్నని మంట మీద మరికాసేపు ఉంచి, దించాలి.

గోంగూర మటన్‌
కావాల్సినవి: గోంగూర ఆకులు – 250 గ్రాములు; మేక మాంసం – 500 గ్రాములు; కొత్తిమీర – తగినంత; పుదీన – గుప్పెడు; ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి); అల్లం వెల్లుల్లిపేస్ట్‌ – 2 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూన్‌; కొబ్బరి తురుము – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; కారం – తగినంత; మసాలా – (లవంగాలు –4, యాలకులు –4, ధనియాలు టేబుల్‌ స్పూన్‌. ఇవన్నీ కలిపి వేయించి, పొడి చేయాలి); గసగసాలు – టీ స్పూన్‌.

తయారీ:
►మటన్‌ ముక్కలను వేడినీటిలో 10 నిమిషాలు ఉడికించాలి
►పొయ్యిమీద గిన్నెపెట్టి నూనె వేసి వేడిచేయాలి
►అందులో సాజీరా ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి
►అల్లం వెల్లుల్లి ఫేస్ట్, పుసుపు వేసి కలపాలి
►అందులో  మటన్‌ వేసి 5 నిమిషాలు ఉడికించాలి
►తగినంత కారం, ఉప్పు కలిపి ఉడికించాలి
►కొబ్బరి పొడి వేసి 15 నిమిషాలు ఉడికించాలి
►తరువాత తరిగిన గోంగూర ఆకులు వేసి ఉడికించాలి
►చివరగా గరం మసాలా, కొత్తి మీర వేసి దించాలి.  

మునక్కాయ చేపల కూర
కావలసినవి: కొరమీను చేప ముక్కలు – అరకేజీ; కారం – నాలుగు టీ స్పూన్లు; ధనియాల పొడి – రెండు టీ స్పూన్లు; చింతపండు గుజ్జు – అర కప్పు; కొబ్బరి పేస్ట్‌ – అర కప్పు; పచ్చిమిర్చి – 10 (కచ్చాపచ్చాగ దంచాలి); మునక్కాయలు – 2 (చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి); నూనె – అర కప్పు,; జీలకర్ర పొడి – టీ స్పూన్‌; ఎండుమిర్చి – 5, కరివేపాకు – రెమ్మ; పసుపు – అర టీ స్పూన్‌; ఉప్పు – తగినంత.

తయారీ:
►చేపముక్కలను శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోవాలి
►స్టౌ మీద పాన్‌ పెట్టి రెండు టీ స్పూన్ల నూనె వేసి వేడెక్కాక అందులో కొబ్బరి పేస్ట్, పచ్చిమిర్చి, ధనియాలపొడి, కారం, పసుపు తగినంత ఉప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి
►తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి మూతపెట్టాలి
►ఈ మిశ్రమం కాస్త చిక్కపడ్డాక అందులో కట్‌ చేసిన మునక్కాయ ముక్కలు, చింతపండు గుజ్జు పోసి సన్నటి సెగ మీద ఉంచాలి
►ఇది ఉడుకుతుండగా మధ్యలో చేప ముక్కలను కూడా జత చేసి మూతపెట్టాలి
►ఈ మిశ్రమమంతా చిక్కబడుతుండగా దించి వేరొక పాన్‌లో మిగిలిన నూనె వేయాలి
►అది వేడెక్కాక అందులో జీలకర్రపొడి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టాలి
►వేయించిన తాలింపును ఉడికించిన కూరలో కలిపి గిన్నెలోకి తీసుకోవాలి.

మరిన్ని వార్తలు