అక్రమాలకు అడ్డు రేఖ

27 Nov, 2019 01:56 IST|Sakshi

నడుస్తున్న జేసీబీని పట్టుకొని వేళ్లాడుతున్న ఒక మహిళ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రాజస్తాన్‌లోని మండావలాలో ఇది  జరిగింది. అసలు విషయం ఏంటంటే.. మండావలా సర్పంచ్‌ పేరు రేఖా దేవి. అదే గ్రామానికి చెందిన వాఘా రామ్‌ అనే వ్యక్తి  గ్రామ పంచాయతీకి చెందిన భూమిని ఆక్రమించుకున్నాడట. అప్పటి నుంచి సర్పంచ్‌ రేఖా దేవి అతని మీద ఎన్నోసార్లు ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం శూన్యం. వాఘా రామ్‌ ఆక్రమించుకున్న గ్రామ పంచాయతీ భూమిలో ఈ మధ్య అక్రమ కట్టడమేదో చేపట్టే పనిలోనూ పడ్డాడట. అందులో భాగంగానే జేసీబీ వాహనాన్ని తెచ్చి నిర్మాణపనులూ మొదలుపెట్టాడు.

ఇది తెలిసిన రేఖాదేవి ఉన్నపళంగా అక్కడికి వచ్చి ఆ కట్టడాన్ని ఆపే ప్రయత్నంలో లోడర్‌ బకెట్‌ను పట్టుకుంది. అది గమనించి కూడా జేసీబీ డ్రైవర్‌ వాహనాన్ని ఆపకుండా ఆ లోడర్‌ను పైకెత్తాడు. దాంతో రేఖాదేవి దానికి వేలాడింది. డ్రైవర్‌ అక్కడితో ఆగకుండా వాహనాన్ని అలాగే ముందుకు తీసుకెళ్లాడు. ఇది చూసి అక్కడున్న వాళ్లంతా పరిగెత్తుకుంటూ వచ్చి రేఖాదేవిని పట్టుకొని కిందకు దిగడంలో సాయపడ్డారు. ‘‘డ్రైవర్‌ కావాలనే ఇలా చేశాడు. ముందు నా మీద నుంచి తీసుకెళ్లి తర్వాత నా వెహికిల్‌నూ ఢీ కొట్టాలనుకున్నాడు. ఆగస్టు నుంచి ఈ భూమి వాఘా రామ్‌ కబ్జాలో ఉంది. ఇప్పుడు దీంట్లో అక్రమ కట్టడానికీ సాహసిస్తున్నాడు’’ అని చెప్తున్న అతనికి రేఖాదేవి కొంతమేరకు అడ్డురేఖ గీసినట్లే అయింది.

మరిన్ని వార్తలు