సూక్ష్మజీవులను నింపుకుంటే వ్యాధులు దూరం!

7 Jun, 2019 01:48 IST|Sakshi

పరి పరిశోధన

మన జీర్ణవ్యవస్థలో ఉండే సూక్ష్మజీవులకు, ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన బ్రాబ్రహమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు తాజాగా ఓ  ప్రయోగం చేపట్టారు. దీని ప్రకారం.. జీర్ణవ్యవస్థకు సంబంధించిన బ్యాక్టీరియాను కృత్రిమ పద్ధతుల ద్వారా చేర్చడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ పునరుజ్జీవం పొందుతుందని.. తద్వారా వ్యాధులను మరింత సమర్థంగా ఎదుర్కోవడం వీలవుతుందని ఈ పరిశోధన చెబుతోంది. తక్కువ వయసున్న ఎలుకల వ్యర్థాల నుంచి సేకరించిన బ్యాక్టీరియాను వయసు మీదపడిన ఎలుకల్లోకి జొప్పించినప్పుడు వాటి రోగ నిరోధక వ్యవస్థ పనితీరులో గణనీయమైన మార్పు కనిపించిందని ఈ పరిశోధనలకు నేతత్వం వహించిన శాస్త్రవేత్త మరిసా స్టెబెగ్‌ తెలిపారు.

పేవుల్లోని బ్యాక్టీరియాకు రోగనిరోధక వ్యవస్థకు మధ్య నిత్యం సమాచార వినిమయం జరుగుతూంటుందని వయసు పెరిగే కొద్దీ రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని మరిసా తెలిపారు. ఎలుకల్లో బాగా పనిచేసిన ఈ పద్ధతి మనుషుల్లోనూ పనిచేస్తుందా? లేదా? అన్నది ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉందని చెప్పారు. అయితే ఇప్పటికే జరిగిన కొన్ని పరిశోధనలు పేవుల్లోని బ్యాక్టీరియాకు, వయసుతోపాటు వచ్చే సమస్యలకు మధ్య సంబంధం ఉన్నట్లు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ తాజా పరిశోధనకు ప్రాముఖ్యత ఏర్పడింది. పరిశోధన వివరాలు నేచర్‌ కమ్యూనికేషన్స్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. 

మరిన్ని వార్తలు