వైఫై సంకేతాలతోనే స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్‌

31 Jan, 2019 00:40 IST|Sakshi

మీ స్మార్ట్‌ఫోన్‌ను ఇంట్లో ఉండే వైఫై రౌటర్‌తోనే చార్జ్‌ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? ఈ అద్భుతాన్ని సాకారం చేస్తామంటున్నారు మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. వినేందుకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ! కానీ రెక్టెన్నా అనే ప్రత్యేకమైన పరికరం సాయంతో ఇది చాలా సులువైన పనే అని అంటున్నారు టోమ్స్‌ పలాసియోస్‌ అనే శాస్త్రవేత్త. ఏసీ విద్యుత్తు ద్వారా పుట్టే విద్యుదయస్కాంత తరంగాలను డీసీ తరంగాలుగా మార్చే పరికరమే రెక్టెన్నా. ఎంఐటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన కొత్తరకం రెక్టెన్నా మాత్రం రేడియో తరంగాలను స్వీకరించి ఏసీ విద్యుత్‌తరంగాలుగా మారుస్తుందన్నమాట. అయితే ఇప్పటివరకూ రెక్టెన్నాతో ఉత్పత్తి చేయగలిగిన విద్యుత్తు చాలా తక్కువగా ఉండటంతో ఈ రెక్టెన్నాను విçస్త్రత స్థాయిలో వాడటం సాధ్యం కాలేదని తమ గాడ్జెట్‌తో ఈ పరిస్థితి మారిపోతుందని టోమ్స్‌ తెలిపారు.

నేచర్‌ మ్యాగజైన్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. ఈ కొత్తతరం రెక్టెన్నాను చాలా చౌకగా, సులువుగా తయారు చేయవచ్చు. హైవేల వెంబడి కొత్త రెక్టెన్నాలను భారీ సైజులో ఏర్పాటు చేయవచ్చునని తద్వారా బ్యాటరీల అవసరం లేకుండా ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లు అన్నింటినీ చార్జ్‌ చేయవచ్చునని తెలిపారు. ప్రయోగాత్మకంగా తాము తయారుచేసిన రెక్టెన్నాలతో 40 మైక్రోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగామని.. ఎల్‌ఈడీ స్క్రీన్లు మొదలుకొని అనేక వేరబుల్‌ గాడ్జెట్స్‌కు ఈ మాత్రం విద్యుత్తు సరిపోతుందని వివరించారు.  

మరిన్ని వార్తలు