స్నాకం 'పాకం'

13 Jul, 2019 12:16 IST|Sakshi

స్నాక్స్‌ను వండి ముక్కలు చేసి... మళ్లీ వండితే...ఆ స్నాకం కూరైతే, పులుసులో మునిగి తేలుతుంటే...అబ్భ! స్నాకం పాకమే... ప్లేట్‌లో ఓ కొత్త లోకమే...కాని... ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. ఇంటి మగాళ్లు వంటలో సాయం చేస్తే బాగుండును లేకపోతే పని డబుల్‌ అవుతుంది. ఇంకేం ఇద్దరూ వంట గదిలోకి ప్రవేశించండి...జంట వంటలను పూర్తి చేయండి...

బజ్జీ బిర్యానీ
కావలసినవి: మిర్చి బజ్జీలు – 6 (కొద్దిగా పెద్ద సైజు ముక్కలుగా కట్‌ చేయాలి); బాస్మతి బియ్యం – పావు కేజీ; బిర్యానీ మసాలా – రెండు టీ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి + ఉల్లిపాయ పేస్ట్‌ – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత; నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను; జీడిపప్పులు – ఒక టేబుల్‌ స్పూను

తయారీ: ∙బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి నానబెట్టాలి ∙స్టౌ మీద పాన్‌లో నెయ్యి వేసి కరిగాక పచ్చి మిర్చి + ఉల్లిపాయ పేస్ట్‌ వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి మరోమారు వేయించాలి ∙బిర్యానీ మసాలా జత చేసి ఒకసారి బాగా కలపాలి ∙నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని (నీళ్లు ఉంచాలి) జత చేసి బాగా కలియబెట్టాలి ∙ఉప్పు జత చేసి, స్టౌ మంట తగ్గించి, మరోమారు కలిపి మూత పెట్టాలి ∙సగం ఉడికిన తరవాత, మిర్చి బజ్జీ ముక్కలను జత చేసి కలిపి మూత ఉంచాలి ∙పది నిమిషాల పాటు బాగా ఉడికిన తరవాత దింపేయాలి ∙జీడి పప్పులతో అలంకరించి, కుర్మాతో వేడివేడిగా అందించాలి.

పెసరట్టుకూర
కావలసినవి: పెసరట్లు – 2 (పెసరపప్పుతో చేసినవి); ఉల్లి తరుగు – ఒక కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 3; గరం మసాలా – ఒక టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; నూనె – ఒక టేబుల్‌ స్పూను; కొత్తిమీర – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత.
తయారీ: ∙రెండు పెసరట్లను తీసుకుని చల్లారాక, చిన్న చిన్న ముక్కలు చేయాలి ∙ఉల్లి తరుగును మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి ∙ఉల్లి పేస్ట్‌ జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙పసుపు, మిరప కారం, గరం మసాలా, ఉప్పు జత చేసి మరో రెండు నిమిషాలు వేయించాలి ∙ఒక కప్పుడు నీళ్లు జత చేసి మరిగించి దింపేయాలి ∙పెసరట్టు ముక్కలు అందులో వేసి కలపాలి ∙కొత్తిమీర తరుగుతో అలంకరించాలి ∙అన్నంలో కమ్మటి నువ్వుల నూనె జత చేసి కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది.

వడలపులుసు
కావలసినవి: సెనగ పప్పు వడలు – 5; చిక్కటి మజ్జిగ – 2 కప్పులు; సొరకాయ ముక్కలు – అర కప్పు; ఉల్లిపాయ – 1 (పెద్ద ముక్కలు చేయాలి); మునగకాడ – 1 (పెద్ద ముక్కలు చేయాలి); తరిగిన పచ్చి మిర్చి – 4; సెనగ పిండి – ఒక టేబుల్‌ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; ధనియాలు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు కొబ్బరి ముక్కలు – పావు కప్పు; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; కొత్తిమీర – చిన్న కట్ట.
తయారీ: ∙ఒక పాత్రలో సొరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మునగకాడ ముక్కలు, తరిగిన పచ్చి మిర్చి, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙వేరొక పాత్రలో మజ్జిగకు సెనగ పిండి జత చేసి కవ్వంతో చిలికి, ఉడుకుతున్న ముక్కలలో వేసి కలపాలి ∙మిక్సీలో ధనియాలు, ఎండు కొబ్బరి ముక్కలు, అల్లం తురుము వేసి మెత్తగా మిక్సీ పట్టి, ఉడుకుతున్న పులుసులో వేసి కలియబెట్టాలి ∙ముందుగానే చేసుకున్న సెనగ వడలను ఉడుకుతున్న పులుసులో వేసి ఊరబెట్టాలి ∙స్టౌ మీద చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించి పులుసులో వేసి కలిపి, దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి  అన్నంతో కలిపి తింటే రుచిగా ఉంటుంది.

చల్లపునుగులకుర్మా
కావలసినవి: చల్ల పునుగులు – పది; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 4; టొమాటో తరుగు – ఒక కప్పు; బంగాళ దుంప – 1 (ఉడికించాలి); ధనియాల పొడి – ఒక టీ స్పూను; అల్లం + వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; కొత్తిమీర – అర కప్పు (మిక్సీలో వేసి మెత్తగా చేయాలి); బిర్యానీ ఆకు – 1; పుదీనా – కొద్దిగా; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను; నూనె – తగినంత.
తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక ఉల్లి తరుగు వేసి వేయించాలి ∙పచ్చి మిర్చి జత చేసి మరోమారు బాగా వేయించాలి ∙పసుపు జత చేయాలి ∙మిరప కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి కలియబెట్టాలి ∙బంగాళదుంప ముక్కలు జత చేసి మరోమారు కలపాలి ∙టొమాటో తరుగు జత చేసి బాగా కలిపి కొద్దిగా ఉడికించాలి ∙ఒక కప్పు నీళ్లు జత చేసి ఉడికించాలి ∙తగినంత ఉప్పు, బిర్యానీ ఆకు జత చేయాలి ∙పునుగులు వేసి ఉడికించాక, కొద్ది సేపటి తరవాత కొత్తిమీర పేస్ట్‌ వేసి బాగా కలపాలి ∙పది నిమిషాలు ఉడికించాక పుదీనా తరుగుతో అలంకరించి, దింపి, వేడివేడిగా అందించాలి.

పెసరట్లపులుసు(పెసలతోతయారు చేయాలి)
కావలసినవి: పెసలతో చేసిన పెసరట్టు – 1 (కొంచెం మందంగా ఉండాలి); నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; ఎండు మిర్చి – 3 ; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; ఉల్లి తరుగు – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; తరిగిన పచ్చి మిర్చి – 4; ధనియాల పొడి – ఒక టీ స్పూను; చింత పండు పులుసు – ఒక కప్పు (చింతపండును నానబెట్టి పల్చగా పులుసు తీయాలి); బెల్లం పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర – ఒక టీ స్పూను.
తయారీ: ∙పెసరట్టు వేసి వేడిగా ఉండగానే రోల్‌ చేసి, ముక్కలు చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి, తరిగిన పచ్చి మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙చింతపండు పులుసు, పసుపు జత చేసి ఉడికించాలి ∙బెల్లం పొడి, ధనియాల పొడి వేసి మరోమారు కలియబెట్టి ఉడికించాలి ∙పెసరట్టు ముక్కలు వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించాలి ∙కొత్తిమీర తరుగుతో అలంకరించి దింపేయాలి.

టొమాటోబజ్జీలకూర
కావలసినవి: టొమాటోలు – పావు కేజీ; బంగాళ దుంపలు – పావు కేజీ (ఉడికించి, తొక్క తీయాలి); నూనె – తగినంత; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 4; సెనగ పిండి – ఒక కప్పు; గరం మసాలా – 2 టీ స్పూన్లు; కొత్తిమీర తరుగు – ఒక కప్పు; ఉప్పు – తగినంత; పెసర పప్పు – 4 టీ స్పూన్లు (నానబెట్టాలి).
కూర పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; ఉప్పు – కొద్దిగా; ఉల్లి తరుగు – పావు కప్పు; నెయ్యి – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – ఒక టీ స్పూను.

తయారీ: ∙టొమాటోలను మధ్యకు కట్‌ చేసి పక్కన ఉంచాలి ∙నానబెట్టిన పెసర పప్పు, బంగాళ దుంపలను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి ∙ఈ మిశ్రమంలో గరం మసాలా, ఉప్పు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కొత్తి మీర తరుగులను కలిపి ముద్దగా చేయాలి ∙ఈ ముద్దలో నుంచి కొద్దికొద్దిగా తీసుకుని టొమాటోలోకి స్టఫ్‌ చేయాలి ∙ఈ టొమాటోలను జారుగా కలుపుకున్న సెనగ పిండిలో ముంచి, కాగిన నూనెలో వేసి దోరగా వేయించి బయటకు తీసుకోవాలి ∙స్టౌ మీద మరో బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి చిటపటలాడించాలి ∙ఉల్లి తరుగు జత చేసి బాగా కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న టొమాటో బజ్జీలను ఇందులో వేసి, కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి జత చేసి బాగా కలపాలి ∙కొద్దిగా నీళ్లు చల్లి, రెండు నిమిషాలు ఉడికించి దింపేయాలి.

మరిన్ని వార్తలు