సమ్పద
గంటల కొద్దీ క్యూలలో నిల్చొని సంపాదించిన కొత్త గులాబీ రంగు 2 వేల రూపాయల నోట్ల గురించి ఇప్పుడు దేశమంతా చర్చ. కొత్త నోటు కబుర్లు కొన్ని...
లాటరీ నోట్: చిన్నపిల్లలు ఆడుకొనే కరెన్సీలా ఉందనీ, ఫక్తు లాటరీ టికెట్లా ఉందనీ ఈ నోటు మీద కొందరు పెదవి విరిచారు. కాటన్ తీసుకొని దాని మీద రుద్దితే, రంగు అంటుతోందని కొందరు ప్రయోగాలు చేసి మరీ, వాట్సప్లో పెట్టారు.వెలిసిన కొత్త రంగు: ఈ కొత్త పెద్ద నోటు కూడా ఎన్నాళ్ళు చలామణీలో ఉంటుందో, ఏమో అని మరికొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లే ఈ కొత్త కరెన్సీ అప్పుడే రంగు వెలిసిపోతోందని గగ్గోలు మొదలైంది. చివరకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రంగంలోకి దిగి, ‘మహా ప్రభో! మన కరెన్సీ ప్రింటింగ్కి ఫలానా రకం ఇంకు వాడతాం. ఇదే కాదు... ఏ నోటును ఇలా రుద్దినా, రంగు పడుద్ది’ అని చెప్పాల్సి వచ్చింది.
ఎక్కడ ప్రింట్ చేస్తారంటే... మన కరెన్సీ అంతా మైసూరు, సల్బోనీ (పశ్చిమ బెంగాల్లో మిడ్నాపూర్కు దగ్గర), నాసిక్, దేవాస్లలోని ప్రెస్లలో ప్రింట్ చేస్తారు. ఇక మన హైదరాబాద్లో ఉన్న సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లో మాత్రం పాస్పోర్ట్, వీసా, ఐ.టి. రిఫండ్ ఆర్డర్లు, ఉన్నతాధి కారుల ఐడెంటిటీ కార్డులు, వారంట్ల లాంటి కరెన్సీ కాని సెక్యూరిటీ సామగ్రి ముద్రిస్తారు.
{పెస్ మొదలైంది మొన్న మొన్ననే! తాజా కొత్త కరెన్సీ 2 వేల నోట్లు అన్నీ మైసూరులోని ‘బ్యాంక్ నోట్ పేపర్ మిల్ ఇండియా ప్రైవేట్ లిమి.’లో ప్రింట య్యాయి. ఏడాది క్రితం గత నవంబర్ నుంచి ఈ ప్రెస్ పని చేస్తోంది. ఈ ఏడాదిలో ఉత్పత్తి మొదలెట్టిందట! రహస్య కోడ్! జూన్లో కొత్త 2 వేల రూపాయల నోట్ల ప్రింటింగ్ పని మొదలైంది. దాదాపు ఆ టైమ్ లోనే వెయ్యి నోటు ముద్రణ ఆపేశారు. కట్టలకొద్దీ ఈ కొత్త నోట్లను పెద్ద పెద్ద పెట్టెల్లో సర్దిపంపుతు న్నప్పుడు, ఆ పెట్టెల మీద ఏం రాశారో తెలుసా? ‘హెచ్.డి.’ అని రాశారు. అదేమిటి అంటారా? ‘హై డినామినేషన్’ (పెద్ద నోట్లు) అని రహస్య కోడ్.
నోరెత్తని వాళ్ళతో పని: మరో విషయం ఏమిటంటే, హై సెక్యూరిటీ గూడ్స్ అయిన ఈ పెట్టెల్ని అటూ ఇటూ తరలించేవాళ్ళకూ ఆ పెట్టెల్లో ఉన్నదేంటో తెలియదట! వాళ్ళు నోరు విప్పి అందులో ఏమున్నా యని అడగని రీతిలో వాళ్ళకి శిక్షణనిచ్చారట.
అయిదేళ్ళుగా ఇవే: గత అయిదేళ్ళలో 500 నోటు, 1000 నోటు వాడకం బాగా పెరిగింది. 2011 నుంచి 2016 మధ్య వెయ్యి నోటు వాడకం ఏకంగా 109 శాతం, 500 నోటు వాడకం 76 శాతం పెరిగింది. దేశంలో చలామణీలో ఉన్న కరెన్సీ నోట్లలో 86 శాతం ఈ వెయ్యి, 500ల పెద్ద నోట్లే!
దొంగ నోట్ల ప్రింటింగ్ అక్కడే: నకిలీ కరెన్సీ బెడదతో, కొత్త నోట్లు తెచ్చామని సర్కార్ వాదన. పాకిస్తాన్లోని క్వెట్టాలో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంది. మన భారతీయ కరెన్సీకి నకిలీ నోట్లు అక్కడ గుద్దుతున్నారట! ఈ దొంగ నోట్లను నేపాల్ గుండా మన దేశంలోకి గుమ్మరిస్తున్నారు.
వయా నేపాల్: నిజానికి, నేపాల్లో మన భారతీయ 500 నోటు, 1000 నోటు వాడకం నిషిద్ధం. 2005 నుంచే నిషేధం అమలులో ఉంది. రెండు రోజుల క్రితమే పోలీసులు నేపాల్ నుంచి ఇండియాకి పెద్ద నోట్లు తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ఇలా ఉండగా, అప్పుడే కొత్త 2 వేల నోట్లకి నకిలీవొచ్చాయంటూ వార్తలొస్తున్నాయి.
రద్దయిన నోట్లు ఏం చేస్తారు?: మన దగ్గర వసూలు చేసిన పాత పెద్ద నోట్లను ఏం చేస్తారు? అన్నీ రిజర్వ్ బ్యాంక్కి చేరతాయి. అక్కడ ఆ నోట్లను చింపి, పోగులు పెడతారు. ఆ పైన తగలబెట్టేస్తారు.
త్వరలో మరో వెయ్యి నోటు: కొత్త 2 వేల నోటు, 500 నోటు లానే, కొత్త వెయ్యి నోటూ రానుంది. కాస్త టైమ్ పడుతుంది. దాని డిజైన్ ఇంకా ఖరారు చేయలేదు. ఇంకో సంగతి తెలుసా? కొత్త 2 వేల నోట్ల ప్రింటింగ్ కూడా మైసూరులో ఆపేశారట. 2 వేల నోటుకి చిల్లర కోసం జనం తంటాలే ఆగలేదు.