దేవ జాలం

24 Jan, 2018 01:20 IST|Sakshi

నేను  నా దైవం

మనుషులకు మంచి విషయాలు చెప్పడానికి  పట్టాభిరామ్‌ ఇంద్రజాలాన్ని వాడుతారు అలా సమాజంలో అనుబంధాలను, ఆప్యాయతలను,  అనురాగాలను పెంపొందించే కృషి చేశారు. మంచి చెప్పడానికి ఇంద్రజాలాన్ని వాడినప్పుడు దైవత్వాన్ని అనుభూతి చెందడానికి  దేవజాలమే కరెక్ట్‌ మేజిక్‌ ఏమో కదా!


మెజీషియన్, సైకాలజిస్ట్‌ డా.బి.వి.పట్టాభిరామ్‌ క్లినిక్‌కి వెళ్లినప్పుడు ఎదురుగా బోర్డుమీద ‘యు ఆర్‌ ది డిజైనర్‌ ఆఫ్‌ యువర్‌ డెస్టినీ’ (నీ తలరాతకి నువ్వే సృష్టికర్తవు) అనే అక్షరాలు ఆకట్టుకున్నాయి. ఈ మధ్య అతి చిన్న చిన్న సమస్యలే పెద్దవి అయిపోయాయి. మనుషులు మనస్తత్వాలు మరీ సున్నితమైపోయాయంటూ సబ్జెక్ట్‌లోకి వెళ్లిపోయారు పట్టాభిరామ్‌. సైకాలజీలో ఇటీవల రెండో పీహెచ్‌డీ వచ్చిందని ఆనందంగా వివరించిన ఆయన ‘నా వృత్తే నాకు దైవం’ అంటూ చెప్పుకొచ్చారు...

దేవుడి గొప్పతనం మీకు మొదటిసారిగా ఎప్పుడు అర్థమైంది?
(చిన్నగా నవ్వుతూ) నాకు దేవుడి గొప్పతనం కంటే ముందు మనిషి గొప్పతనం అర్థమైంది.

వివరంగా చెబుతారా? 
నా చిన్నప్పుడు ఓసారి మా ఇంట్లో అంతా జాతకం చూపించుకుంటూ నా జాతకమూ చూపించారు. జ్యోతిష్యుడు నా జాతకం చూసి ‘వీడికి అక్షరమ్ముక్క అబ్బదు. ఈ కుటుంబంలో వీడు మహాదరిద్రుడు అవుతాడు. పైగా 16 ఏళ్ళకు మించి బతకడు’ అని చెప్పాడు.  భయపడిపోయాను. మా అమ్మ దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాను. ఆవిడ ఆ మాటను కొట్టి పడేస్తూ ‘ఒరే... మా నాన్న 80 ఏళ్లు బతికాడు. నువ్వూ అన్నేళ్లు బతుకుతావు. నీకు ఆయన గుణాలే వచ్చాయి. దిగులు పడకు’ అంది. ఇప్పుడు నా వయసు 66 ఏళ్లు. అమ్మ ఆ రోజు నన్ను అలా ‘మోటివేట్‌’ చేయకపోతే ఆ దిగులు నాలో అలాగే పడిపోయేదేమో. మనిషి గొప్పతనం మనిషి చేయగల మేజిక్‌ అప్పుడే నాకు అర్థమైంది. 

మరి దేవుడెప్పుడు తెలిశాడు?
నేను టెన్త్‌ పాసయ్యాక మా అమ్మ తిరుపతి తీసుకెళ్లింది. గుండు చేయించుకోమంది. నేను చేయించుకోనన్నాను. ‘తప్పు, నేను దేవుడికి మొక్కుకున్నాను. మొక్కు తీర్చుకోవాల్సిందే. మొక్కు తీర్చుకోకపోతే దేవుడు శిక్షిస్తాడు’ అంది. నిజమే అనుకొని ‘టోపీ కొనిస్తే గుండు చేయించుకుంటా’న ని చెప్పాను. గుండు చేయించుకున్నాను. టోపీ పెట్టుకున్నాను. తిరిగి వస్తుండగా మా నాన్న నన్నే చూస్తూ ‘టోపీ ఎందుకు పెట్టుకున్నావురా.’ అన్నాడు. ‘అంతా నన్నే చూస్తున్నారు సిగ్గుగా ఉంది’ అన్నాను. ‘అంటే నీ మీద నీకు విశ్వాసం లేదన్నమాట. అమ్మ చెప్పింది కదా అని చేయించుకున్నావు. పైగా దేవుడు శిక్షిస్తాడు అంది కదా. శిక్షించేవాడు దేవుడెలా అవుతాడురా. గుండు చేయించుకోవడం అంటే ఆకర్షణ కారణంగా వచ్చిన అహాన్ని దూరం చేసుకున్నానని చెప్పడానికి సూచిక. అదేదో తప్పు అయినట్టు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు. ఇదెందుకు సిగ్గుపడే పని అయింది చెప్పు’ అన్నాడు. వాస్తవం అనిపించింది. టోపీ తీసి రోడ్డు మీదకు విసిరేశాను. మూఢంగా నమ్మడం అప్పటి నుంచే మానేశాను. లాజికల్‌గా ఆలోచించడం మొదలుపెట్టాను.  అమ్మా నాన్నలు బిడ్డకు జన్మనివ్వడమే కాదు మంచి చెడులను చెప్పి జీవితంలో ఎదిగేందుకు చేయూతనిచ్చే దేవతలు. అమ్మనాన్నలను మించిన దేవతలు లేరు నాకు. ఆ తర్వాత నన్ను నిలబెట్టిన ఈ వృత్తి నాకు దైవం కన్నా ఎక్కువ. 

ఇంటి కన్నా గుడి పదిలం అన్నారు పెద్దలు. మీరు చెబుతున్నది చూస్తే గుడి కన్నా ఇల్లు పదిలం అన్నట్టుంది?
మా అమ్మనాన్నలకు 15 మంది సంతానం. 11 మంది అన్నదమ్ములం. నలుగురు అక్కచెల్లెళ్లు. వాళ్లు అంతమందిని ఎలా పెంచారో తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యమే. మా నాన్న తిట్టడం, కొట్టడం చూళ్లేదు నేను. కొన్ని నియమాలు మాత్రం కఠినంగా ఉండేవి. అందరం ఒకేసారి కూర్చొని భోజనం చేయాలి, రాత్రి 9కి అందరూ పడుకోవాలి. కలిసి పంచుకొని తినడంలో ఆనందం, కంటి నిండా నిద్రపోవడంలో ఆరోగ్యం ఆయన నుంచి మేం నేర్చుకున్నాం. మా ఇంట్లో అందరూ కళాకారులే. నాకు మేజిక్‌ కళ అబ్బినట్టే అందరికీ ఒక్కో కళలో ప్రవేశం, ప్రావీణ్యం ఉన్నాయి. ఇప్పటికీ ప్రతి రెండవ శనివారం అందరం ఒకచోట కలుస్తుంటాం. ఆ రోజు మాకు పెద్ద పండగ. ఏ ఒక్కరు మిస్‌ అయినా వాళ్లేదో పోగొట్టుకున్నట్టు ఫీల్‌ అవుతుంటారు. ఈ రోజుల్లో ఇంట్లో ఉండేది ఇద్దరో, ముగ్గురో.. అయినా ఒకరినొకరు మాట్లాడుకోరు. ఫోన్లలో చాట్‌ చేస్తూనో, టీవీ చూస్తోనో గడిపేస్తారు. మాట్లాడుకోవాలి, ఏది మాట్లాడకూడదో తెలుసుకొని ఆచరించాలి, కలిసి భోజనం చేయాలి, కుటుంబంలో అందరి మధ్య స్పర్శ ఉండాలి, ప్రశంస ఉండాలి, నవ్వు ఉండాలి.. ఇవి లేకనే బయటివారితో తమ ఆనందాలను వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇళ్లను వదిలి గుళ్లూ, గోపురాలలో కాలక్షేపం చేస్తున్నారు. 

మిమ్నల్ని మీరు హిప్నటైజ్‌ చేసుకుంటారా?
ప్రతి రోజూ హిçప్నటైజ్‌ చేసుకుంటాను. మనల్ని మనం తెలుసుకోవడం అవసరం. పాజిటివ్‌ ఆలోచనలు ఎంత పెంచుకుంటే అంత ప్రశాంతమైన జీవితం మనదవుతుంది. చెడు నన్ను పట్టుకుందా దాన్ని శుభ్రం చేసుకుంటాను. మంచి ఎక్కడైనా ఉందా అది తీసుకుంటాను. ఈ విధానంలో గొప్ప ప్రశాంతత చేకూరుతుంది. 

మీ దగ్గరకు వచ్చే కేసులలో ఈ కేసు దేవుడే డీల్‌ చేయాలని చేతులెత్తేసిన సందర్భం? 
అలాంటిదెప్పుడూ లేదు. పరిష్కారం చేయలేని కేసులంటూ ఏమీ ఉండవు. దాన్ని డీల్‌ చేసే విధానాలే వేరు వేరుగా ఉంటాయి. మనం చెప్పే విధానంలో ఆ క్లారిటీ ఉండాలి. నాకీ పని చేయడం రాదు, నేను ఇలాగే ఉంటాను అంటుంటారు కొందరు. అదొట్టి మూర్ఖత్వం. ముందు ఆచరణలో పెడితే తర్వాత అదే అలవాటవుతుంది. 

దేవుడి మహిమ వల్లే ఈ కేసు పరిష్కారం అయిందనుకున్న సందర్భం ఉందా
మీరు వచ్చే ముందే ఈ (‘సత్య నాదెళ్ల’ పుస్తకం చూపిస్తూ) పుస్తకం చదువుతున్నాను. ఈయనకి ఐఐటీలో సీటు రాలేదు. బిట్స్‌ పిలానీలో సీటు రాలేదు. డొనేషన్‌ కట్టి చదివాడు. కంప్యూటర్‌ ఇంజనీర్‌ కావాలన్నది ఆశయం. అతను ఇందులో చెప్పుకున్నాడు.. ‘నా గదిలో మా అమ్మ లక్ష్మీదేవి బొమ్మ పెట్టేది.. మా నాన్న కార్ల్‌మార్క్స్‌ బొమ్మ పెట్టేవాడు... నేను క్రికెటర్‌ జయసింహ ఫొటో పెట్టుకునేవాణ్ణి’ అని. ఆయన తన కలను నెరవేర్చుకోవడం కోసం కృషి చేశాడు. ఇప్పుడు మహామహా మేధావులు సైతం ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడతారు. ‘యు ఆర్‌ ది డిజైనర్‌ ఆఫ్‌ యువర్‌ డెస్టినీ’. నీ నుదుటి రాత దేవుడు రాయడు. పెన్ను, పేపర్‌ నీ చేతిలోనే ఉంది. నువ్వేది రాసుకుంటే అదే నీ జీవితం. నువ్వు కృషి చేయి. నీకు నేచర్‌ సపోర్ట్‌ చేస్తుంది. అంతేకానీ, దేవుడి మహిమలు అంటూ ఏమీ లేవు. 

మేజిక్‌ అంటే మాయ కదా!  డబ్బు మాయ, పదవి మాయ, మోహం మాయ.. మనిషి ఏ మాయ నుంచి జాగ్రత్తగా ఉండాలి.
డబ్బు గొప్పది. దీని కోసమేగా అందరం పనిచేసేది. మనిషి తనకు సరిపడా ఉన్నా ఇంకా ఇంకా సంపాదిస్తూనే ఉంటాడు. తరతరాలకు. ఆ డబ్బే అతన్ని సుఖపెడుతుంది. ఆ డబ్బే దుఃఖపెడుతుంది. డబ్బు మాయను అర్థం చేసుకొని ఆనందంగా బతికితే చాలు. 

మీ భార్యను మాయ చేసిన సందర్భం ఉందా? 
(నవ్వుతూ) మాయ అని చెప్పలేను. కానీ, వాస్తవంగా ఆలోచించినది ఆచరణలో పెట్టడానికి పెళ్లయ్యాక నాకు ఐదేళ్లు పట్టింది. మా ఆవిడకు గుళ్లకు వెళ్లడం, సంప్రదాయాలను పాటించడం చాలా ఇష్టం. అవి నన్నూ పాటించమంటే కష్టంగా ఉండేది. నా వృత్తికవి అడ్డంకి కూడా. ఇలా చెప్పి ఆమె మనసును నొప్పించకూడదు. అందుకని ఓ ప్లాన్‌ వేశాను.
‘ఏడాదిలో రెండుసార్లు అంటే, జనవరి 1న షిరిడీ వెళ్దాం. పెళ్లిరోజున తిరుపతిలో ఉందాం’ ఇలా ప్లాన్‌ చేసుకున్నాం. ఈ ప్లాన్‌ ఇంకో పదేళ్లయినా అలాగే కంటిన్యూ అవుతుంది. సంప్రదాయాలను మూఢంగా కాకుండా లాజికల్‌గా ఆలోచించి చేయమని చెబుతుంటాను. ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందండీ అంటుంది. అలా అయితే బిల్‌గేట్స్‌ ఇంటి ముందు ఎంత పెద్ద పెద్ద ముగ్గులు వేయాలి చెప్పు అంటాను నవ్వేస్తూ.. ఆలోచనల్లో పడుతుంది. 

ముక్కోటి దేవతలు ఉండగా జనాలు మీతో మొరపెట్టుకోవడానికి వస్తారెందుకు? 
ఇక్కడే అర్థం అవుతుందిగా. దేవతలు సమస్యలు సాల్వ్‌ చేయరని. సైకాలజిస్ట్‌లు అంటే ఎవరు..?  ఒకప్పటి తాతయ్యలు, నానమ్మలు. అప్పట్లో వాళ్లు అన్‌పెయిడ్‌ కౌన్సిలర్లు. ఇప్పుడు ఇళ్లలో వాళ్లు లేరు. అందుకే మా అవసరం వచ్చింది. మంచి, చెడులు చెప్పి బాంధవ్యాలు చక్కగా ఉండేలా చేసే పెద్దదిక్కులను ఆశ్రమాలకు పంపిస్తున్నాం. కనపడని దేవతలకు మొక్కుకుంటే ఎవరు వింటారు. ఆ ప్రాబ్లమ్‌ని ఎవరు సాల్వ్‌ చేస్తారు. 

దేవుడి సైకాలజీ ఏమిటి?
ప్రశాంతంగా ఉండటమే దేవుడి సైకాలజీ అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉండే స్థలంలోనే కదా దేవుడు ఉంటాడు. మరి ఆ దేవుడిని పూజించే మనం ప్రశాంతంగా ఉంటున్నామా? చాలా మంది ఫ్యామిలీ ఇష్యూస్‌తో మా వద్దకు వస్తుంటారు.  చెప్పిన మాట పిల్లలు వినడం లేదనో, భార్యాభర్తల బంధం సరిగా లేదనో.. అన్నీ కంప్లైంట్సే. చాలా చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద మనస్పర్ధలుగా మారి జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. అశాంతికి విరుగుడు ప్రశాంతత అని అర్థం చేసుకోవాలి. 

దేవుడికి కష్టం చెప్పుకోవచ్చా?
దేవుడికి కష్టం చెప్పుకుంటారు బానే ఉంది. వింటున్నాడనే నమ్మకం ఉందా. అలా అని నమ్ముతున్నారా? మరి మా దగ్గరకు వచ్చే జనం రోజు రోజుకూ పెరుగుతున్నారు ఎందుకు? అందుకే, మనం మనుషులతోనే మాట్లాడాలి. మనవాళ్లతో మనం మాట్లాడాలి. మన చుట్టూ ఉన్నవాళ్లతో మాట్లాడాలి. మాట కత్తికన్నా పదునైనది. నువ్వు మంచిగా మాట్లాడకపోయినా ఫర్వాలేదు. ఎదుటివారిని నొప్పించేవిధంగా మాత్రం మాట్లాడకూడదు. అది నీ ఆప్తులైనా సరే. అప్పుడే మనుషుల మధ్య బాంధవ్యాలు బాగుంటాయి. బాంధవ్యాలు బాగుంటే బతుకు బాగున్నట్టే.  
– నిర్మలారెడ్డి చిల్కమర్రి

మరిన్ని వార్తలు