పౌర రక్షణే ధ్యేయంగా పంచప్రాణాలు పణంగా...

5 May, 2020 04:14 IST|Sakshi
కూతురు తమన్నాతో కల్నల్‌ శర్మ

కల్నల్‌ శర్మ.. కూతురికి వంద ప్రామిస్‌లు చేశాడు. మేజర్‌ అనూజ్‌.. భార్యకు ‘లవ్యూ’ చెబుతూనే ఉన్నాడు. ఎస్సై సాగిర్‌.. పిల్లల్ని ఈద్‌ ప్రార్థన మర్చిపోవద్దన్నాడు. జవాన్‌లు రాజేశ్, దినేశ్‌.. ప్రతిజ్ఞ చేసి మరీ ఆర్మీకి వచ్చారు. శనివారం... జమ్మూ–కశ్మీర్‌లో.. భారీ ఉగ్రపోరు..! పౌరుల్ని రక్షించేందుకు ప్రాణాలు వదిలారు వీళ్లైదుగురు. ప్రామిస్‌లు, ప్రేమ, ప్రార్థన, ప్రతిజ్ఞ.. ఏమైనట్లు? నెరవేరినట్లే. ప్రాణ జ్యోతులు.. కళ్ల వెలుగులైనట్లే.

ఉత్తర కశ్మీర్‌ అడవుల్లోకి నలుగురు ముష్కరులు దిగబడ్డారని మే 1న ఇంటిలిజెన్స్‌ రిపోర్ట్‌! గాలింపు మొదలైంది. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ–కశ్మీర్‌ పోలీసులు చాంగిముల్లాను ఒక ఇంటిని చుట్టుముట్టారు. అందులో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారు. మహిళలు, పిల్లలు వారికి బందీగా ఉన్నారు. మిగతా ఇద్దరు ఉగ్రవాదులు అప్పటికే తప్పించుకున్నారు. హంద్వారా మండలం రజ్వార్‌ ప్రాంతంలోని అటవీ గ్రామం చాంగిముల్లా. శనివారం మధ్యాహ్నం 3.45కి ఎన్‌కౌంటర్‌ మొదలైంది.

కల్నల్‌ అశుతోష్‌ శర్మ, మేజర్‌ అనూజ్‌ సూద్, జవాన్‌లు నాయక్‌ రాజేశ్‌ కుమార్, లాన్స్‌ నాయక్‌ దినేశ్‌ సింగ్, జమ్మూ–కశ్మీర్‌ పోలీస్‌ సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ సాగిర్‌ అహ్మద్‌ పఠాన్‌ క్వాజీ ఆ ఆపరేషన్‌లో ఉన్నారు. ఒక ఉగ్రవాదిని హతం చేశారు. బందీలుగా ఉన్న పౌరుల్ని బయటికి రప్పించారు. ఇంకొక ఉగ్రవాది లోపలే ఉండిపోయాడు. ఎన్‌కౌంటర్‌ జరుగుతూనే ఉంది. తుపాకులు, గ్రెనేడ్‌ల చప్పుళ్లు. సాయంత్రం ఆరుగంటలకు నిశ్శబ్దం! అప్పటికే చీకటి పడుతోంది. ఆదివారం తెల్లారే మళ్లీ పోరు మొదలైంది. రెండో ఉగ్రవాదీ హతమయ్యాడు. అయితే భారత్‌ తన బలగాలనూ కోల్పోయింది. 21వ  రాష్ట్రీయ రైఫిల్స్‌ దళ కమాండర్‌ కల్నల్‌ శర్మతో పాటు ఆయన బృందంలోని నలుగురూ అమరులయ్యారు.

వీరమరణం పొందిన ఐదుగురిలో కల్నల్‌ శర్మ (44), మేజర్‌ అనూజ్‌ (30), ఎస్సై సాగిర్‌ (41) సీనియర్‌లు. మిగతా ఇద్దరు రాజేశ్‌ (29), దినేశ్‌ (24) యువ జవాన్‌లు. కల్నల్‌ శర్మది రాజస్థాన్‌. ఆర్మీ అంటే పిచ్చి. పట్టుబట్టి పదమూడు ప్రయత్నాలు చేసి ఆర్మీలోకి వచ్చారు. డేర్‌ డెవిల్‌ అని పేరు. ఇప్పటికి ముప్పైమందిని మట్టుపెట్టాడు. ఏడేళ్ల కూతురు ఉంది. బ్యారక్స్‌లో సాటి సైనికులతో ఎప్పుడూ తన కూతురు గురించే మురిపాల గొప్పలు. తమన్నా ఆ చిన్నారి పేరు. అతడి ఆలోచనల ప్రపంచం ఎప్పుడూ కూతురు చుట్టూనే తిరుగుతుండేది. కూతురితో కలిసి ఇటీవల దిగిన ఫొటో అతడి వాట్సాప్‌లో డిస్‌ప్లే పిక్‌గా ఉంది. తండ్రి ఒడిలో కూర్చొని అతడి మెడ చుట్టూ చేతులు వేసి నవ్వుతుంటుంది ఆ ఫొటోలో తమన్నా.

చివరిసారిగా కూతురితో కలిసి జైపుర్‌లో పిజ్జా తిన్నాడు. తమన్నాకు షాపింగ్‌ అంటే ఇష్టం. స్పోర్ట్స్‌ షూ కొనిపించుకునేది. తండ్రీకూతుళ్లిద్దరూ కలిసి కామిక్‌ యానిమేషన్‌ సినిమాలు చూసేవారు. ‘‘కల్నల్‌ శర్మకు తన కూతురంటే ఎంత ప్రాణం అంటే.. ఫోన్‌ మొదలైనప్పట్నుంచీ ప్రామిస్‌లు చేస్తూనే ఉంటాడు’’ అని చెబుతుండేవారు శర్మ పై అధికారి. శర్మ భార్య పల్లవి. ఆదివారమే ఆమెకు భర్త మరణం గురించి తెలిసింది. ‘‘మార్చిలో హోలీ పండక్కి ఇంటికి వచ్చారు. ఆర్మీలో ఉన్నవాళ్లకు డ్యూటీ ముఖ్యం. డ్యూటీలో ఏం జరిగినా అది డ్యూటీలో భాగమే’’ అని కూతుర్ని గుండెలకు చేర్చుకుని తనకొస్తున్న పరామర్శలకు బదులిస్తున్నారావిడ.
 
భార్య ఆకృతితో మేజర్‌ అనూజ్
మేజర్‌ అనూజతో కొద్ది రోజుల క్రితమే అతడి తండ్రి చంద్రకాంత్‌ సూద్‌ ఫోన్‌లో మాట్లాడారు. లాక్‌డౌన్‌ అయ్యాక ఇంటికి వస్తానని తండ్రితో చెప్పారు అనూజ్‌. వాళ్ల కుటుంబం పంజాబ్‌లోని నభాలో ఉంటోంది. రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్‌ ఆయన. మేజర్‌ అనూజ్‌కి కూడా కల్నల్‌ శర్మలా ఆర్మీలో చేరడం ఒక కల. 2017లో పెళ్లయింది. అనూజ్‌ భార్య ఆకృతి. పుణెలోని ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ధర్మశాలలో పుట్టింట్లో ఉన్నారు. పెళ్లయిన నాలుగేళ్లకే అనూజ్‌ జమ్మూ–కశ్మీర్‌ వెళ్లిపోయాడు. కుటుంబాన్ని నిర్మించుకోడానికి ఫోన్‌లోనే ఏవో కలల్ని అల్లుకుంటున్నారు. ఇటీవల కూడా ఆ కలల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత అతడు రావలసి ఉంది. అతడికి బదులుగా అతడు లేడన్న కబురొచ్చింది. వెంటనే ధర్మశాల (హిమాచల్‌ ప్రదేశ్‌) నుంచి మెట్టినింటికి ప్రయాణమయ్యారు ఆకృతి.  

ఎస్సై సాగిర్‌ అహ్మద్‌ స్వరాష్ట్రం జమ్మూ–కశ్మీరే. కుప్వారా జిల్లాలోని త్రాడ్‌ గ్రామం. 1999లో కానిస్టేబుల్‌గా చేరారు. స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూపులోకి కోరి మరీ మారారు. ఉగ్రవాదంపై పోరాడే గ్రూపు అది. సాగిర్‌ది పెద్ద కుటుంబం. ముగ్గురు కూతుళ్లు, కొడుకు, తల్లిదండ్రులు. పిల్లలు పైచదువులకు వచ్చారు. వాళ్లను ఆర్మీలో చేర్చాలని ఆయన తపన. భక్తి పరుడు. ఈద్‌ ప్రార్థనలను మర్చిపోవద్దని పిల్లలకు గుర్తు చేస్తుంటాడు. ఎన్‌కౌంటర్‌ అనగానే డిపార్ట్‌మెంట్‌లో మొదట సాగిర్‌ పేరే వస్తుంది. ధైర్యస్థుడిగా, సాహసిగా పేరుంది. షేర్‌–ఎ–కశ్మీర్‌ పోలీస్‌ మెడల్, రాష్ట్రపతి పతకం అందుకున్నారు.

జవాన్‌లు నాయక్‌ రాజేశ్‌ కుమార్, లాన్స్‌ నాయక్‌ దినేశ్‌ సింగ్‌లు ఇద్దరూ కూడా సైన్యంలో పని చేసిన కుటుంబాల వారే. రాజేశ్‌ది పంజాబ్‌. 3 గార్డ్స్‌ పేరెంట్‌ యూనిట్‌లో పని చేస్తున్నాడు. తల్లి బదామీదేవి చిన్నప్పుడు అతడికి పోరాట యోధుల కథలు చెప్పి సైన్యంపై ఆసక్తి కలిగించారు. దినేశ్‌ది ఉత్తరాఖండ్‌. 17 గార్డ్స్‌ పేరెంట్‌ యూనిట్‌లో చేస్తున్నాడు. అతడు ఆర్మీలో చేరేందుకు అతడి తల్లి తులసీదేవి స్ఫూర్తినిచ్చారు. తల్లుల ఆజ్ఞపై భరతభూమికి కంటికి రెప్పలా చూసుకుంటామని ప్రతిజ్ఞ చేసి ఆర్మీలో చేరారు ఈ యువకులిద్దరు. దేశ సైనికుల ప్రాణత్యాగాలు వృథాగా పోవు. దేశంలోని ప్రతి ఇల్లూ సైనికుడిదే. ప్రతి కుటుంబంలోనూ సైనికుడు సభ్యుడే. దీపం ఒక దీపాన్ని వెలిగించినట్లుగా అమర వీరులనుంచి ప్రసరించే స్ఫూర్తి వెలుగు.. హద్దు మీరిన ఉగ్రవాదంపై పోరాటానికి బాటలు వేసి భావితరాల వారి చేత బదులు ఇప్పిస్తుంది. అంతకంతా తీర్చుకుంటుంది.

మరిన్ని వార్తలు