హిట్టయ్యారు సెట్టయ్యారు!

30 Dec, 2017 00:15 IST|Sakshi

తెలుగు ఈ ఏడాది కళకళలాడింది! ప్రపంచ మహాసభల సంగతి కాదు.  పరభాషా హీరోయిన్‌లతో తెలుగు స్క్రీన్‌ ఒక వెలుగు వెలిగింది. కేరళ అమ్మాయిలు నివేథా థామస్‌ (22), అనూ ఇమ్మాన్యుయేల్‌ (20), కీర్తీ సురేశ్‌ (25); తమిళమ్మాయి సాయిపల్లవి (25); జబల్పూర్‌ బబ్లీ.. షాలినీ పాండే (24).. తెలుగు వెండి తెరకు బంగారు తళుకు బెళుకులు అద్ది, యువహృదయాలపై నాలుగు గుద్దులు గుద్ది.. తమకే పాపం తెలియనట్టు నెక్స్‌›్ట ప్రాజెక్ట్‌కి వెళ్లిపోయారు.ఒక్కొక్కరి ముఖాలు చూడండి ఎలా ఉన్నాయో! రోజు మార్నింగ్‌ లేవగానే పరగడుపున ఓ కప్పు అమృతం, మధ్యాహ్నం లంచ్‌కి మకరందం కలిపిన తేలికపాటి జ్యూస్‌లతో చిన్న కునుకు, రాత్రికి సప్పర్‌లో మైల్డ్‌గా ఓ గుప్పెడు తిండి గింజలు.. దేవకన్యల రెసిపీని ఎవరో దొంగిలించుకుని వచ్చి వీళ్లకు ఇచ్చినట్లున్నారు! యాక్టింగ్‌ మాత్రం? క్యారెక్టర్‌ని కర్కశంగా తొక్కి తైతక్కలాడేస్తున్నారు. కరకర నమిలి మింగేస్తున్నారు. ఎలా ఇంత ఈజ్‌ సాధించారు? ట్రైనింగ్‌ కొంతే.. ఇన్‌పుట్‌గా. మిగతాదంతా ఇన్‌బిల్ట్‌ కావచ్చు. బ్లడ్‌లో అభినయాన్ని మిక్స్‌ చేసి బ్రహ్మదేవుడు పై నుంచి నేరుగా కిందికి వీళ్లైదుగుర్నీ జారవిyì చినట్లున్నాడు! అక్కడి నుంచి మన డైరెక్టర్లు తెచ్చేసుకున్నారు. నివేథా థామస్‌ మూడు సినిమాల్లో; సాయి పల్లవి, అనూ ఇమ్మాన్యుయేల్‌ రెండ్రెండు సినిమాల్లో, కీర్తి సురేశ్, షాలినీ పాండే ఒక్కొక్క మూవీలో ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఎట్రాక్షన్‌ అయ్యారు. న్యూ ఇయర్‌లోనూ కొత్త పాత్రల్లో మెస్మరైజ్‌ చెయ్యబోతున్నారు.  ఎల్లుండే న్యూ ఇయర్‌. ఈ ఐదుగురు అమ్మాయిల గురించి కాస్త కాస్త అయినా చెప్పుకోకపోతే 2017 కంప్లీట్‌ అయినట్లు ఉండదు. 2018 మొదలు కాబోతున్నట్లూ ఉండదు. 

నివేథా థామస్‌ ఈ ఏడాది.. ‘నిన్ను కోరి’,  ౖ‘జె లవ కుశ’, ‘జూలియట్‌.. లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌’ చిత్రాల్లో నటించారు. ‘నిన్ను కోరి’ లవ్‌ మూవీ. మామూలు లవ్‌ కాదు. కాంప్లికేటెడ్‌ లవ్‌. మనిషొక దగ్గర, మనసొక దగ్గర ఉన్న పల్లవి క్యారెక్టర్‌లో.. మనిషి దగ్గరే మనసూ ఉండాలన్న ఎమోషన్స్‌కి ఒబే అవుతూ నివేథ ఇచ్చిన అభినయం ఔట్‌స్టాండింగ్‌. నాని హీరో. హీరోకి గట్టి పోటీ ఇచ్చింది నివేథ.రెండో చిత్రం ‘జై లవ కుశ’లో ‘జై’ మీద ప్రతీకారంతో రగిలిపోతుంటుంది నివేథ. ఎందుకంటే జై కారణంగా ఆమె అన్న చనిపోతాడు. అదీ ఆమె కోపం. జై మీద ప్రేమ ఉన్నట్లు నమ్మించి, అతణ్ణి ఫినిష్‌ చేయాలి. అదీ ఆమె ప్లాన్‌. పగనీ, ప్రేమనీ ఏకకాలంలో డెలివరీ చేయడం మాటలా! నివేథ చేసింది.మూడో మూవీ ‘జూలియట్‌.. లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌’. హీరో ఒక మెంటల్‌. మూడ్‌ స్వింగ్స్‌ అవుతుంటాయి. ‘నేనిలాగే ఉంటాను’ అంటాడు. వాడు ఆమెను ప్రేమిస్తే ఆమె వాడిని ప్రేమించవలసి వస్తుంది. షాకుల మీద షాకులు ఇస్తుంటాడు నివేథకి. అలాంటి వాడితో వేగడానికి, వేగుతున్నట్లు యాక్ట్‌ చెయ్యడానికి ఎంత క్యాలిబర్‌ కావాలి! అంత క్యాలిబర్‌తోనూ తనేమిటో చూపించింది నివేథ. 
      
కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్‌.. ఈ ఏడాది అనూ ఇమ్మాన్యుయేల్‌ నటించిన తెలుగు సినిమాలు. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ఓ తింగరి కామెడీ. రాజ్‌ తరుణ్‌ తింగరితనానికి తగినట్టుగా, అతడి ప్రేయసిగా నంగి నంగిగా నటించడం, నవ్వించడం అనూ పార్ట్‌. చక్కగా యాక్ట్‌ చేసింది. ‘ఆక్సిజన్‌’ అయితే అనూకు దాదాపుగా ఒక చాలెంజ్‌. గోపీచంద్‌ ఎత్తుగా, బలంగా ఉంటాడు. ఆయన పక్కన అంతే బలమైన హీరోయిన్‌ రాశీఖన్నా ఉంటుంది. అనూ స్మాల్‌ బర్డ్‌. అయినాగానీ చంద్‌ని చాంద్‌ కా తుక్‌డాగా ట్రిమ్‌ చేసింది. రాశీని ఓవర్‌టేక్‌ చేసింది. ఆ కళ్లు.. ఆ చూపు.. అనూకి గిఫ్ట్‌. 
    
కీర్తీ సురేశ్‌ ఈ ఏడాది తెలుగులో చేసింది ఒకటే మూవీ. ‘నేను లోకల్‌’లో కీర్తిగా. ఆ ఒక్క దెబ్బతో 2018లో ఆమె రెండు మూవీలు చేయబోతోంది. కథ మామూలే. నాన్న మాట జవదాటని అమ్మాయి, ఆ అమ్మాయిని ప్రేమించే ఓ అబ్బాయి. గొప్ప కాన్‌ఫ్లిక్ట్‌. ఈజీగా చేసేసింది కీర్తి. కళ్లతో, బుగ్గల్తో సగం ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చేస్తుంది. లవ్‌లీ ఫేస్‌ కట్స్‌. పర్‌ఫెక్ట్‌ ఫీలింగ్స్‌. నాని ఆమెను డిస్టర్బ్‌ చేయాలని చూస్తుంటాడు. కీర్తి డిస్టర్బ్‌ కాదు. మూవీ ఎండింగ్‌కి వస్తున్నప్పుడు మాత్రం తను డిస్టర్బ్‌ అయి, నానీని డిస్టర్బ్‌ చేస్తుంది. కష్టమైన క్యారెక్టర్‌. మనకు ఇష్టమైన క్యారెక్టర్‌ అయిపోతుంది.. సినిమా అయ్యేలోగా. 
      
‘ఫిదా’ గురించి చెప్పేదేముంది? ఉంది! సాయి పల్లవి యాక్షన్‌కే కదా ఆడియన్స్‌ అంతా ఫిదా అయిపోయింది. అందగత్తె అనడానికి లేదు. కాదనీ అనడానికి లేదు. తెలుగురాని ఒక తమిళమ్మాయి తెలంగాణ తెలుగులో కవ్వించడం, కొట్లాడడం, పోట్లాడ్డమే అందం అయింది. ఆ ముఖం మీద ఆ మొటిమలేంటి అని ఎవరూ అనుకోలేదు. లోపల లవ్‌ ఉంచుకుని, బయటికి లేనట్లుగా నటించడం సాయి పల్లవికే చెల్లిందేమో. ‘వచ్చిండే..’ అని పాటకు సాయి పల్లవి మాత్రమే డ్యాన్స్‌ చెయ్యగలదు. సాయి పల్లవిదే ఈ ఏడాది ఇంకో సినిమా ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’. లేటెస్ట్‌ రిలీజ్‌. తెలంగాణా ఇంటీరియర్స్‌కి, సాయి పల్లవికీ బాగా సెట్‌ అయినట్లుంది. ఈ మూవీలోనూ ఆ అమ్మాయి యాటిట్యూడ్‌ లంగరేసి లాగేస్తుంది. నానీని, మనల్నీనూ.
  
నివేథ, అనూ, కీర్తీ, సాయి, షాలినీ.. ఈ ఐదుగురూ ఒకే కాలేజీలోని క్లాస్‌మేట్స్‌లా ఉంటారు. తెలుగు ఇండస్ట్రీకి ఒకే టైమ్‌లో భలే సెట్‌ అయ్యారు. అంతా బిలో ట్వెంటీ ఫైవ్‌. నాలుగు భాషల్లో నటిస్తున్నారు. నాలుగు భాషల్లోనూ మాట్లాడతారు. ఐదుగురిలో ఉన్న ఒకే పోలిక ఏంటంటే.. చూడ్డానికి ఒకేలా ఉన్నా నటనలో ఎవరికీ ఎవరితో పోలిక లేకపోవడం. న్యూ ఇయర్‌లో రిలీజ్‌ అవుతున్న ‘అజ్ఞాతవాసి’లో అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. ‘మహానటి’లో కీర్తి సురేశ్, షాలినీ పాండే నటిస్తున్నారు.  నివేథా థామస్‌ కేరళలోని కన్ననూర్‌లో పుట్టింది. ప్రస్తుతం బి.ఆర్క్‌ ఫైనలియర్‌ చదువుతోంది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా 3, కథానాయికగా తమిళ, మలయాళ, తెలుగులో 13 సినిమాల్లో యాక్ట్‌ చేసింది.  అనూ ఇమ్మాన్యుయేల్‌ పుట్టిందీ, ఉంటున్నదీ చికాగోలో. హోమ్‌ టౌన్‌ కేరళలోని తళత్తంగyì . హయ్యర్‌ స్టడీస్‌ ఇంకా పూర్తి కాలేదు. ఇంతవరకు తెలుగు, తమిళ, మలయాళం కలిపి ఆరు చిత్రాల్లో నటించింది.  అజ్ఞాతవాసి, నాపేరు సూర్య, నాగచైతన్యతో చేస్తున్న మూవీ.. మేకింగ్‌లో ఉన్నాయి.  కీర్తి సురేశ్‌ జన్మస్థలం కేరళలోని త్రివేండ్రం. ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. మోడలింగ్‌లో కూడా కొన్నాళ్లు ఉంది. మొత్తం 14 సినిమాలు చేసింది. తెలుగులో ప్రస్తుతం అజ్ఞాతవాసి, మహానటి చిత్రాల్లో నటిస్తోంది. సాయిపల్లవి తమిళనాడులోని కోయంబత్తూరులో పుట్టింది. మెడిసిన్‌ చేసి సినిమాల్లోకి వచ్చింది. ఐదు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి. వాటిలో ఒకటి తెలుగు, రెండు తమిళ సినిమాలున్నాయి. షాలినీ పాండే మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో పుట్టింది. యాక్టింగ్‌ మీద ప్రేమతో ఇంట్లో చెప్పకుండా బయటికి వచ్చేసింది. ఇంజినీరింగ్‌ సెకండియర్‌ చదువుతుండగానే సినిమాల్లోకి వచ్చింది. ‘అర్జున్‌రెడ్డి’ ఆమె ఫస్ట్‌ మూవీ. ‘మహానటి’.. మేకింగ్‌లో ఉంది.  న్యూ ఇయర్‌లో వీళ్లవే మరికొన్ని సినిమాలు, కొత్తగా వచ్చేవాళ్లతో మరికొన్ని సినిమాలు రిలీజ్‌ అయితే మన తెలుగు సినిమాలకు, తెలుగు భాషకు ఢోకా లేనట్లే.

షాలినీ పాండే! ‘అర్జున్‌రెడ్డి’లో ఆమె చేసింది తక్కువ. అర్జున్‌రెడ్డికి చేసింది చాలా ఎక్కువ. కథని డ్రైÐŒ  చేసింది షాలినీనే. తక్కువ మాట్లాడి, ఎక్కువ కవర్‌ చేయడం తేలికేం కాదు. అర్జున్‌రెడ్డి ముద్దు పెట్టుకుంటున్నప్పుడు మౌనం, అర్జున్‌రెడ్డితో గొడవ పడ్డప్పుడు మౌనం, అమ్మానాన్న అర్జున్‌రెడ్డికి కాకుండా వేరేవాడికిచ్చి పెళ్లి చేస్తుంటే మౌనం.. ప్రతి ఫ్రేమ్‌లోనూ షాలిని మాటల కన్నా, మౌనమే ఎక్కువగా ధ్వనించింది. భాష లేకుండా భావాలతో నటనని ప్రదర్శించడం అంత ఈజీ ఏం కాదు. కానీ షాలినీ చేసింది. ప్రేమలో ఉన్న ఒక అమ్మాయి.. సొంతవాళ్లకు, తన సొంతం అనుకున్న వాడికీ మధ్య ఎలా నలిగిపోతుందో షాలినీ చూపించింది. బలహీనమైన కథని కూడా బలంగా నడిపించే టానిక్‌ షాలినీ చిరునవ్వులో ఒలుకుతూ ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీకి మరొక ప్రామిసింగ్‌ యాక్ట్రెస్‌ షాలినీ. 
  
 

మరిన్ని వార్తలు