అమ్మో మలేరియా బ్యాట్‌మ్యాన్

5 Jul, 2017 23:33 IST|Sakshi
అమ్మో మలేరియా బ్యాట్‌మ్యాన్

డే టైమ్‌లో ట్రాఫిక్‌ నైట్‌ టైమ్‌లో దోమలు ఒణికించేస్తున్నాయి. జుయ్‌మని వర్షాలకు బండ్లు జారిపడడం.. గుయ్‌మని వచ్చి కుట్టే దోమలకు
మన బండి మంచం మీద పడడం.. ఈ సీజన్‌లో వెరీ కామన్‌! సచిన్, ధోనీ, కొహ్లీ.. ఈ ముగ్గుర్నీ వేలంలో కొనుక్కుని బ్యాట్‌ చేతికిచ్చినా...
అంతా డకౌట్‌ అవుతారే తప్ప... దోమలు నాటౌట్‌. అంతేనా?! వాటి దెబ్బకు మన టెంపరేచర్‌ సెంచరీ దాటుతుంది. ఎలా మరి? జాగ్రత్తగా ఉంటే సరి.


దోమ సైజు చాలా చిన్నది. కానీ అది కలిగించే వ్యాధుల జాబితా మాత్రం పెద్దది. ఆ జాబితాలో ప్రస్తుతం విలయతాండవం చేస్తున్న వ్యాధి మలేరియా. ఏజెన్సీ ఏరియాలోని గిరిపుత్రుల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్న మలేరియా... కేవలం మన దగ్గర మాత్రమే కాదు ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో నమోదైన దేశాల సంఖ్య 192 అయితే ఇందులో దాదాపు 110 దేశాల్లో మలేరియా విజృంభిస్తోంది. అంటే... సగానికి పైగా గ్లోబును ఈ వ్యాధి భయపెడుతోందన్నమాట. ఆ మలేరియా గురించి అవగాహన కోసం ఈ కథనం.

ప్రధాన లక్షణాలు  
మలేరియా వ్యాధిలో ప్రధానంగా కనిపించే లక్షణం జ్వరం. రోగాన్ని కలిగించే పరాన్నజీవులు శరీరంలోకి ప్రవేశించగానే లక్షణాలు కనిపించవు. అవి ప్రవేశించిన నాటి నుంచి వ్యాధి లక్షణాలు బయటపడేవరకు పట్టే వ్యవధిని ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ అంటారు. దోమ కుట్టిన తర్వాత 7 నుంచి 14 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయి. చలితో పాటు తలనొప్పి ఉండి జ్వరం కనిపిస్తుండటం మలేరియా సాధారణ లక్షణం.  మలేరియా వ్యాధిని కలిగించే పరాన్న జీవి ప్రజాతిని బట్టి లక్షణాలూ కొద్దిగా మారతాయి. భారత్‌లో ప్రధానంగా రెండు రకాలు ఎక్కువ. వాటిల్లో ప్లాస్మోడియమ్‌ వైవాక్స్‌ కంటే ప్లాస్మోడియమ్‌ ఫ్యాల్సిపేరమ్‌ తీవ్రత చాలా ఎక్కువ.

ఎందుకంటే ఫ్యాల్సిపేరమ్‌ రకానికి చెందిన పరాన్నజీవులు ఎర్రరక్తకణాల్లో తమ అభివృద్ధిని చాలా వేగంగా సాగిస్తాయి. దాంతో రోగి కోమాలోకి వెళ్లడానికి అవకాశాలు ఎక్కువ. ఫ్యాల్సిపేరమ్‌ రకానికి చెందిన మలేరియా వల్ల శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, కామెర్లు, మూత్రపిండాలు విఫలం కావడంతో పాటు, నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి మృత్యువు కూడా దారితీయవచ్చు.

స్థూలంగా కనిపించేవి
జ్వరం ∙తలనొప్పి ∙తీవ్రమైన ఒళ్లునొప్పులు

జ్వరం : ఎర్రరక్తకణాల్లో ప్రత్యుత్పత్తి తర్వాత కణాలు పెరిగి ఎర్రరక్తకణాలు విచ్ఛిన్నమై మెరోజాయిట్స్‌ను విడుదల చేసినప్పుడు జ్వరం వస్తుంది.

చలి : మొదట చలి వస్తుంది. ఆ తర్వాత విపరీతమైన చెమటలు పడతాయి.

లక్షణాల్లో తేడాలిలా...
ఎర్రరక్తకణాల నుంచి వచ్చే మెరోజాయిట్స్‌ విడుదల అనే అంశం వేర్వేరు రకాలు ప్రజాతుల్లో వేర్వేరు వ్యవధుల్లో ఉంటుంది. అందువల్ల జ్వరం వచ్చే తీరు, వ్యవధి ఒక్కొక్క ప్రజాతిలో ఒక్కోలా ఉంటుంది. ఫ్యాల్సిపేరమ్, వైవాక్స్, ఒవేల్‌లో ప్రతి 48 గంటలకు ఒకసారి జ్వరం వస్తుంది. అదే మలేరీ ప్రజాతి ఇన్ఫెక్షన్‌ సోకినప్పుడు జ్వరం ప్రతి 72 గంటలకు ఒకసారి వస్తుంది.

నిర్ధారణ... ఇటీవలి కాలంలో అభివృద్ధి
మలేరియా నిర్ధారణ కోసం రక్తపరీక్షపై ఆధారపడటం అన్నది సాధారణంగా ఇప్పటివరకూ జరుగుతూ వస్తున్న ప్రక్రియ. అయితే ఇటీవల ఈ రంగంలో చోటు చేసుకున్న అభివృద్ధి కారణంగా చాలా చవకగానూ, విస్తృతంగానూ లభ్యమవుతున్న ‘డిప్‌–స్టిక్‌’ పద్ధతి ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ కేవలం 15 నిమిషాల్లోనే జరుగుతోంది. పైగా ఈ పరీక్ష ఫలితాలు చాలా ఖచ్చితమైనవి కూడా.

గతంలోని పరీక్షలు
రక్త పరీక్ష : థిక్‌ అండ్‌ థిన్‌ స్మియర్, జిమ్మ్సా స్టెయిన్‌ పరీక్షలు. ఒకసారి పరీక్షలు చేసిన వెంటనే మలేరియా పరాన్నజీవి కనుగొనకపోతే... రెండు, మూడు రోజుల పాటు వరసగా రక్తపరీక్ష చేయాల్సి ఉంటుంది.

ర్యాపిడ్‌ డయాగ్నస్టిక్‌ టెస్ట్‌ : మలేరియా యాంటిజెన్‌ను త్వరగా గుర్తించగలిగే పరీక్షలు, పారసైట్‌–ఎఫ్, ఆప్టిమల్‌ టెస్ట్స్‌... ఇవన్నీ ర్యాపిడ్‌ డయాగ్నస్టిక్‌ తరహాకు చెందినవి. అయితే పీసీఆర్‌ టెస్ట్, మలేరియా యాంటీబాడీస్‌ టెస్ట్‌ అనే తరహా పరీక్షలు కూడా ఉన్నాయి గాని, ప్రస్తుతం వీటిని పెద్దగా వాడటం లేదు.

చికిత్సలో విప్లవాత్మకమైన పురోగతి
గతంలో మలేరియా చికిత్స క్వినైన్, క్లోరోక్విన్‌ వంటి సంప్రదాయ మందులతో చేసేవారు. కానీ డాక్టర్లు అందుబాటులో లేని చోట కూడా విస్తృతంగా లభ్యమయ్యే ఆ మందుల పట్ల మలేరియా పరాన్నజీవులు తమ నిరోధక శక్తిని పెంచుకున్నాయి. అందుకే ఆ మందుల లభ్యతపై కొంత నియంత్రణ విధించాల్సి వచ్చింది.

సాధారణ చికిత్స ప్రక్రియలు
తొలుత మలేరియా వ్యాధి అని నిర్ధారణ చేసుకున్న తర్వాత అది వైవాక్స్‌ లాంటిదా లేక తీవ్రమైన ఫ్యాల్సిపేరమ్‌ తరహాదా అని పరిశీలిస్తారు. వైవాక్స్‌ లాంటి సాధారణ మలేరియాకు రోగిని ఇంట్లో ఉంచే చికిత్స చేయవచ్చు. సాధారణ క్లోరోక్విన్‌ వంటి మందులతో పాటు పుష్టికరమైన ఆహారం, మంచి విశ్రాంతితో ఈ తరహా మలేరియా త్వరగానే అదుపులోకి వస్తుంది. ఇక కేవలం మందుల విషయానికి వస్తే... ప్లాస్మోడియం వైవాక్స్‌ ఇన్ఫెక్షన్‌ సోకితే చికిత్స అనంతరం ప్రైమాక్వైన్‌ టాబ్లెట్స్‌ (15 ఎంజీ) రెండు వారాల కోర్సు వాడాల్సి ఉంటుంది.

ఫ్యాల్సిపేరమ్‌ అయితే...
ఒకవేళ అది తీవ్రప్రభావం చూపించే ఫ్యాల్సిపేరమ్‌ రకానికి చెందినదైతే ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయాల్సి రావచ్చు. ఎందుకంటే ఈ తరహా మలేరియా జ్వరంలో రోగికి కాలేయం, మూత్రపిండాలు, మెదడు, ఊపిరితిత్తులు వంటి అవయవాలకు సంబంధించిన దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఎక్కువ. అంటే కామెర్లు రావడం, స్పృహ తప్పిపోవడం, ఫిట్స్‌ రావడంతో పాటు శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బందులు, మూత్రపిండాలు విఫలం కావడం, మూత్రం తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయడం తప్పనిసరి.

ఇలాంటి స్థితిలో మలేరియా చికిత్స కోసం క్వినైన్‌ సల్ఫేట్, ఆర్టెసునేట్, టెట్రాసైక్లిన్, డాక్సిసైకర్టిన్, మెఫ్లోక్విన్, క్లిండోమైసిన్, అమోడయాక్విన్, ల్యూమెఫ్యాంట్రైన్‌ లాంటి మందులు వివిధ కాంబినేషన్స్‌లో వాడతారు. ఇతర శారీరక దుష్ప్రభావాలు (కాంప్లికేషన్స్‌) ఉన్నవారిలో తొలుత ఇంజెక్షన్స్‌ వాడి తర్వాత నోటి ద్వారా తీసుకునే మందులు ఉపయోగిస్తారు. రోగి అంతర్గత అవయవాలు దెబ్బతింటే... ఆ దెబ్బతిన్న అవయవాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. అంటే... మూత్రపిండాల పనితీరు దెబ్బతింటే డయాలిసిస్, శ్వాస సరిగా అందకపోతే వెంటిలేషన్‌ వంటి సౌకర్యాలు అవసరమవుతాయి. ఫ్యాల్సిపేరమ్‌ రకానికి చెందిన మలేరియాలో ఆసుపత్రిలో లభ్యమయ్యే ఈ తరహా చికిత్స రోగికి దొరకకపోతే ఒక్కోసారి అది రోగి మరణానికీ దారితీయవచ్చు.

మొక్క నుంచి మందులు
ఇటీవల మలేరియా చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులు, పురోగతి చోటు చేసుకున్నాయి. ‘ఆర్టిమిసినిన్‌’ గ్రూపునకు చెందిన మందులను కనుగొన్న తర్వాత ఈ చికిత్స మరింత సులభం అయ్యింది. ‘ఆర్టిమిసినిన్‌’ అన్నది ‘స్వీట్‌ వార్మ్‌వుడ్‌’ అని పిలిచే  చైనీస్‌ జాతి మొక్క. దీని నుంచి తయారు చేసిన ‘ఆర్టిమిసినిన్‌’ మందులతో గుణం చాలా మెరుగ్గానూ, వేగంగానూ కనిపిస్తుంది. అయితే ఒకే ఒక మందుగా (అంటే మోనో థెరపీగా) దీన్ని ఇచ్చినప్పుడు  రోగిలోని మలేరియా క్రిములు ఆ మందు పట్ల నిరోధకతను వేగంగా అభివృద్ధి చేసుకుంటాయి. ఇదే విషయం మయన్మార్, కాంబోడియా, థాయిలాండ్‌ దేశాల్లో నిరూపితమైంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు ఈ తరహా మందుల లభ్యత పట్ల ప్రపంచ మార్కెట్‌లో కొన్ని నియంత్రణలను విధించింది.

దాంతో ఆర్టిమిసినిన్‌తో పాటు మరికొన్ని కాంబినేషన్‌ మందులను వాడటం అన్నది ఫ్యాల్సిపేరమ్‌ తరహా మలేరియా చికిత్సలో ఒక భాగం అయ్యింది. దీన్నే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆర్టిమిసినిన్‌ బేస్‌డ్‌ కాంబినేషన్‌ థెరపీలు (ఏసీటీస్‌)గా పేర్కొంటోంది. మలేరియా రోగాన్ని కలిగించే పరాన్న జీవులు ఇలా మందుల పట్ల తమ నిరోధకతను పెంచుకోవడాన్ని గమనించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చికిత్సలో ఒక ప్రామాణికతను నిర్ణయించింది. దాన్ని ‘డబ్ల్యూహెచ్‌ఓ టీ3’గా అభివర్ణిస్తారు. టీ3 అంటే... టెస్ట్, ట్రీట్, ట్రాక్‌ ఇనిషియేషన్‌ అన్నమాట. అంటే నిర్ధారణ పరీక్ష, చికిత్స, అవి కొనసాగే తీరు.

నివారణ
దోమల నివారణే మలేరియా నివారణకు మంచి మార్గం. దోమ కాటు నుంచి మనల్ని మనం ఎంతగా రక్షించుకుంటే మలేరియా నుంచి అంత సమర్థంగా మనల్ని మనం కాపాడుకోవచ్చు.మన ఇంట్లోకి, గదిలోకి దోమలు రాకుండా చూసుకోడానికి రిపెల్లెంట్లు, దోమతెరలు వాడవచ్చు. దోమలు కుట్టకుండా ఉండేందుకు శరీరంపైన పూత మందులు వాడటం కూడా ఒక మార్గం.  ఇక సామాజిక నివారణలో భాగంగా మన ఇళ్ల çపరిసరాల్లో మురుగు నీరు లేకుండా, నిల్వ నీరు లేకుండా చూసుకోవాలి. దీనితో పాటు కాల్వల్లో నీరు నిత్యం పారేలా కాల్వల పూడిక లేకుండా చూసుకోవడం అవసరం.
     
దూరప్రాంతాలకు ప్రయాణమయ్యేవారు ముందు జాగ్రత్తగా సల్ఫాడోక్సిన్‌ – పైరిమిథమైన్‌ వంటి యాంటీ మలేరియల్‌  (కీమో– ప్రొఫిలాక్సిస్‌) మందులు తీసుకోవచ్చు.పాత టైర్లు, ఖాళీ కొబ్బరి చిప్పల వంటివి దోవుల పెరుగుదలకు ఉపకరిస్తాయి కాబట్టి వాటిని ఇంటి పరిసరాల్లో ఉంచకండి.వాటర్‌ కూలర్స్‌లో కొంతమంది కొన్ని నీటిని ఉంచేస్తారు. సాధారణంగా వర్షాలుపడగానే వాటిని ఉపయోగించడం ఆపేసి, కూలర్లను మూలన పడేస్తారు. దాంతో అవి దోమలకు మంచి బ్రీడింగ్‌ స్థలాలుగా మారిపోతాయి. హాఫ్‌ స్లీవ్స్‌ వంటి దుస్తులను వాడకండి. ఒళ్లంతా పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వాడండి.

మలేరియా అర్థమేమిటంటే?
క్రీస్తుపూర్వం దాదాపు ఐదు శతాబ్దాల కిందటే ఈ వ్యాధిని గుర్తించారు. అయితే అప్పట్లో చెడు పరిసరాల వల్ల, చెడు గాలి వల్ల వచ్చేదని భావించేవారు. ‘మాల్‌’ అంటే చెడు అనీ... ‘ఏరియా’ అంటే పరిసరాలు అని అర్థం. ఈ భావన వల్లనే ఆ వ్యాధికి మలేరియా అనే పేరు పెట్టారు. కానీ ఆ తర్వాత ఇది దోమల కారణంగా వ్యాప్తి చెందుతుందని తేలింది. ప్రపంచమంతా ఉన్న ఈ వ్యాధి గురించి, దాని చరిత్రను గురించి సర్‌ రొనాల్డ్‌ రాస్‌ అనే పరిశోధకుడు ‘సికింద్రాబాద్‌’లోనే కనుక్కున్నారు.

మలేరియా వ్యాధి ప్లాస్మోడియమ్‌ అనే ఏకకణ పరాన్న జీవి వల్ల వస్తుంది. దీన్ని ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి దోమలు వ్యాప్తి చేస్తాయి. దోమల్లోనూ ఆడ అనాఫిలిస్‌ దోమ దీని వ్యాప్తికి దోహదపడుతుంది. ప్లాస్మోడియం పరాన్నజీవి కూడా నాలుగు ప్రధాన ప్రజాతులుగా ఉంటుంది. అవి... ప్లాస్మోడియం ఫ్యాల్సిపేరమ్, ప్లాస్మోడియం ఒవ్యులా, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరీ. ప్లాస్మోడియం నోవిసై అనే మరో ప్రజాతి కూడా ఉంది గానీ దీని వ్యాప్తి కొద్ది దేశాలకే పరిమితం.

వ్యాధి తీవ్రత ఎవరెవరిలో ఎక్కువ...
►వృద్ధుల్లో, చిన్నారుల్లో, గర్భిణుల్లో
►జబ్బు గుర్తించడంలో జాప్యం జరిగి చికిత్స అందడం ఆలస్యం అయిన వారిలో
►పారసైటిక్‌ లోడ్‌ ఎక్కువగా ఉన్నవారిలో
►మలేరియా లేని దేశాల నుంచి మలేరియా ఉన్న ప్రాంతంలోకి వచ్చిన వారికి ఈ వ్యాధి పట్ల నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దాంతో వారిలో తీవ్రత ఎక్కువ. 
డాక్టర్‌ జె. శ్రీకాంత్‌
సీనియర్‌ కన్సల్టెంట్, ఇంటర్నల్‌ మెడిసిన్‌
అపోలో హెల్త్‌ సిటీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు