భూనబోనం

4 Aug, 2015 00:12 IST|Sakshi
భూనబోనం

ఆషాఢం... మూఢం...
కాదు కాదు..  ఆషాఢం... బోనం...
ఇల్లిల్లూ పచ్చగా కళకళలాడే మాసం...
బోనాల కిరీటాలతో నిండిన శిరస్సులతో మెరిసిపోయే మాసం...
భూ...నభోనమంతా మురిసిపోయే మాసం...
తెలంగాణ ఆడపడుచుల పట్టు పరికి ణీలతో మిలమిల మెరిసే మాసం...
బోనాలకు చద్దులు ఎలాగూ చేసుకుంటారు...
వాటితో పాటు మరిన్ని వంటలు చేసుకుందాం...
అందరితో కలిసి హాయిగా కడుపారా ఈ బోనాలను ఆరగిద్దాం...
 

బగారన్నం
కావలసినవి:  బియ్యం - 200 గ్రా; ఉల్లిపాయ - 1; పుదీనా ఆకులు - 10; పసుపు - పావు టీ స్పూను; నూనె - 2 టీ స్పూన్లు; నెయ్యి - 2 టీ స్పూన్లు; పచ్చి మిర్చి - 4; బిర్యానీ ఆకు - 3; లవంగాలు - 6; ఏలకులు - 4; దాల్చిన చెక్క - 3 చిన్న ముక్కలు; షాజీరా - టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను; ఉప్పు - తగినంత
 
తయారీ: బియ్యం కడిగి నీళ్లు పోసి అరగంట ముందు నానబెట్టి  నీళ్లు తీసేయాలి  గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా చీల్చిన పచ్చి మిర్చి, పుదీనా ఆకులు వేసి మెత్తబడేవరకు వేయించి, లవంగాలు, ఏలకులు, షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి కొద్దిగా వేయించి బియ్యానికి తగినట్టుగా (పాత బియ్యం ఒకటికి ఒకటిన్నర) నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి మరిగించాలి  నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం వేసి ఉడికించాలి బియ్యం బాగా ఉడికి, నీరంతా ఇగిరిపోయాక మంట పూర్తిగా తగ్గించి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చి దింపేయాలి. (అన్నం పొడిపొడిగా ఉండాలి).
 
మసాలా పూరీలు

కావలసినవి: మైదా పిండి - 3 కప్పులు; సెనగ పిండి - 2 కప్పులు; కరివేపాకు - 3 రెమ్మలు; మెంతి కూర తరుగు - 2 టీ స్పూన్లు;  పసుపు - పావు టీ స్పూను; కారం - 2 టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి - 2 టీ స్పూన్లు; గరం మసాలా - 1 టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టీ స్పూన్లు; షాజీరా - 2 టీ స్పూన్లు
ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి సరిపడా
 
తయారీ: ఒక గిన్నెలో జల్లించిన మైదాపిండిలో కాస్త ఉప్పు వేసి తగినన్ని నీళ్లతో చపాతీపిండిలా తడిపి నూనె వేసి కలిపి మూతపెట్టి ఉంచాలి  వేరే గిన్నెలో సెనగ పిండి తీసుకుని అందులో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, షాజీరా, సన్నగా తరిగిన కరివేపాకు, మెంతికూర తరుగు వేయాలి కొద్దిగా నీళ్లు కలిపి పలుచగా చేసిన అల్లం వెల్లుల్లి ముద్ద, తగినంత ఉప్పు జత చేసి తగినన్ని నీళ్లు జల్లుకుంటూ కాస్త గట్టిగా ముద్దలా తడిపి పెట్టుకోవాలి  అరగంట తర్వాత రెండూ విడివిడిగా మృదువుగా పిసికి ఉండలుగా చేసుకోవాలి  సెనగ పిండి ముద్ద చిన్నగా, గోధుమ పిండి ముద్ద కాస్త పెద్దగా చేసుకోవాలి  గోధుమ పిండి ముద్ద చేతిలోకి తీసుకుని కాస్త వెడల్పుగా చేసుకుని మధ్యలో సెనగ పిండి ముద్ద పెట్టి అన్నివైపుల నుండి మూసేసి మళ్లీ గుండ్రంగా చేసుకోవాలి  ఇలా అన్నీ చేసుకుని పెట్టుకోవాలి  బాణలిలో నూనె వేసి వేడి చేసుకోవాలి  ఒక్కో ముద్ద తీసుకుని పలుచగా పూరీలా ఒత్తుకుని వేడి నూనెలో వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చి తీసేయాలి ఈ పూరీలు నాలుగైదు రోజుల వరకు నిలవ ఉంటాయి.
 
 వడప్పలు
 కావలసినవి:  బియ్యప్పిండి - అర కేజీ; సెనగ పప్పు - అర కప్పు; నువ్వులు - 2 టీ స్పూన్లు; పల్లీలు - అర కప్పు; పచ్చి కారం ముద్ద - పావు కప్పు; కరివేపాకు - 2 రెమ్మలు; ఉప్పు - తగినంత; అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను; నూనె - వేయించడానికి తగినంత.
 తయారీ: సెనగ పప్పు శుభ్రం చేసుకుని నీళ్లు పోసి గంట సేపు నాననివ్వాలి  పల్లీలు వేయించి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా నల క్కొట్టి పెట్టుకోవాలి  గిన్నెతో పిండి కొలుచుకుని ఒకటికి సగం నీళ్లు లెక్కతో తీసుకుని మరిగించాక, ఇందులో పచ్చి మిర్చి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, నువ్వులు, పల్లీలు, సెనగ పప్పు, గరిటెడు నూనె, తగినంత ఉప్పు వేయాలి  నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు జల్లించిన బియ్యప్పిండి వేసి కలిపి దింపేసి మూత పెట్టాలి  చల్లారిన తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు వేసి కలిపి కొద్దికొద్దిగా తీసుకుని మెత్తగా పిసికి ముద్దలా చేసుకోవాలి  నిమ్మకాయంత ఉండలు చేసుకుని ప్లాస్టిక్ కాగితం లేదా పూరీ ఒత్తుకునే మిషనులో మరీ పలుచగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఒత్తుకుని వేడి నూనెలో వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి (వీటిని సన్న మంట మీద నిదానంగా వేయిస్తే లోపలి వరకు బాగా ఉడికి కరకరలాడుతూ ఉంటాయి).

 మూడు పప్పుల గారెలు
 కావలసినవి:  మినప్పప్పు - కప్పు; పెసర పప్పు - కప్పు; సెనగ పప్పు - కప్పు; పచ్చి మిర్చి - 3; కరివేపాకు - 4 రెమ్మలు; జీలకర్ర - 2 టీ స్పూన్లు; కారం - 2 టీ స్పూన్లు; అల్లం - చిన్న ముక్క; ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి తగినంత.
 తయారీ: ముందుగా పప్పులన్నీ కలిపి శుభ్రంగా కడిగి నిండుగా నీళ్లు పోసి కనీసం మూడు గంటలు నానబెట్టాక, తీసి జల్లెడలో వేయాలి  నీరంతా పోయాక మిక్సీలో వేసి సగం బరకగా, సగం మెత్తగా రుబ్బుకోవాలి  ఈ రుబ్బిన పిండిలో సన్నగా తరిగిన పచ్చి మిర్చి, కరివేపాకు, జీలకర్ర, కారం, తగినంత ఉప్పు వేసి కలపాలి బాణలిలో నూనె వేడి చేసుకోవాలి  రుబ్బిన పిండిని పెద్ద నిమ్మకాయంత తీసుకుని ప్లాస్టిక్ కవర్ లేదా తడి చేసుకున్న అరచేతిలో కాస్త వెడల్పుగా ఒత్తుకుని మధ్యలో చిల్లు పెట్టి నూనెలో వేసి రెండువైపులా కాల్చుకోవాలి.
 
 

మరిన్ని వార్తలు