డిజిటల్‌ తెరలకు అతుక్కుంటే... లావెక్కుతారు!

14 Dec, 2017 01:15 IST|Sakshi

పరిపరిశోధన

పిల్లలు స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్‌లతో ఆడుకోవడం ఎక్కువైంది ఈ మధ్య. అయితే నిద్ర సమయానికి ముందు ఇలా డిజిటల్‌ స్క్రీన్స్‌కు అతుక్కుపోవడం ఏమంత మంచిది కాదంటున్నారు పెన్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. దీనివల్ల నిద్ర పాడవడమే కాకుండా పొద్దున్న లేవగానే ఉత్సాహంగా ఉండాల్సింది పోయి నీరసించినట్టు కనిపిస్తారని వీరు జరిపిన సర్వే స్పష్టం చేసింది. అంతేకాకుండా రాత్రుళ్లు నిద్ర సమయానికి ముందు టీవీ ఎక్కువగా చూసే పిల్లల్లో బీఎంఐ కూడా ఎక్కువ అవుతుందని తాము తెలుసుకున్నట్లు ఈ సర్వేలో పాల్గొన్న శాస్త్రవేత్త కేటలీన ఫుల్లర్‌ అంటున్నారు.  గతంలో జరిగిన ఒక సర్వే యుక్తవయస్కుల్లో ఇలాంటి ప్రభావాలుంటాయని చెప్పింది కానీ.. పిల్లల విషయంలో తాము తొలిసారి ఈ విషయాలను గమనించామని తెలిపారు.

నిద్రకు ముందు టీవీ చూసేవారిలో... లేదంటే వీడియోగేమ్స్‌ ఆడే పిల్లల్లో నిద్ర సగటున 30 నిమిషాలు తక్కువగా ఉంటోందని, ఫోన్, కంప్యూటర్లు వాడేవారిలో ఇది గంట వరకూ ఉందని ఫుల్లర్‌ సర్వేలో తేలింది. ఒకవైపు టీవీ చూస్తూ.. ఇంకోవైపు స్మార్ట్‌ఫోన్‌ వాడటం మరీ ప్రమాదకరమైన విషయమని అంటున్నారు. రాత్రిపూట పిల్లలకు ఈ డిజిటల్‌ టెక్నాలజీలను వీలైనంత దూరంగా పెట్టడం మంచిదని, లేనిపక్షంలో కనీసం ఏదో ఒకదానికి మాత్రమే పరిమితమయ్యేలా చూడటం ద్వారా సమస్య తీవ్రతను కొంత తగ్గించవచ్చునని వివరించారు.

మరిన్ని వార్తలు