అప్పుడిచ్చిందే ధర్మం

10 Sep, 2018 00:53 IST|Sakshi

‘‘ఏదీ ఆ సంచీ ఇటివ్వు, అందులో అయిదు వందల దీనారులు ఉండాలి.. నువ్వేమన్నా తీసుకున్నావా?’’ అని అన్నాడు ధనవంతుడు ఆత్రుతతో. అదొక మసీదు. అక్కడ వాకిట్లో ఓ యాచకుడు కూర్చున్నాడు. ధర్మం చెయ్యండి బాబూ అంటూ యాచిస్తున్నాడు. అటువైపుగా కొందరు ధనవంతులు వచ్చారు. వారిని చూసీ చూడడంతోనే యాచకుడు చేతిలోని భిక్షపాత్రను చాచి.. ‘ధర్మం బాబయ్యా’ అని అడిగాడు. కానీ వారిలో ఒక్కరూ చిల్లిగవ్వ కూడా ఆ పాత్రలో వెయ్యలేదు. అలా వెళ్లిపోయిన వారిలో ఓ ధనవంతుడి దగ్గరున్న ఓ డబ్బు సంచీ కింద జారిపడిపోయింది. ఆ విషయం అతనికి తెలియలేదు.

కానీ ఆ డబ్బు సంచీని యాచకుడు చూశాడు. దాన్ని తీసుకుని తన దగ్గర ఉంచుకున్నాడు. మసీదు లోపలికి వెళ్లిన కాస్సేపటికి డబ్బు సంచీ పోగొట్టుకున్న వ్యక్తి రొప్పుతూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ‘‘ఇక్కడెక్కడైనా నా సంచీ పడిపోయుంటే చూసేవా?’’ అని అడిగాడు ఆ ధనవంతుడు. చూశానని, ‘మీరొస్తే మీకివ్వాలనే నా పక్కనే పెట్టుకున్నాను’ అనీ చెప్పాడు  యాచకుడు. ధనవంతుడు ఆత్రుతతో ‘‘ఏదీ ఆ సంచీ ఇటివ్వు, అందులో అయిదు వందల దీనార్లు ఉండాలి.. నువ్వేమన్నా తీసుకున్నావా?’’ అని అన్నాడు. ‘‘నేనసలు ఆ సంచీ లోపల ఏం ఉందో కూడా చూడలేదండీ, మీరు లెక్కపెట్టుకోండి’’ అన్నాడు యాచకుడు.

ధనవంతుడు లెక్కపెట్టి చూసుకుంటే అతను చెప్పిన అయిదు వందల దీనార్లు అలాగే ఉన్నాయి. దాంతో అతని ముఖాన అప్పటి వరకూ ఉన్న కంగారు, దాంతో పుట్టిన పట్టిన చెమటా మటుమాయమైంది. సంతోషం ఉప్పొంగింది. ఆ పట్టరాని ఆనందంతోనే అతను అందులోంచి పదిహేను దీనార్లు లెక్కపెట్టి ఇదిగో ఇది నా కానుక అంటూ యాచకుడికి ఇచ్చాడు. కానీ యాచకుడు తనకక్కరలేదని సున్నితంగా తిరస్కరించాడు. అంతేకాదు, ఇలా అన్నాడు.. ‘‘మీరు కానుకగా ఇచ్చే సొమ్ము నాకక్కరలేదు. నేను మొదట మిమ్మల్ని ధర్మం చెయ్యండి బాబూ అని ధర్మం అడిగాను. అప్పుడే ఇచ్చి ఉంటే మహదానందంగా తీసుకునేవాడిని అన్నాడు యాచకుడు. ధనవంతుడు మౌనంగా వెళ్లిపోయాడు.

– యామిజాల జగదీశ్‌

మరిన్ని వార్తలు