-

పెయిన్‌కిల్లర్స్‌తో ఆ రిస్క్‌ అధికం..

5 Sep, 2018 13:52 IST|Sakshi

లండన్‌ : తరచూ నొప్పి నివారణ (పెయిన్‌కిల్లర్‌) మాత్రలు వాడితే గుండె పోటు, స్ర్టోక్‌ ముప్పు 50 శాతం అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. పెయిన్‌కిల్లర్స్‌తో జీర్ణాశయ వ్యాధుల రిస్క్‌ కూడా పొంచిఉందని వెల్లడైంది. పెయిన్‌కిల్లర్స్‌ నుంచి రోగులను కాపాడేందుకు అంతర్జాతీయంగా తక్షణ చర్యలు అవసరమని బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అథ్యయనం స్పష్టం చేసింది.

పెయిన్‌కిల్లర్స్‌తో ప్రమాదాన్ని పసిగట్టి తక్షణమే వీటి వాడకాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని అథ్యయనం చేపట్టిన డెన్మార్క్‌కు చెందిన అరస్‌ యూనివర్సిటీ ఆస్పత్రి పరిశోధక బృందం కోరింది. పెయిన్‌కిల్లర్స్‌లో తరచూ వాడే డకోఫెనాక్‌తో ఈ తరహా ముప్పు అధికమని, వీటిని మందుల షాపుల్లో విరివిగా అందుబాటులో ఉంచకుండా నియంత్రించాలని సూచించింది. 63 లక్షల మంది ఆరోగ్య రికార్డులను పరిశీలించిన మీదట పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు.

ఇబూప్రోఫెన్‌, నాప్రోక్సెన్‌, పారాసెటమాల్‌ వాడిన రోగులతో పోలిస్తే డకోఫెనాక్‌ మాత్రలే గుండె జబ్బులు, స్ర్టోక్‌ ముప్పును అధికంగా పెంచాయని పరిశోధనలో గుర్తిం‍చారు. అసలు ఏ మందులూ తీసుకోని వారి ఆరోగ్యం మెరుగ్గా ఉందని వెల్లడైంది. పెయిన్‌కిల్లర్స్‌తో ముప్పును గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని పరిశోధకులు సూచించారు.

మరిన్ని వార్తలు