మందుల్లేకుండానే పళ్లపై గార మాయం!

25 Aug, 2018 00:46 IST|Sakshi

మన నోట్లో మంచి, చెడు బ్యాక్టీరియాల మధ్య సమతౌల్యత దెబ్బ తింటే పళ్లపై గార ఏర్పడుతుందన్నది అందరికీ తెలిసిందే. ఈ గార వల్ల పిప్పి పళ్లు రావడంతోపాటు తగిన చికిత్స కల్పించకపోతే దీర్ఘకాలంలో గుండె జబ్బులు, మధుమేహం వంటివి వచ్చే అవకాశమూ ఉంది. ఈ నేపథ్యంలో నోటిలోని చెడు బ్యాక్టీరియాను తగ్గించేందుకు ఇల్లినాయి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నానో టెక్నాలజీ ఆధారిత పద్ధతిని ఒకదాన్ని అభివృద్ధి చేశారు. ఇది నోట్లో దాగి ఉన్న హానికారక బ్యాక్టీరియాను గుర్తించడంతోపాటు నాశనం చేస్తుంది కూడా. ఇందుకోసం తాము స్టెప్టోకాకస్‌  మ్యూటన్స్‌ బ్యాక్టీరియాను గుర్తించేందుకు ఓ వినూత్నమైన ప్రోబ్‌ను సిద్ధం చేశామని, కొన్ని మార్పుల ద్వారా ఈ ప్రోబ్‌ ఆ బ్యాక్టీరియాను నాశనం చేసేలా చేశామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త దీపాంజన్‌ పాన్‌ తెలిపారు.

ప్రోబ్‌లో హాఫీనియం ఆక్సైడ్‌తో కూడిన నానో కణాలు ఉంటాయని, కొన్ని రకాల ఎలుకలపై క్లోరోహెక్సిడైన్‌ అనే మందుతో కలిపి ఈ ప్రోబ్‌ను ఉపయోగించినప్పుడు మెరుగైన ఫలితాలు వచ్చాయని వివరించారు. యాంటీబయాటిక్‌ మందులు వాడాల్సిన అవసరం లేకుండానే గారను తొలగించేందుకు ఇది మెరుగైన పద్ధతి అని, ప్రస్తుతం హైఫీనియం ఆక్సైడ్‌ వాడకం సురక్షితమేనా? కాదా? అన్నదాన్ని రూఢి చేసుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, ఆ తరువాత ఈ పద్ధతిని అందరికీ అందుబాటులోకి తెస్తామని తెలిపారు.  

మరిన్ని వార్తలు