విటమిన్‌ –డి తో పిల్లలకు పుష్టి!

3 May, 2018 01:40 IST|Sakshi

దేశంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతన్న పిల్లలు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వీరందరికీ తగినన్ని పోషకాలు అందించేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే విటమిన్‌ – డి ని అందిస్తే అది పిల్లలు పుష్టిగా ఎదిగేందుకు మాత్రమే కాకుండా, బరువు పెరిగేందుకు, కదలికలకు సంబంధించిన నైపుణ్యాలను వేగంగా అందుకునేందుకు కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు పంజాబ్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. లండన్‌లోని క్వీన్‌ మేరీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలతో కలిసి జరిపిన అధ్యయనం ద్వారా తాము ఈ విషయాన్ని తెలుసుకోగలిగామని డాక్టర్‌ జవేరియా సలీమ్‌ తెలిపారు. అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. ఆరు నెలల నుంచి ఐదేళ్ల మధ్య వయస్కులపై విటమిన్‌ – డి ప్రభావం బాగా ఉంది.

ఎనిమిది వారాలపాటు వీరిలో కొంతమందికి ఐదు మిల్లీగ్రాములు లేదా రెండు లక్షల ఐంటర్నేషనల్‌ యూనిట్ల విటమిన్‌ – డి అందించారు. మిగిలినవారికి అధిక శక్తి గల ఆహారం, కొంతమందికి సాధారణ ఆహారం అందించారు. ఆ తరువాత పిల్లలను పరిశీలించగా ఎన్నో ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. మిగిలిన వారితో పోలిస్తే వేగంగా నడవడం మొదలుకొని బరువు కూడా పెరిగారని సలీమ్‌ తెలిపారు. విటమిన్‌ – డి కేంద్ర నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుందనేందుకు ఈ అధ్యయనం తొలి నిదర్శనమని, మరిన్ని పరిశోధనల ద్వారా ఈ విషయాలను నిర్ధారించుకుంటే పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు చవకైన, సులువైన మార్గం దొరికినట్లేనని వివరించారు. 

>
మరిన్ని వార్తలు