ఉంటే కర్ర నీదే బర్రె

17 Sep, 2018 00:33 IST|Sakshi

కథాసారం

ఒకనాడు ఒక పల్లెకాపు పదకొండు సొరకాయలను కంబట్లో వేసుకొని ఒక గ్రామానికి అమ్ముకొనేదానికి వెళ్లినాడు. గ్రామంలో అమ్మలక్కలు పదిమంది మూగి బేరంచేస్తూ వున్నారు. అంతలో మాలీపటేల్‌ వేంచేసినాడు. ‘‘ఒరేయ్‌! ఈడ కూర్చోమని నీకెవరు సెలవిచ్చినారు? మంచి మాటతో ఒక కాయ ఇచ్చిపో’’ అంటూ ఒక పెద్ద కాయను లాగుకొని పోయినాడు. కాపువాడు గొణుక్కుంటూ ఉన్నాడు. గోరుచుట్టు మీద రోకటి పోటన్నట్లుగా పోలీసు పటేలు హాజరైనాడు. ‘‘పట్టుకొని రారా వాణ్ని. ముసాఫిర్ల లెక్కలో వానిపేరు రాయాల్సింది వుంది’’ అని గర్జించినాడు. తలారి వచ్చి తనపాలి ఒక కాయ, పటేలు పాలిటి ఒక కాయ లాగుకొని పోయినాడు. కొంతసేపటికి పెద్ద తలారి వచ్చినాడు.

‘‘ఏయ్, మొన్న నీవంటివాడే వచ్చిండెను. పొద్దు మునిగినప్పుడు కూరగాయ లమ్మునట్లు అమ్మి రాత్రి కోమటోళ్ల యింట్లో కన్నం వేసిండు. పద! చావిట్లో నిన్ను కట్టేస్తాన్‌’’ అంటూ తానున్నూ ఒక కాయ చేతబట్టుకున్నాడు. ఈ విధంగా పూజారి, పురోహితుడు, కమ్మరి, వడ్ల మొదలైన పదకొండు మంది ఆయగాండ్లు ఒకరి వెనుక ఒకరు వచ్చి కాయలన్నీ లాగుకొని పోయినారు. కాపు ఏడ్చుకుంటూ గొంగడి దులుపుకొని లేస్తున్నాడు. చీకట్లోనే చేనికి పోయినట్టి కర్ణమయ్య అప్పుడే ప్రత్యక్షమైనాడు. ‘‘ఏమిరా ఏడుస్తున్నావు? నిన్నెవరేమన్నారు చెప్పు. తప్పు చేసినోనికి శిక్ష యిప్పిస్తాను’’ అన్నాడు. న్యాయం విచారించే ప్రభువు ఒక్కడైనా ఈ వూరిలో వున్నాడురా నారాయణా అనుకొని కాపు తన పదకొండు సొరకాయలు మాయమైన విధమంతా వినిపించి ‘‘అయ్యా నన్నెట్లన్నా గడ్డ కేయండి’’ అని గొంగడి ఆయన కాళ్లమీద వేసి కాళ్లు పట్టుకొన్నాడు. కర్ణం ఝాడించి తన్ని కంబలి చంకబెట్టుకొని, ‘‘అరే లుచ్ఛా! అందరికీ యిచ్చి నా వంతు తప్పించినావా? నేను తలారివానికంటే పనికిరానివాణ్నా? నా వంతు సొరకాయ యిచ్చి యీ గొంగడి తీసుకుపో’’ అని యింటికి పోయినాడు.

కాపు ‘‘నా వంటి దిక్కులేనివారు బతికేదెట్లా’’ అని చిన్న పిల్లవానివలె కొంతసేపు ఏడ్చినాడు. ఒకరిద్దరు ఆడవారు ‘‘పో నాయనా! పొద్దున్నే ఎవరి ముఖం చూచినావో. యీ వూళ్లో అందరూ ఇట్లాంటి మారాజులే. ఇంకోమారు రావద్దు’’ అని బుద్ధి చెప్పినారు. కాపు దీర్ఘాలోచన చేస్తూ ఇంటిబాట పట్టినాడు. ‘‘థూ, దీనికి బదలా తీయకుంటే నేను మనిషినా? అయితే బీదోన్ని ఏమి చేయగలను? దేవునికైనా దెబ్బే గురువు. నేనున్నూ ఏదో మొండి తొండి చేస్తా’’ ఇట్లా ఆలోచనలో మునిగి నడుస్తున్నాడు. తన మోటబావిని సమీపించినాడు. బావిగడ్డపై కూర్చున్నాడు. తటాలున ఒక మెరుపు మెరిసినట్లా వాని తలలో ఆలోచన తళుక్కుమంది.

చటుక్కున లేచినాడు. ఊళ్లోకి పోయినాడు. చక్కగా పెండ్లాం వద్దకు వెళ్లి ‘‘ఒసేయి! నీ వంకి ఇట్లా తే. ఇయ్యమంటే! నీకేం ఫర్వాలేదు. మళ్లీ వుగాది నాటికి ఒకటికి నూరు వంకీలు చేయిస్తే నా పేరు వెంకయ్య అను’’ అని వంకీని లాగుకున్నాడు. పటేలుకు దాన్ని 200 రూపాయలకు అమ్మినాడు. పైకం తీసుకొని 10 మైళ్ల దూరంలో వుండే పట్నం చేరుకున్నాడు. షేర్వానీలు, లాగులు, మోజాలు, పగిడీ, నడుముపట్టి, బిల్లలు మొదలైనవి సిద్ధము చేసుకొన్నాడు. నలుగురు అరబ్బు జవానుల జతచేసుకున్నాడు. వారికి బిల్లలను తగిలించినాడు. తానున్నూ బాగా వేషం వేసుకొన్నాడు. ఒక బగ్గీని కిరాయకు మాట్లాడుకొన్నాడు.
రెండామడ దూరంలో ఒక పెద్ద బస్తీ ఉండింది. అది నాలుగు బాటలు కలిసే స్థలం. గొప్ప వ్యాపారి పేట. అధికారులు, మంత్రి, నవాబు కూడా ఆ మార్గంగా షికారుకు పొయ్యే స్థలం. ఆ గ్రామంలో మన కాపు దిగినాడు. ఊరబావి గట్టున ఒక పెద్ద మర్రి మానుండింది. దానికింద మేజు కుర్చీలు వేయించినాడు. జవానులను బావిపై పహిరా ఎక్కించినాడు. ప్రొద్దున్నే ఊరులోని ఆడువారు నీటికి వస్తే ఆ జవానులు ‘‘ఖబర్దార్, కడవకొక పైసా యిచ్చి నీళ్లు తీసుకోండి’’ అని బెదిరించినారు. పటేలు పట్వారీ వచ్చినారు. ‘‘ఒరేయ్‌! మాకు సర్కారు హుకుం అయింది. ఇదిగో ఫర్మాన్‌’’ అని ఉర్దూ ముద్రలతోనుండే ఫర్మాను చూపించినాడు కాపు. ఉండవచ్చునని గ్రామాధికారు లూరకైనారు.

దినమున్నూ పైకం బాగా వసూలు కాబట్టింది. మొదట దినం 20 రూపాయల వరకు వసూలైంది. క్రమేణా ఎక్కువైంది. ‘మర్రిమాన్‌ పరగణా సుంకం’ చుట్టూ రెండామడ వరకు ప్రసిద్ధి అయిపోయింది. వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచినవి. ఒకనాడు సుబేదారు దౌరా వచ్చి గుడారాలు వేయించినాడు. అతని నౌకరు నీటికి పోతే ‘‘పైసా లావ్‌’’ అన్నారు జవానులు. వారు ఉత్త కడవలతో వాపసు పోయి ‘‘సర్కార్‌! నల్గురు అరబ్బీ జవానులు పైసా యియ్యంది నీళ్లు తీసుకోనివ్వరు. అరే సుబేదార్‌ సర్కారు వారికిరా అంటే జంబియాలతో పొడిచేదానికే పైబడవస్తారు సర్కార్‌!’’ అని విన్నవించుకొన్నారు. అక్కడనే సేవలో ఉన్న పటేలు పట్వారీ లిట్లన్నారు: ‘‘హుజూర్‌! పందేండ్ల నుండి యీ మర్రిమాన్‌ పరగణా సుంకం సక్రమంగా వసూలౌతుంది. అందుకు సర్కారు ఫర్మాను వుంది’’. ‘‘ఉంటే ఉండవచ్చును’’ అనుకొని సుబేదారు కూడా పైసలిచ్చి నీరు తెప్పించుకొన్నాడు.

ఒకనాడు దీవాన్‌ బహద్దర్‌ గారు అక్కడ ఢేరా వేయించినాడు. అతనికిన్నీ ఇదేగతి పట్టింది. అరబ్బులు కడవకు పైసా పెట్టంది ఒక మెట్టు కూడా దిగనియ్యరు. దీవానుగారు అంతా వినుకొని ఇట్లనుకొన్నారు: ‘‘మా హుజూర్‌ గారు ఫర్మానిచ్చి నారేమో, లేకుంటే నా వద్ద కూడా వసూలు చేసే గుండె వుందా వీనికి?’’ దీవాను గూడా సుంకం చెల్లించుకొన్నాడు. కాపువాణ్ని పట్టే పగ్గాలు లేవు.
ఇట్లావుండగా నవాబుగారు షికారుకు పోతూ పోతూ పొద్దు పోయిందని రాత్రికి ఆ వూరులోనే ఠికానా వేసినారు. నవాబో గివాబో ఇప్పటికి కాపువానికెవరున్నూ కంటికాగేటట్లు కనబడలేదు. పైసా ఆడబెట్టి బావిలోకి దిగూ అన్నాడు నవాబు నౌకరును. నవాబుకు షికాయతు అయింది. నవాబుగారిట్లా తమలోనే అనుకున్నారు. ‘‘మా దివాన్జీ మా ఖజానా భర్తీ చేసేదానికి ఈ హుకుం ఇచ్చినాడేమో, పట్నం పోయిన తర్వాత విచారించుతాను. ఇప్పుడుమాత్రం నేనున్నూ ఖానూనుకు బద్ధుణ్నై ఉండాల్సిందే’’ అని నీటిసుంకం చెల్లించుకొన్నాడు.

ఈ పాటికి మర్రిమాన్‌ పరగణాలో రెండంతస్తుల బంగ్లా పెరిగింది. గ్రామంలో సగం భూములు కాపువానివే. 100 ఎద్దుల సేద్యం సాగించినాడు. చుట్టూ 5 ఆమడ దూరం అప్పులిచ్చినాడు. నవాబు నగరానికి వేంచేసిన తర్వాత దివాన్జీని పిలిచి ‘‘దివాన్‌సాబ్, మీరెందుకు నీటి సుంకం ఏర్పాటు చేసినారు? ఇది అన్యాయము కాదా?’’ అని విచారించినాడు. అందుకు దీవాను ‘‘హుజూర్‌! నేను కూడా సుంకం చెల్లించుకున్నాను. హుజూర్‌ గారు ఫర్మానె ముబారక్‌ జారీ చేసి వుంటారని నేనున్నూ అనుకున్నాను’’ అని మనవి చేసుకున్నాడు. ‘‘అరే నీవూ హుకుం ఇయ్యలేదు, నేనూ హుకుం ఇయ్యలేదు. మరి ఈ 15 ఏండ్ల నుండి వాడు ఎట్లా వసూలు చేసినాడు? వాణ్ని గిరఫ్తారీ చేయించి తక్షణం పట్టి తెప్పించు’’ అని ఉరిమినారు.

కాపువాడు ఇట్టి ఫర్మాను కొరకై 10 ఏండ్ల నుండి నిరీక్షించుతూనే వున్నాడు. 1000 అష్రఫీలు  బంగారు తట్టలో పోసుకొని జరీ పనిచేసిన మఖ్మల్‌ బట్ట పైన మూసుకొని హుజూరువారికి నజరానా సమర్పించుకొన్నాడు. నజరానా చూచేవరకు నవాబు చల్లబడ్డారు. ‘‘క్యారే నీకీ యెవ్వర్‌ నీటి సుంకం హుకుం ఇచ్చినార్‌?’’ అన్నారు నవాబు. ‘‘హుజూర్‌! గ్యారా కద్దూ బారా కోత్వాల్‌ హుకుం ఎట్లా ఏర్పడిందో మర్రిమాన్‌ పరగణా సుంకం కూడా అట్లే ఏర్పాటైంది’’ అన్నాడు కాపు. ‘‘ఏమంటున్నావురా? సరిగా చెప్పు’’.

‘‘నా తప్పులంతా మాఫ్‌ చేస్తామని సెలవిస్తే అన్నీ మనవి చేసుకుంటాను’’ అని తన కథంతా వర్ణించి చెప్పుకొన్నాడు కాపు. హుజూరు అదేపనిగా నవ్వుతూ ‘‘అరే! నీవు చాలా హుష్యారు మనిషివి. నీ తప్పంతా మాఫ్‌. ఇకముందు నీవు మా దేవిడీ వద్ద రాత్రి గంటలు కొట్తూ వుండుము. అదే నీకు శిక్ష’’ అని సెలవిచ్చినారు.

కాపువానికి కొన్నాళ్ల వరకు తిక్కలేచినట్టుండేది. ఏమిన్నీ ఆదాయం లేదు. అధికారం లేదు. రాత్రులంతా నిద్రకాయవలెను. ఒకనాడు నిద్రమబ్బులో రాత్రి 11 గంటలు కొట్టేది మరిచిపోయినాడు. 12 గంటలకు లేచి కొట్టినాడు. ఈ చిన్నపొరపాటుకు దేవిడీ అంతా తలక్రిందులయ్యింది.

హుజూరు 8 గంటల నుండి గంటకొక బేగంగారి గదికి పొయ్యేవారు. 11 గంటలు కొట్టలేదు. 11 గంటల బేగం వద్దకి హుజూరు పోలేదు. మర్నాడు 11 గంటల బేగంగారు గంటల కాపును పిలిపించి ‘‘అరేయ్‌! నా గంట మరిచిపోకుండా కొట్తూ వుండుము. నెలకు 50 రూపాయిలిస్తాను’’ అన్నది. ‘‘చిత్తం చిత్తం హుజూర్‌’’ అని కాపు తత్తరపాటుతో అన్నాడు. ‘‘ఈ గంటలలో ఏమో రహస్యం ఉందిరా’’ అని కాపువానికి స్ఫురించింది. ఒకనాడు 9 తప్పించినాడు. ఒకనాడు 10 తప్పించినాడు. ఒకనాడు 12 తప్పించినాడు. ఏ గంట తప్పితే మరునాడే ఆ గంట బేగంగారు కాపువానికి జీతం ఏర్పాటు చేసుకొన్నది. ఈ విధంగా నెలకు 400 రూపాయీల జీతం ఏర్పాటైంది. కొన్ని యేండ్ల తర్వాత నవాబుగారికీ సంగతి తెలిసింది. వీడు చలాకీవాడు అని మెచ్చుకొని వాడు సుంకం వసూలు చేసిన గ్రామమే వానికి ఇనాముగా ఇచ్చి పంపివేసినాడు.

సురవరం ప్రతాపరెడ్డి (1896–1953)
‘గ్యారా కద్దూ బారా కోత్వాల్‌’ సంక్షిప్త రూపం ఇది. పదకొండు ఆనిగెపుకాయలు పన్నెండుమంది ఆయగాండ్లు అని ఈ శీర్షిక అర్థం. ‘మొగలాయి జమానాలో కర్ర యెవనిదో బర్రె వానిది అనే బాపతుగా’ సాగుతున్న వ్యవహారాన్ని ఈ కథ చిత్రించింది. సురవరం– రచయిత, సంపాదకుడు, పరిశోధకుడు, నాయకుడు. ఆయన పరిశోధన గ్రంథం ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ సుప్రసిద్ధం. ఆయన సంపాదకత్వంలో వెలువడిన ‘గోలకొండ కవుల సంచిక’ అపురూపమైనది.

సురవరం ప్రతాపరెడ్డి

మరిన్ని వార్తలు