మధుర గోదావరి

6 Jul, 2015 22:45 IST|Sakshi
మధుర గోదావరి

పన్నెండేళ్లకోసారి గోదావరి మాత పరవశిస్తుంది...
తన చెంతకు వచ్చేవారిని
ఉత్తచేతులతో ఎందుకు పంపుతుంది ఆ తల్లి...
తనలో స్నానం చేసి పునీతులవుతున్న వారందరికీ
నోరు తీపి చేస్తుంది...
మళ్లీ మళ్లీ తలచుకునేలా ఆదరిస్తుంది...
పుష్కర నదీ తీరంలోని వారికి ఇదొక పండుగ...
ఎక్కడెక్కడి వారూ పుట్టింటికి వస్తుంటారు...
వచ్చినవారిని తియ్యగా పలకరించండి...
పుష్కరాల సందర్భంగా గోదావరి తీరాన దొరికే
మధుర రుచులు వారి నోటికి అందించండి...
పుష్కరాల సందర్భంగా గోదావరి తీరంలో మాత్రమే దొరికే ప్రత్యేకమైన వంటలు ఈ వారం అందరి కోసం...
 

 తాపేశ్వరం మడత కాజా
కావలసినవి: మైదాపిండి - 2 కప్పులు; బియ్యప్పిండి - 2 టీ స్పూన్లు; పంచదార - 2 కప్పులు; నూనె - వేయించడానికి తగినంత; ఉప్పు - కొద్దిగా; ఏలకుల పొడి - టీ స్పూను; వంటసోడా - చిటికెడు
తయారీ: ఒక పాత్రలో కొద్దిగా నూనె, మైదా పిండి , ఉప్పు వేసి కలపాలి  వంటసోడా జత చే సి మరోమారు కలపాలి  తగినన్ని నీళ్లు పోసి పిండి మెత్తగా కలిపి, సుమారు గంటసేపు నాననివ్వాలి  ఒక పాత్రలో పంచదార, నీళ్లు పోసి తీగపాకం వచ్చే వరకు ఉంచాలి  ఏలకుల పొడి జతచేయాలి  బాగా నానిన మైదా పిండికి పొడిగా ఉన్న బియ్యప్పిండి కొద్దిగా జత చేసి బాగా మర్దనా చేయాలి  చిన్న ఉండ తీసుకుని చపాతీ మాదిరిగా పల్చగా ఒత్తాలి ఒత్తిన చపాతీ మీద నూనె పూసి, ఆ పైన పొడి బియ్యప్పిండి చల్లాలి  ఆ పైన మరో చపాతీ ఉంచాలి. దాని మీద కూడా నూనె రాసి బియ్యప్పిండి వేయాలి  ఈ విధంగా మొత్తం మూడు చపాతీలు ఒకదాని మీద ఒకటి వేయాలి  చివరి దాని మీద నూనె, పిండి వేశాక నెమ్మదిగా రోల్ చేయాలి  అంచుల్లో విడిపోకుండా కొద్దిగా నూనె పూయాలి  చాకు సహాయంతో చిన్న చిన్న కాజాలు కట్ చేయాలి  వాటి మధ్యభాగంలో  అప్పడాలకర్రతో నెమ్మదిగా ఒత్తాలి బాణలిలో నూనె కాగాక ఒక్కో కాజాను వేసి మీడియం మంట మీద కాజాలు బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించి వాటిని వేడి వేడి పాకంలో వేసి సుమారు 20 నిమిషాలు నానిన తర్వాత తీసేయాలి కొద్దిగా వేడి తగ్గాక వడ్డించాలి.
 
 పెద్దాపురం వారి బెల్లం పాలకోవా
 కావలసినవి: పాలు - లీటరు; బెల్లం తురుము - పావు కేజీ; నెయ్యి - కొద్దిగా
తయారీ: పాలను అడుగు మందంగా ఉన్న గిన్నెలో పోసి స్టౌ మీద చిన్న మంట మీద ఉంచి ఆపకుండా కలుపుతుండాలి  ఎప్పటికప్పుడు అంచుల దగ్గర కలుపుతుండాలి  నెమ్మదిగా పాలు చిక్కబడటం మొదలయ్యాక మరింత వేగంగా పాలు కలుపుతుండాలి  బాగా చిక్కబడగానే బెల్లం తురుము వేసి ఆపకుండా కలపాలి  మిశ్రమం బాగా దగ్గర పడ్డ తర్వాత నెయ్యి వేసి కలిపి వెంటనే దించేసి వెడల్పాటి పళ్లెంలోకి తీసుకోవాలి  చేతికి నెయ్యి రాసుకుంటూ పాలకోవా మాదిరిగా తయారుచేసి పళ్లెంలో ఉంచి ఆరనివ్వాలి  గట్టి పడ్డాక వాటిని గాలిచొరని డబ్బాలోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి..
 
 ఆత్రేయపురం పూతరేకులు

 కావలసినవి: బియ్యం - పావు కేజీ; పంచదార - పావు కేజీ; ఏలకుల పొడి - టీ స్పూను; నెయ్యి - పావు కేజీ; నూనె - కొద్దిగా
 తయారీ: బియ్యాన్ని ముందురోజు రాత్రి నానబెట్టి మరుసటి రోజు మిక్సీలో వేసి బాగా మెత్తగా రుబ్బాలి  తగినన్ని నీళ్లు జత చేసి బాగా పల్చగా చేసి ఒక వెడల్పాటి పళ్లెంలో పోయాలి  పూతరేకు కుండను కట్టెల పొయ్యి మీద బోర్లించి, కుండంతా పట్టేలా నూనె రాసి, పళ్లెంలో పల్చటి వస్త్రాన్ని ముంచి, దానిని కుండ మీద వెనుక నుంచి ముందుకు వేగంగా లాగాలి  రెండు నిమిషాలు కాలగానే జాగ్రత్తగా చేతితో కాని, అట్లకాడతో కాని పూతరేకును తీసి పక్కన ఉంచాలి  ఈ విధంగా అన్ని రేకులూ తయారుచేసుకుని పక్కన  ఉంచాలి  నీరు బాగా పిండేసిన ఒక పొడి వస్త్రం మీద పూతరేకులను ఉంచి వెంటనే తీసేయాలి  ఒక రేకు మీద ముందుగా నెయ్యి వేసి, ఆ పైన పంచదార పొడి వేయాలి  పైన మరో పూతరేకు ఉంచి నెయ్యి, పంచదార పొడి వేసి పైన మరో పూతరేకు ఉంచాలి  ముందుగా రెండుపక్కలా మడతలు వేసి వాటిని వరసగా మడవాలి  అప్పటికప్పుడు తయారుచేసి తింటే రుచిగా ఉంటాయి.
 
 ధవళేశ్వరం జనార్దనస్వామి జీళ్లు

 కావలసినవి: బెల్లం తురుము - కేజీ (బూరుగపూడి బెల్లం శ్రేష్ఠం); నెయ్యి - 100 గ్రా; ఏలకుల పొడి - 3 టీ స్పూన్లు; బాగా మందంగా ఉన్న మేకు - 1 (గోడకు గాని, తలుపుకు కాని బిగించాలి)
తయారీ: ఒక మందపాటి పాత్రలో బెల్లం తురుము, కొద్దిగా నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి ఆపకుండా కలుపుతుండాలి  బెల్లం కరిగి ఉండ పాకం వచ్చాక మరి కాసేపు ఉంచి దించేయాలి  గరిటెతో బాగా కలపాలి  ఒకమాదిరి గట్టిగా అయిన తర్వాత ఆ మిశ్రమం పొడవాటి పలుచటి కడ్డీ మాదిరిగా తయారవుతుంది  అప్పుడు ఆ మిశ్రమాన్ని మేకుకి వేసి పొడవుగా లాగుతుండాలి  సుమారు పావు గంట సేపు లాగిన తర్వాత బెల్లం గట్టి పడుతుంది  అప్పుడు వెడల్పాటి బల్ల మీద ఉంచి గుండ్రంగా రోల్ చేసి బియ్యప్పిండి, నువ్వుపప్పు అద్దుతూ రోల్ చేయాలి  మనకు కావలసిన పరిమాణంలోకి వచ్చేవరకు రోల్ చేసి చాకు సహాయంతో చిన్న సైజులోకి జీళ్లను కట్ చేయాలి  బాగా ఆరిన తర్వాత గాలి చొరని డబ్బాలోకి తీసి నిల్వ చేసుకోవాలి.
 
కాకినాడ కోటయ్య కాజా
కావలసినవి:  మైదా - మూడు కప్పు; సెనగ పిండి - 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; బేకింగ్ సోడా - చిటికెడు.
 తయారీ: ఒక పాత్రలో మైదా పిండి, సెనగ పిండి వేసి ఉండలు లేకుండా కలపాలి  బేకింగ్ సోడా జత చేసి మరో మారు కలపాలి తగినన్ని నీళ్లు జత చేసి బాగా మెత్తగా వచ్చేలా కలపాలి (గట్టిగా ఉండకూడదు)  కలిపిన తర్వాత పిండి చేతికి అంటుతుంటే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని పిండిని సుమారు పావుగంట సేపు బాగా మర్దనా చేయాలి. (ఎంత ఎక్కువసేపు కలిపితే అంత బాగా వస్తాయి కాజాలు) పిండి బాగా సాగుతుండాలి  పైన  తడి వస్త్రం వేసి సుమారు మూడు గంటలసేపు నాననివ్వాలి  వేరొక పాత్రలో కేజీ పంచదారకు తగినన్నీ నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి బాగా చిక్కటి పాకం వచ్చేవరకు కలపాలి  ఏలకుల పొడి జత చేసి మరో మారు కలపాలి  మైదా మిశ్రమాన్ని తీసుకుని మరోమారు బాగా మర్దనా చేయాలి  పళ్లెం మీద కొద్దిగా పొడి పిండి వేసి మైదాపిండి మిశ్రమాన్ని దాని మీద దొల్లించి సన్నగా, పొడవుగా గొట్టం ఆకారంలో చేతితో ఒత్తాలి చాకుతో చిన్న చిన్న కాజాల మాదిరిగా కట్ చేయాలి  వాటికి మళ్లీ రెండువైపులా బియ్యప్పిండి అద్ది పక్కన ఉంచాలి  బాణలిలో నూనె పోసి స్టౌ మీద ఉంచి, నూనె కాగిన తర్వాత ఒక్కో గొట్టం కాజాను వేసి వేయించాలి (మీడియం మంట మీద తయారుచేయాలి)  ఒక్కో కాజా బాగా పొంగుతాయి  కాజాలు బంగారు వర్ణంలోకి మారాక తీసేసి పంచదార పాకంలో వేయాలి  సుమారు 30 సెకండ్ల పాటు పాకంలో మునిగేలా చూడాలి. (లేదంటే అవి పాకం పీల్చుకోవు)  ప్లేట్లోకి తీసుకుని వెంటనే వాటి మీద కొద్దిగా నెయ్యి వే సి చేత్తో కిందకు పైకి బాగా కలపాలి. (వేడిగా ఉన్నప్పుడే నెయ్యి వేయడం వల్ల అవి కాజాలకు అంటి మంచి రుచి వస్తాయి).
 
 

మరిన్ని వార్తలు