సరిహద్దు వెలుగురేఖ

25 Nov, 2014 22:52 IST|Sakshi
సరిహద్దు వెలుగురేఖ

రెండు దేశాల మధ్య సరిహద్దుగా ఓ రేఖ ఉంటుంది. ప్రత్యేకించి వేరుపడాలనే తీవ్రమైన కాంక్షతో వేరుపడిన దేశాల మధ్య సరిహద్దు రేఖ ఇంకా బలంగా రూపుదిద్దుకుంటుంది. అయితే ఇండియా- పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న సరిహద్దు మాత్రం ఇంకా తీక్షణంగా విద్యుత్తు వెలుగులతో కాంతులీనుతోంది. అంతరిక్షం నుంచి తీసిన ఛాయాచిత్రాల్లో నారింజరంగులో వెలుగు రేఖ కనిపించింది. ఇదేంటబ్బా! అని పరిశీలిస్తే భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న సరిహద్దు రేఖకు ఈవల (భారత్‌వైపు) ఏర్పాటు చేసిన ఫ్లడ్‌లైట్ల వరుస. ఇది ఎంతదూరం ఉందో తెలుసా? పంజాబ్, రాజస్థాన్, జమ్ము ఇంటర్నేషనల్ బోర్డర్, గుజరాత్‌లతో కలిపి మొత్తం పద్ధెనిమిది వందల అరవై కిలోమీటర్ల దూరం విస్తరించింది.

సరిహద్దును సూచిస్తూ కంచె, దానికి పహారా కాస్తూ సైనికులు ఉండగా కొత్తగా ఈ ఫ్లడ్‌లైట్ల బారులు ఎందుకంటే... మనుషులు- వస్తువుల అక్రమరవాణా, ఆయుధాల సరఫరాను నిరోధించడం కోసం. ఒక్కమాటలో చెప్పాలంటే దేశం వెలుపలి నుంచి చొరబడుతున్న ఉగ్రవాదులను నిలువరించి, దేశంలో ఉగ్రవాదాన్ని అణిచివేయడం కోసం. అందుకోసం మొత్తం రెండువేల కిలోమీటర్ల దూరం ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయాలనేది భారత్ ప్రభుత్వ ఆలోచన. ఈ ఛాయాచిత్రాన్ని 28వ అంతర్జాతీయ స్పేస్‌స్టేషన్ ఎక్స్‌పెడిషన్‌లో (ఈ ఏడాది అక్టోబర్ 28) ప్రదర్శితమైంది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థ ‘నాసా’ అధికారిక వెబ్‌సైట్ నాసా.జిఓవిలో వెల్లడించింది.    
 
 

మరిన్ని వార్తలు