కళ
ఫొటో జర్నలిస్ట్ శిప్రాదాస్ ఫొటో ఫీచర్స్ పుస్తకం ‘ది లైట్ విత్ ఇన్: ఏ డిఫరెంట్ విజన్ ఆఫ్ లైఫ్’ ఇటీవల రాష్ట్రపతి భవన్లో ఆవిష్కరణ జరిగింది... అనే మాట వినబడగానే ‘రాష్ట్రపతి ఆవిష్కరించి ఉంటారు’ అనుకుంటాం. చిత్రం ఏమిటంటే ఈ పుస్తకాన్ని అంధులు ప్రాచీ, ప్రజ్ఞలు ఆవిష్కరించారు. ఈ కవలలు ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు శిప్రాదాస్ వీరిని తొలిసారిగా ఫొటో తీశారు. ఆ సమయంలో వాళ్లు తబలా వాయిస్తున్నారు.
శిప్రాకు ఈ పుస్తకం ఒక కలల ప్రాజెక్ట్. ఆ కల నెరవేరడానికి పుష్కరకాలం పట్టింది. పుస్తకం చూసి ప్రేక్షకుల్లో ఎవరో అన్నారు:‘‘కళ్లుండీ చూడలేని వాళ్ల కళ్లు తెరిపించే పుస్తకం’’ అని.
ఆనందం, బాధ, విచారం, ఉత్సాహం, ఉద్వేగం...భారతదేశంలోని అంధుల సమస్త భావోద్వేగాలను ఆశ్చర్యపరిచే రీతిలో డాక్యుమెంట్ చేశారు శిప్రా. ఒకమారు ‘ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్’కు చెందిన హాస్టల్లో బస చేసినప్పుడు ప్రిన్సిపల్ జవహర్లాల్ కౌల్ నోటి నుంచి ‘గుండె లోతుల్లో నుంచి చూడండి’ అనే మాటను విన్నారు. ఆ మాటను ఆచరణలో పెట్టాలనుకున్నారు. అలా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది.
శిప్రా చిత్రాలు ప్రతీకాత్మకంగా బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి. మన దేశంలోని భిన్న సామాజిక వర్గాలకు చెందిన వస్తువులు ఆ ఛాయాచిత్రాల్లో కనిపిస్తాయి.
రైతులు, జాలరులు, కళాకారులు, వైద్యులు, వ్యాపారులు, చెట్లపై నుంచి కొబ్బరి బొండాలను కోసేవాళ్లు...ఇలా ఎన్నో రంగాల వారితో పాటు ప్రేమజంటలు కూడా ఈ పుస్తకంలో ఉన్నారు.
పుస్తకం అట్ట మీద ఒక అంధ బాలిక దివ్వెను వెలిగిస్తూ ఉంటుంది. ‘అంధత్వం అంటే అంధకారం అని ఎవరు అన్నారు?’ అంటారు శిప్రాదాస్. ఆమె చెప్పింది నిజమే అనడానికి ఈ పుస్తకమే సాక్ష్యం.
ఇందులో కేవలం వార్తాకథానాలు కాకుండా పాఠకులను ఉత్తేజపరిచే నాటకీయత కూడా ఉంది. ఈ ఫొటో ఫీచర్ స్టోరీలలో ఆశ ఉంది. ఆరాటం ఉంది. జీవనపోరాటం ఉంది. చిమ్మ చీకటి మాటున వెలుగు ఉంది.