కొత్త సరుకు...

19 Feb, 2014 23:44 IST|Sakshi

మతిమరపు రాయుళ్ల కోసం...

 స్మార్ట్‌ఫోన్, కళ్లజోడు, పర్స్... ఇలా ముఖ్యమైన వస్తువులను ఎక్కడపడితే అక్కడ మరచిపోయే వాళ్లు మనలో చాలామంది ఉంటారు. ఇలాంటివారి కోసమే తయారైన ఎలక్ట్రానిక్ పరికరం బ్రింగర్! మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వస్తువులకు చిన్న ట్యాగ్‌ను తగిలిస్తే చాలు.. అన్ని వస్తువులు ఉన్నాయా? లేదా? అన్నది చెక్ చేసి దేన్ని మరచిపోయారో మీకు గుర్తు చేస్తుంది. బ్లూ టూత్ ఆధారంగా పనిచేసే ఈ గాడ్జెట్ కారులో లైటర్ స్టాండ్‌లో ఇమిడిపోతుంది. కారెక్కగానే... ట్యాగ్స్ ఉన్న పరికరాలన్నీ మీతోనే ఉన్నాయా? లేదా? అన్నది చూస్తుందన్నమాట. ప్రస్తుతానికి దీన్ని కారు ఉన్నవారు మాత్రమే ఉపయోగించుకునే వీలుంది. భవిష్యత్తులో ఇతరులకూ పనికొచ్చేలా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
 పిల్లల కోసం ఎడ్డీ...

 స్కూల్ పిల్లల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన టాబ్లెట్‌ను మెటిస్ లెర్నింగ్ కంపెనీ ఇటీవలే భారత్‌లో విడుదల చేసింది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఈ టాబ్లెట్ ఏకంగా 1.6 గిగాహెర్ట్‌జ్ డ్యుయల్‌కోర్ ప్రాసెసర్‌పై నడుస్తూండటం విశేషం. అంతేకాదు... ఏడు అంగుళాల స్క్రీన్‌సైజ్‌తో లభించే ఎడ్డీలో ఒక గిగాబైట్ ర్యామ్, ఎనిమిది గిగాబైట్ల మెమరీ ఏర్పాటు చేశారు. రెండు మెగాపిక్సెళ్ల బ్యాక్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా దీని సొంతం. స్కూల్ కరిక్యులమ్‌కు అనుగుణమైన ప్రీలోడెడ్ ఆప్స్, ఆటల ద్వారా కొత్త విషయాలను నేర్పే టెక్నిక్స్ కూడా దీంట్లో ఉన్నాయని, తద్వారా పిల్లలు వేగంగా కొత్త విషయాలను నేర్చుకోగలుగుతారని కంపెనీ తెలిపింది. పిల్లల చేతిలోంచి జారిపడ్డా ఇబ్బంది లేకుండా టాబ్లెట్ చుట్టూ రబ్బర్ ఫ్రేమ్ ఒకటి ఏర్పాటు చేశారు. రెండు నుంచి 10 ఏళ్ల వయసు మధ్యవారి కోసం ఉద్దేశించిన ఎడ్డీలోని కంటెంట్‌ను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు నియంత్రించే వీలుంది. రెండేళ్ల పసివాళ్లు కూడా రోజుకు రెండు గంటల వరకూ టాబ్లెట్‌ను వాడినా కంటికి ఇబ్బంది లేని స్క్రీన్, రెజల్యూషన్‌ను ఉపయోగించామని కంపెనీ తెలిపింది. ధర దాదాపు రూ.10వేలు. మరిన్ని వివరాల కోసం www.eddytablet.com/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
 
 జియోనీ జీ4 ఫాబ్లెట్...

 చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ జియోనీ తాజాగా జీప్యాడ్4 పేరుతో ఓ శక్తిమంతమైన స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. 5.7 అంగుళాల స్క్రీన్‌సైజ్‌తో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ 1.5 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. కేవలం 7.95 మిల్లీమీటర్ల మందంతో ఉండే అల్యూమినియం యునీబాడీ జీప్యాడ్ మరో ప్రత్యేకత. 1280 బై 720 ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లేతో చిత్రం స్పష్టతపై ఢోకా ఉండదు. అప్లికేషన్లు లాంచ్ చేసేందుకు, ఇతర కర్యాకలాపాల కోసం సంజ్ఞలు చేస్తే సరిపోయేలా దీంట్లో గెస్చర్ కంట్రోల్ టెక్నాలజీని కూడా ఏర్పాటు చేశారు. ఆటోఫోకస్, ఎల్‌ఈడీ ఫ్లాష్‌లతో కూడిన 13 మెగాపిక్సెళ్ల బ్యాక్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 3200 ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు కొన్ని మార్పులు చేర్పులు చేసిన ఆమిగో ఓఎస్‌ను దీంట్లో ఉపయోగించారు. ఫలితంగా ఫేస్‌బ్యూటీ ఎఫెక్ట్స్, హ్యాండ్స్‌ఫ్రీ ఫొటో, గెస్చర్ రికగ్నిషన్, మోషన్ సెన్సింగ్, పనోరమా మోడ్ (హారిజాంటల్, వెర్టికల్ కూడా) ఫేస్ డిటెక్షన్, టచ్ ఫోకస్ వంటి అదనపు హంగులు చేరాయి. డిజిటల్ థియేటర్ సిస్టమ్‌ను కూడా కలిపి ఉంచిన ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు రూ.18999.
 

మరిన్ని వార్తలు