కొత్త సరుకు

9 Apr, 2014 23:43 IST|Sakshi

క్యూప్యాడ్ ఈ704
 
దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా తాజాగా క్యూప్యాడ్ ఈ704 పేరుతో ఓ టాబ్లెట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దాదాపు రూ.9999 ఖరీదు చేసే ఈ టాబ్లెట్‌ను ముఖ్యంగా యువ ప్రొఫెషనల్స్, కంపెనీలను దృష్టిలో ఉంచుకుని సిద్ధం చేశారు. వీడియో, వాయిస్ కాల్స్ రెండింటినీ సపోర్ట్ చేసే ఈ డ్యుయెల్ సిమ్ టాబ్లెట్ 1.2 క్వాడ్‌కోర్ బ్రాడ్‌కామ్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. ఏడు అంగుళాల ఐపీఎస్ ఫుల్ డిస్‌ప్లే స్క్రీన్, 1024 బై 600 రెజల్యూషన్ దీని సొంతం. ఒక గిగాబైట్ ర్యామ్, నాలుగు గిగాబైట్ల ఇంటర్నల్ స్టోరేజీ (మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు)లతో వచ్చే క్యూప్యాడ్‌లో ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగించారు. గేమ్స్ కోసం వీడియోకోర్ మల్టీమీడియా టెక్నాలజీని వాడారు. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 3.2 మెగాపిక్సెల్స్ కాగా, ఫ్రంట్ కెమెరాది 0.2 ఎంపీ. బ్యాటరీ సామర్థ్యం 3500 ఎంఏహెచ్.
 
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్‌తో...గెలాక్సీ ఏస్ స్టైల్

 
 ఆండ్రాయిడ్ తాజా ఆపరేటింగ్ సిస్టమ్ 4.4 కిట్‌క్యాట్‌తో పనిచేసే సరికొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఏస్ స్టైల్‌ను సాంసంగ్ అందుబాటులోకి తెచ్చింది. మొట్టమొదటగా జర్మనీలో విడుదలయ్యే ఈ ఫోన్ భారత్‌లో ఎప్పుడు విడుదలవుతుందన్నది స్పష్టం కావాల్సి ఉంది. నాలుగు అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే స్క్రీన్‌తో వచ్చే ఏస్ స్టైల్ 1.2 గిగాహెర్ట్జ్ డ్యుయెల్‌కోర్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. ర్యామ్ కేవలం 512 మెగాబైట్స్ మాత్రమే ఉండటం గమనార్హం. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 64 గిగాబైట్ల సమాచారాన్ని స్టోర్ చేసుకునే అవకాశముంటుంది. ఇంటర్నల్ స్టోరేజీ 4 గిగాబైట్లు మాత్రమే. బ్లూటూత్, ఎడ్జ్, జీపీఆర్‌ఎస్‌లతోపాటు త్రీజీ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. ఛాట్‌ఆన్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీసు అప్లికేషన్‌తో కలిపి వచ్చే ఏస్ స్టైల్ క్రీమ్‌వైట్, గ్రే రంగుల్లో లభ్యం కానుంది. ధర ఎంతన్నది స్పష్టంగా తెలియకపోయినప్పటికీ రూ.16,500 నుంచి రూ.25,000 మధ్యలో ఉండవచ్చునని అంచనా.
 

మరిన్ని వార్తలు