డోపీలు జాగ్రత్త

18 Jan, 2014 01:47 IST|Sakshi

 కేశగ్రీవ పరీక్ష వచ్చింది
 క్రీడల్లో పెరిగిన డోపింగ్ జాఢ్యాన్ని అరికట్టేందుకు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా... ఏదో ఒక రూపంలో డ్రగ్స్ తీసుకుని దేశానికి మచ్చ తెచ్చే క్రీడాకారులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో డోపింగ్‌ను పూర్తిగా అరికట్టే విధంగా ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఓ అడుగు ముందుకు వేసింది. రకరకాల పరిశోధనల తర్వాత కేశగ్రీవ (హెయిర్ ఫొలికల్ టెస్టు-వెంట్రుకను స్రవించే పుటిక) పరీక్షను అమల్లోకి తేనుంది.

 ఈ టెస్టు ద్వారా  క్రీడాకారులు ఏ రూపంలో డ్రగ్స్ తీసుకున్నా ఇట్టే గుర్తించొచ్చని ‘వాడా’  కొత్త బాస్ క్రెయిగ్ రీడ్ చెబుతున్నారు. కొన్నిసార్లు శాంపిల్స్‌ను పరీక్షించినా కచ్చితమైన ఫలితాలు రాబట్టలేని సందర్భాల్లో ఈ టెస్టుతో నిజాన్ని నిగ్గు తేల్చొచ్చని పేర్కొన్నారు.

 సప్లిమెంట్లు, టాబ్లెట్లు, ఎనర్జీ డ్రింక్స్, రక్త మార్పిడి ఇలా ఎన్ని రకాలుగా డోపింగ్‌కు పాల్పడినా ఈ పరీక్షతో సులువుగా గుర్తించొచ్చు. ఈ కొత్త పరీక్ష కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) 10 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధిని కేటాయించింది. చాలా ఏళ్ల కిందటే ఈ పద్ధతిని ఫ్రాన్స్ ప్రోత్సహించినా... పాలకుల నిర్లక్ష్యం... అథ్లెట్ల వ్యతిరేకత వల్ల వెలుగులోకి రాలేకపోయింది.

ఇప్పటికైనా రీడ్ ఈ పద్ధతి అమలుకు ఒప్పుకోవడం చాలా సంతోషించిదగ్గ అంశం. ఓ రకంగా చెప్పాలంటే ఇటీవల డోపింగ్ పాజిటివ్స్‌గా తేలిన జమైకా స్టార్లు అథ్లెట్లు వెరోనికా క్యాంప్‌బెల్ బ్రౌన్, అసపా పావెల్, షెరోన్ సింప్సన్‌లకు ఇది పెద్ద దెబ్బే. ఈ కొత్త విధానాన్ని  స్ప్రింట్ కింగ్ ఉసేన్ బోల్ట్  స్వాగతించాడు. కొత్త పరీక్షతో తనకెలాంటి సమస్య లేదన్నాడు. మిగిలిన అథ్లెట్లు కూడా ఈ పరీక్షకు సిద్ధమవుతారా? లేక గతంలో మాదిరిగా వ్యతిరేకిస్తారో చూడాలి.

మరిన్ని వార్తలు