హాట్సాఫ్‌ వాట్సాప్‌

19 May, 2019 00:51 IST|Sakshi

స్త్రీ శక్తి

సార్వత్రిక ఎన్నికల్లో నేడు చివరి విడతగా 59 ఎంపీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. బిహార్‌ (8 స్థానాలు), జార్ఖండ్‌ (3), మధ్యప్రదేశ్‌ (8), పంజాబ్‌ (13), పశ్చిమ బెంగాల్‌ (9), ఛండీగఢ్‌ (1), ఉత్తర ప్రదేశ్‌ (13), హిమాచల్‌ ప్రదేశ్‌ (4) రాష్ట్రాలలోని ఆయా నియోజక వర్గాల ప్రజలు తమ ఓటు హవినియోగింక్కును చుకోనున్నారు. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్‌లో గత ఎన్నికలతో పోలిస్తే అనేక స్థానాలలో ఓటు వేసిన మహిళల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపించగా.. ఇవాళ్టి ఎన్నికలు కూడా పూర్తయ్యాక జరిగే విశ్లేషణలో పురుష ఓటర్లను మించి మహిళా ఓటర్లు లెక్క తేలే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ జరిగిన 16 సార్వత్రిక ఎన్నికల్లోనూ లేని విధంగా ఈ ఎన్నికల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారని, అందుకు కారణం.. మహిళల్లో నిరక్షరాస్యత శాతం తగ్గడం, స్త్రీ సాధికారత ప్రయత్నాలు పెరగడం, ఎన్నికల కమిషన్‌ ప్రచారం మొదలైనవి ప్రధానమైనవి కాగా.. టెక్నాలజీ పరంగా చూస్తే, వాట్సాప్‌ అందుబాటులోకి రావడం.. మహిళల్లో ఓటు వేయాలన్న చైతన్య కలగడానికి కీలకమైన అంశంగా దోహదపడిందని ‘షి ది పీపుల్‌.టీవీ’ వ్యవస్థాపకురాలు, ‘ది బిగ్‌ కనెక్ట్‌–సోషల్‌ మీడియా అండ్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌’ పుస్తక రచయిత్రి అయిన శైలీ చోప్రా అంటున్నారు.

‘‘గతంలో ఓటు వెయ్యడం అనేది మహిళ జీవితంలో ఒక రోజుతో పూర్తయ్యే ప్రస్తావన. వాట్సాప్‌ వచ్చాక ఓటు విలువ, ఓటు వినియోగంపై విస్తృతంగా చర్చ జరిగి (వాట్సాప్‌ గ్రూపుల్లో), మహిళలకది తమ జీవితంలోని ఒక ముఖ్యమైన బాధ్యత అన్న స్పృహను కలిగించింది. పర్యవసానమే.. మహిళల ఓట్లు.. పురుష ఓట్లను మించిపోడం’’అని చెబుతున్న శైలీ, గ్రామీణ ప్రాంతాలలో సైతం వాట్సాప్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఫలితాలు ఎలా ఉన్నా, మహిళల అభీష్టానుసారం మాత్రమే గెలుపోటములు ఉంటాయని శైలీ చోప్రా చెబుతున్న దానిని బట్టి అర్థమౌతోంది.

మరిన్ని వార్తలు