మూడేళ్లయినా ఎక్స్‌గ్రేషియాకు దిక్కులేదు

6 Nov, 2018 05:28 IST|Sakshi

ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని అయ్యపురాజుపాలెం గ్రామానికి చెందిన యువ కౌలు రైతు అప్పుల బాధ తాళలేక గంగవరపు హరిబాబు (30) 2015 జూలై 12న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గంగవరపు నర్సింగరావు ఇద్దరి కుమారుల్లో పెద్ద కుమారుడు హరిబాబు కుటుంబ భారాన్ని తనపై వేసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఉన్న నాలుగు ఎకరాలు భూమితోపాటూ మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకొని, 10 ఎకరాల్లో పొగాకు, రెండెకరాలలో కంది సాగు చేశాడు.

రూ. 5 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాడు. పొగాకుకు రూ. లక్ష రుణం పొందాడు, బంగారం తాకట్టు పెట్టి  రూ.45 అప్పు తెచ్చాడు. మరో రూ. 4 లక్షలు నెలకు వందకు రూ. రెండు వడ్డీకి ప్రైవేటుగా అప్పుతెచ్చాడు. పరిస్ధితి అనుకూలించకపోవటంతో 25 క్వింటాళ్ల పొగాకు మాత్రమే దిగుబడి వచ్చింది. గిట్టుబాటు ధర రాక చివరికి రూ. మూడున్నర లక్షల అప్పు మిగిలింది. అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లకు తట్టుకోలేక మనస్తాపం చెందిన హరిబాబు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హరిబాబు కుటుంబానికి ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎక్స్‌గ్రేషియా అందలేదు.  

రుణ మాఫీ కాలేదు..
రుణమాఫీ కోసం అధికారుల వద్దకు 20 సార్లు తిరిగాం. సమాధానం చెప్పేవారే కరువయ్యారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నాం. మాకు న్యాయం జరగలేదు. అధికారులు పట్టించుకోలేదు. రూ.120తో పార్టీ సభ్యత్వం తీసుకున్నాం. సభ్యత్వం ఉంటే సహాయ సహకారాలు అందుతాయని చెప్పారు. దీని వల్లా ఎలాంటి ఉపయోగం లేదని తేలిపోయింది. ఉపయోగం లేనçప్పుడు పార్టీ ఎందుకు? సభ్యత్వం ఎందుకు?


– కిరణ్, మృతుని సోదరుడు

ప్రభుత్వం నుంచి ఎటువంటి  సాయం అందలేదు
పొగాకు పచ్చాకు ముఠాకు కూలి డబ్బుల బకాయిలను వడ్డీకి తెచ్చి చెల్లించాం. తెచ్చిన డబ్బుకు వడ్డీ కట్టలేక ఇంకా అప్పులపాలయ్యాం. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహాయం అందలేదు.

– మృతుడి తండ్రి నర్శింగరావు

మరిన్ని వార్తలు