ఒత్తిడి నుంచి స్వస్థతకు...

4 Aug, 2015 23:03 IST|Sakshi
ఒత్తిడి నుంచి స్వస్థతకు...

ఆరోగ్యానికి ఒత్తిడి చేసే కీడు అంతా ఇంతా కాదు. దీర్ఘకాలంపాటు కొనసాగే ఒత్తిడి వ్యక్తుల్లోని రోగనిరోధకశక్తిని క్రమంగా తగ్గిపోయేలా చేస్తుంది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, భావోద్వేగ పరమైన అనేక ఒత్తిడులతో అన్ని రకాలుగా కునారిల్లేలా చేస్తుంది. నీలిమాభట్ ఒక బహుముఖప్రజ్ఞాశాలి. ఆమె రూట్స్ అండ్ వింగ్స్ పేరిట సంపూర్ణ ఆరోగ్యం కోసం సంస్థల స్థాయిలో, వ్యక్తుల స్థాయిలో ఒత్తిడుల నుంచి బయటపడేందుకు శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో హైటెక్స్‌లో ‘లివ్‌వెల్ ఎక్స్‌పో’ పేరిట సాక్షి నిర్వహించనున్న ప్రదర్శనలో ఒత్తిళ్ల నుంచి బయటపడే మార్గాలను వివరించనున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పిన అంశాలివి...
 
ఆరోగ్యం అంటే కేవలం వ్యాధులు లేని స్థితి కాదంటారు నీలిమా భట్. రూట్స్ అండ్ వింగ్స్ సంస్థ పేరిట సమగ్ర ఆరోగ్య స్థితిని పొందడం కోసం ఎంతో మంది వ్యక్తులకూ, ఎన్నో సంస్థలకూ జీవన వికాస కార్యక్రమాలను నిర్వహిస్తున్నారామె.ఇటీవలే ‘మై క్యాన్సర్ ఈజ్ మీ’ అనే పుస్తకంతో ‘క్యాన్సర్’ను అధిగమించడం ఎలాగో చెబుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. తమ పట్ల తాము స్పృహ సాధించి, తమ ఆత్మానందాన్ని తామే అన్వేషించి, దానిని పొందడం ఎలాగో చెప్పే నీలిమా భట్ ‘ఒత్తిడి నుంచి స్వాస్థ్యత’ దిశగా మనల్ని మనం బయట పడేసుకోవడం కోసం ఎన్నో అంశాలను వివరించారు. ఎందరో వ్యక్తులకు తమ శారీరక మేధాశక్తినీ, ఆధ్యాత్మిక సంపత్తిని పెంపొందించుకోవడంపై శిక్షణ ఇస్తున్నారు.

ఒక యోగా బోధకురాలిగా, నృత్యదర్శకురాలిగా కీలక భూమికలు నిర్వహిస్తున్న ఆమె ముంబైలో నివసిస్తున్నారు. గత పదేహేనేళ్లుగా ఎన్నో కార్పొరేట్ సంస్థలకూ, వాటి ఉద్యోగులకు స్ఫూర్తిని రగిలిస్తూ, వారిని అభివృద్ధి దిశగా అడుగులు వేయించిన ఆమె మాటలు..
 
 ప్ర: ఆరోగ్యాన్ని మీ మాటల్లో నిర్వచిస్తారా?

 నీలిమ: ఆరోగ్యాన్ని కొందరు అనారోగ్యం లేని స్థితిగా చాలా తేలిగ్గా చెప్పేస్తారు. నిజానికి ఆరోగ్యం అంటే స్వాస్థ్యం. అంటే... శారీరకంగా అనారోగ్యాలు లేని పరిస్థితితో పాటు మానసికంగా ఒక ఉన్నతస్థాయి అనుభూతితో, సామాజిక అంశాల్లో చురుగ్గా పాలుపంచుకుంటూ జీవితాంతం అదే స్థితిలో ఉండగలగడం. ఇందులో శారీరక, మానసిక, ఉద్వేగభరితమైన, ఆత్మసంబంధమైన అంశాలన్నీ కలగలసి అత్యున్నతానంద స్థితిలో మనిషి ఉంటాడు.

 ప్ర: ఒత్తిడి ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ప్రక్రియ గురించి వివరించండి.
 నీలిమ: ముందుగా మన శరీరక ఆరోగ్య స్థితిని పొందడం ఎలాగో చూద్దాం. ఇందుకోసం ప్రకృతి మనకు ప్రసాదించిన మనలోని రోగనిరోధకవ్యవస్థ బాగా ఉపయోగపడుతుంది. ఇది మనకు వచ్చే జబ్బులను అంతర్గతంగానే నయం చేస్తుంది. మనకు రాబోయే కొన్ని వ్యాధులతో పోరాడి నిరోధిస్తుంది. కానీ మనం ఎప్పుడూ ఏదో ఒక ఒత్తిడిలో ఉన్నామనుకుందాం. కొద్దికాలం పాటు ఆ ఒత్తిడిని భరిస్తూ వచ్చిన మన శరీరం... ఆ తర్వాత ఆ దీర్ఘకాలిక ఒత్తిడిని తట్టుకోలేదు. మనం దాని నుంచి బయటపడటానికి ప్రయత్నించకపోతే అది మన రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. మనలో ఒత్తిడి ఎంత పెరుగుతుందో రోగనిరోధకశక్తి అంతగా తగ్గుతుంది. అలా మనం ఒత్తిడితో ఉండటం కూడా మన ఆరోగ్యాన్ని అస్తవ్యస్తం చేస్తుందన్నమాట. ఈ విషయాలను శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్నారు. అవి నిరూపితమయ్యాయి. ఒత్తిడి పెరుగుదలకూ, ఆరోగ్యం తగ్గుదలకూ ఉన్న సంబంధాన్ని పీఎన్‌ఐ అంటారు. అంటే... సైకో న్యూరో ఇమ్యూనాలజీ అన్నమాట.
 
 ప్ర: మరి ఒత్తిడి నుంచి బయటపడటం ఎలా?
 నీలిమ: ఒత్తిడి నుంచి బయటపడటం అంటే ఏదో ఒక ఒత్తిడి నుంచి దూరం కావడం కాదు. మనలను ఒత్తిడికి గురి చేసే అంశాలు ప్రధానంగా ఐదు రకాలుగా ఉంటాయి. వాటన్నింటి నుంచి పూర్తిగా బయటపడటాన్ని ‘సంపూర్ణ’ అని వ్యవహరించవచ్చు.
 
 ప్ర: ఆ ఐదు రకాల ఒత్తిడులను వివరిస్తారా?

 నీలిమ:  మొదటిది: శరీరక ఒత్తిడి. ఇది జీవనశైలితో వస్తుంది. అంటే మన ఆహారం, వ్యాయామం, విశ్రాంతి, ఆల్కహాల్ తీసుకోవడం, పొగతాగడం, మన చుట్టూ ఉన్న వాతావరణం కారణంగా ఈ ఒత్తిడి పడుతుంది.

రెందోది: ఉద్వేగపరమైన ఒత్తిడి. ఇది మన రోజువారీ జీవితంలో మనం సంతృప్తి చెందని అనుభూతులనుంచి, లోపల మానసికంగా అయ్యే గాయాల వల్ల ఏర్పడుతుంది.

మూడోది: మానసికమైన ఒత్తిడి. ఇది మనం ఆలోచించే తీరు, మన జీవితంలో పాటించే విలువలు, నమ్మకాలు, మన ప్రవర్తన, మన ఊహాపోహల వల్ల ఏర్పడే ఒత్తిడి.
     
నాల్గోది : మన చుట్టూ ఉన్న వ్యవస్థల కారణంగా మనపై పడే ఒత్తిడి. ఉదాహరణకు మన వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, వృత్తిపరమైన ఒత్తిడులన్నమాట.
      
ఐదోది: ఆత్మసంబంధమైన ఒత్తిడులు (అంటే మన గుర్తింపు, మనుగడ, మన జీవిత లక్ష్యాలు, మన మతపరమైన నమ్మకాల కారణంగా పడే ఒత్తిళ్లన్నమాట.
 
 ప్ర: మరి ఈ అన్ని ఒత్తిడులను అధిగమించడం ఎలా?
 నీలిమ: కొద్దిపాటి కృషితో ఒత్తిడులను అధిమించడం సులభం. మనం జీవితంలోని బాధలను గ్రహించాలి. మన ముందున్న సవాళ్లను తెలుసుకోవాలి. మన జీవనశైలిని, మన అలవాట్లనూ ఆరోగ్యవంతంగా మార్చుకోవాలి. మన ప్రవర్తనను ఆమోదయోగ్యంగా చేసుకోవాలి. ఈ లోకంలో తమతో పాటు మనం తోడుగా ఉన్నందుకు మన చుట్టూ ఉన్నవారందరూ ఆనందించేలా మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటే మన ఒత్తిడులన్నీ తొలగుతాయి. దాంతో మనలోని రోగనిరోధకశక్తి మరింత ఇనుమడిస్తుంది. అంతే... ‘ఒత్తిడి నుంచి స్వస్థత’ చేకూరుతుంది. అది మీ ఆరోగ్యాన్నీ కాపాడుతుంది.
 
డీఎస్ రీసెర్చ్ సెంటర్ గురించి
‘సంపద కంటే స్వస్థతే విలువైనది’ అనే సూక్తితో ప్రారంభమైన డీఎస్ రీసెర్చ్ కార్యకలాపాల ఆవిర్భావం చాలా అద్భుతంగా జరిగింది. దయాశంకర్ తివారీ అనే తమ సోదరుడు అకస్మాత్తుగా జబ్బుపడి, ఎనిమిది రోజుల్లోనే మృతిచెందడం ఆయన అన్నలిద్దరినీ అంటే... డాక్టర్ ఉమాశంకర్ తివారీ, ప్రొఫెసర్ శివశంకర్ త్రివేదీని తీవ్రంగా కలచివేసింది. దాంతో వారు ఆయుర్వేద మార్గాలలో అంతుచిక్కని జబ్బులకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నం ప్రారంభించారు. సంప్రదాయ చికిత్స ప్రక్రియలో ఒక విప్లవాన్నే సృష్టించారు.
 తొలుత చాలా పరిమితమైన వనరులతో ఈ వైద్యసేవలు మొదలయ్యాయి. డీఎస్ రీసెర్చ్ సెంటర్ సేవలు తగ్గవని చెప్పే స్టేజ్-4లో ఉన్న క్యాన్సర్ వంటి వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించి చాలామందిలో ఆశనూ, ఆరోగ్యాన్నీ, ఆనందాన్నీ నింపారు. ఆ రంగంలో సుశిక్షితులైన, అర్హులైన ఆయుర్వేదాచార్యులతో, డైటీషియన్లతో, ఆంకాలజిస్టులతో చికిత్స చేసి అనేక రకాల క్యాన్సర్లను నయం చేశారు. ప్రస్తుతం డీఎస్ రీసెర్చ్ సెంటర్‌కు సంబంధించిన క్లినిక్‌లు భారతదేశవ్యాప్తంగా వారణాసి, కోల్‌కతా, గౌహతీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి అనేక నగరాల్లో సేవలందిస్తున్నాయి. త్వరలో ఢిల్లీ, అహ్మదాబాద్‌లోనూ డీఎస్ రీసెర్చ్ సెంటర్ క్లినిక్‌లు ప్రారంభం కానున్నాయి. ఇటీవల తమ రీసెర్చ్ సేవలన్నింటినీ క్యాన్సర్‌ను అంకురం నుంచి తొలగించడానికే ఈ సంస్థ ఉపయోగిస్తోంది. ‘‘రండి... క్యాన్సర్ నుంచి ప్రపంచాన్ని రక్షిద్దాం’’ లఅనేదీ డీఎస్ రీసెర్చ్ సెంటర్ సందేశం.
 
 ఈనెల 8, 9 తేదీలలో హైదరాబాద్ హైటెక్స్‌లో జరగనున్న
 ‘సాక్షి లివ్‌వెల్ ఎక్స్‌పో’ గురించి మరింత సమాచారం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ - 96662 84600

మరిన్ని వార్తలు