కలపకండి కలుసుకోండి 

17 Nov, 2018 00:24 IST|Sakshi

వనభోజనాలంటేనే ప్రకృతితో ఏకమవ్వడం... అన్నం పెట్టిన చెట్టుకు దండం పెట్టుకోవడం...కుటుంబంలో తను ఒక సభ్యులని గుర్తు చేసుకోవడం...తనతోపాటు కలిసి భోజనం చేయడం... వనభోజనం కృతజ్ఞతల ఘనభోజనం...ప్రకృతి మాత పిల్లలకు ముద్దలు చేసి పెడితే ఎంత బాగుంటుందో అనుకుంటున్నారు కదా!అందుకే ఈ వారం అన్నీ కలిపిన వంటలే... ముద్దలు చేసుకుని తినడం మాత్రమే!కలపకండి... కలుసుకోండి.

క్యారట్‌ దద్ధ్యోదనం
కావలసినవి: బియ్యం – ఒక కప్పు; పెరుగు – 3 కప్పులు; మిరియాలు – ఒక టీ స్పూను; క్యారట్‌ తురుము – ఒక కప్పు; జీడి పప్పులు – 15; కిస్‌మిస్‌ – గుప్పెడు; దానిమ్మ గింజలు – అర కప్పు; పాలు – 2 టేబుల్‌ స్పూన్లు; మీగడ – పావు కప్పు ; ఉప్పు – తగినంత

పోపు కోసం: పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 5 ; పచ్చి మిర్చి – 5; కరివేపాకు – 2 రెమ్మలు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు; కరివేపాకు – 3 రెమ్మలు; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్‌ స్పూను

తయారీ: ∙బియ్యం శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి పక్కన ఉంచాలి ∙బాణలిలో నెయ్యి వేసి కరిగించాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, మిరియాలు, కరివేపాకు వరుసగా వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి ∙అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి కాగాక జీడి పప్పులు, కిస్‌మిస్‌ వేసి వేయించి తీసేయాలి ∙మరి కాస్త నెయ్యి వేసి కరిగాక క్యారట్‌ తురుము వేసి దోరగా వేయించి తీసేయాలి ∙ఒక పెద్ద పాత్రలో అన్నం వేసి పల్చగా పరవాలి ∙వేయించి ఉంచుకున్న పోపు, జీడిపప్పులు, కిస్‌మిస్, క్యారట్, ఉప్పు వేసి బాగా కలపాలి. పెరుగు, పాలు, మీగడ జత చేసి కింద నుంచి పైకి కలియబెట్టాలి ∙దానిమ్మ గింజలు వేసి మరోమారు కలపాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించి అందించాలి.

ఉసిరి రైస్‌
కావలసినవి
బాస్మతి బియ్యం – ఒక కేజీ; పెద్ద ఉసిరి కాయల తురుము – అర కప్పు; పచ్చి సెనగ పప్పు – పావు కప్పు; మినప్పప్పు – పావు కప్పు; ఆవాలు – రెండు టీ స్పూన్లు; జీలకర్ర – రెండు టీ స్పూన్లు; ఎండు మిర్చి – 15; పచ్చి మిర్చి – 6; బెల్లం పొడి – ఒక టీ స్పూను; ఇంగువ – తగినంత; కరివేపాకు – 3 రెమ్మలు; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; జీడి పప్పులు – 50 గ్రా.; వేయించిన పల్లీలు – 100 గ్రా.; నువ్వుల నూనె/ నెయ్యి – 3 టేబుల్‌ స్పూన్లు

తయారీ: ∙ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి వెంటనే పెద్ద పళ్లెంలోకి తీసి ఆరబోయాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి లేదా నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి ∙ఆవాలు, జీలకర్ర , పచ్చి మిర్చి, ఎండు మిర్చి, ఇంగువ వరుసగా వేసి బాగా కలపాలి ∙దోరగా వేగిన తరవాత ఉసిరి కాయ తురుము జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙కరివేపాకు జత చేసి బాగా కలపాలి ∙చివరగా జీడి పప్పులు, వేయించిన పల్లీలు వేసి మరో సారి వేయించి దింపేయాలి ∙పళ్లెంలో ఉన్న అన్నం మీద ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి ∙వేయించి ఉంచుకున్న ఉసిరి + పోపు మిశ్రమం, బెల్లం పొడి చివరగా వేసి బాగా కలియబెట్టాలి ∙సుమారు గంట సేపు ఊరిన తరవాత దేవుడికి నివేదన చేసి సేవించాలి ∙వనభోజనాలలో ఉసిరి తప్పనిసరిగా తినాలంటారు కనుక, విడిగా ఉసిరి తినవలసిన అవసరం లేకుండా ఉసిరి రైస్‌ సిద్ధం చేసుకుంటే సరి.

డ్రై ఫ్రూట్స్‌ క్షీరాన్నం
కావలసినవి 
బియ్యం – ఒక కప్పు; చిక్కటి పాలు –  4 కప్పులు; బెల్లం పొడి – 2 కప్పులు; నెయ్యి – ఒక కప్పు; జీడి పప్పులు – 25 గ్రా.; కిస్‌మిస్‌ – 25 గ్రా.; పిస్తా – 25 గ్రా.; ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్‌ స్పూను; గింజలు లేని ఖర్జూరాలు – 5; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు
తయారీ: ∙ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లలో నానబెట్టాలి ∙చిక్కటి పాలను బాగా మరిగించాలి ∙బియ్యంలోని నీళ్లను ఒంపేసి పాలలో వేసి కలియబెట్టాలి ∙బాగా మెత్తగా ఉడికేవరకు అడుగు అంటకుండా కలుపుతూ ఉడికించాలి (పాలు చాలకపోతే మరిన్ని పాలు కాని నీళ్లు కాని జత చేయాలి) ∙ఒక చెంచాడు నెయ్యి వేసి కలియబెట్టాలి ∙బెల్లం తురుము వేసి మరోమారు బాగా కలిపి దింపేయాలి ∙బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిçపప్పులు, కిస్‌ మిస్, ఎండు కొబ్బరి ముక్కలు, పిస్తాలను విడివిడిగా వేయించి తీసి చక్ర పొంగలిలో వేసి కలపాలి ∙ఖర్జూరాలను కూడా జత చేసి మరోమారు కలపాలి ∙చివరగా కుంకుమపువ్వు వేసి కలియబెట్టాలి ∙క్షీరాన్నం బాగా చల్లారాక అందించాలి.

నేతి బీరకాయ బజ్జీ
కావలసినవి: నేతి బీరకాయలు – 2; సెనగ పిండి – అర కేజీ; బియ్యప్పిండి – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి పేస్ట్‌ – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; తినే సోడా–చిటికెడు; నూనె – వేయించడానికి తగినంత
తయారీ: ∙ముందుగా నేతి బీరకాయలను శుభ్రంగా కడిగి, సన్నగా చక్రాల్లా తరిగి పక్కన  ఉంచాలి ∙ఒక పెద్ద గిన్నెలో సెనగ పిండి, బియ్యప్పిండి, ఉప్పు, మిరప కారం, అల్లం తురుము, పచ్చి మిర్చి పేస్ట్, ధనియాల పొడి, జీల కర్ర పొడి, చిటికెడు సోడా వేసి బాగా కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి బజ్జీల పిండి మాదిరిగా కలుపుకుని పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, నేతి బీర కాయ చక్రాలను ఒక్కటొక్కటిగా నూనెలో వేసి, రెండు వైపులా దోరగా వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి ∙కొబ్బరి చట్నీతో కాని, గ్రీన్‌ చట్నీతో కాని తింటే రుచిగా ఉంటాయి. 

బిసిబేళ బాత్‌
కావలసినవి: ధనియాలు – 4 టీ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – 4 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; ఏలకులు –  4; దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 4; ఎండు కొబ్బరి తురుము – 2 టేబుల్‌ స్పూన్లు; గసగసాలు – 2 టీ æస్పూన్లు; నువ్వులు – ఒక టీ స్పూను; నూనె – ఒక టీ స్పూను; కాశ్మీరీ ఎండు మిర్చి – 12; కరివేపాకు – మూడు రెమ్మలు; ఇంగువ – చిటికెడు; క్యారట్‌ – 1 (చిన్నది); బీన్స్‌ – 5; పచ్చి బఠాణీ – 2 టేబుల్‌ స్పూన్లు; బంగాళదుంప – అర చెక్క (ముక్కలు చేయాలి); పల్లీలు – 2 టేబుల్‌ స్పూన్లు; నీళ్లు – 2 కప్పులు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; చింతపండు రసం – ముప్పావు కప్పు (కొంచెం చిక్కగా ఉండాలి); బెల్లం పొడి – అర టీ స్పూను; ఉల్లి పాయ – అర చెక్క (ముక్కలు చేయాలి); ఉడికించిన కంది పప్పు – ఒక కప్పు; అన్నం – రెండున్నర కప్పులు; నీళ్లు – ఒక కప్పు; నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను

పోపు కోసం: నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); ఇంగువ – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; జీడిపప్పులు – 10
తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో కూరగాయ ముక్కలు, పల్లీలు, నీళ్లు, పసుపు, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి ముక్కలు మెత్తపడే వరకు ఉడికించాలి ∙ముక్కలు బాగా ఉడికిన తరవాత చింతపండు రసం, బెల్లంపొడి, ఉల్లి తరుగు వేసి సుమారు పదినిమిషాల పాటు ఉడికించాలి ∙ఉడికించిన పప్పు, అన్నం జతచేసి బాగా కలిపి మరో కప్పు నీళ్లు పోసి కలియబెట్టి, మూత పెట్టాలి ∙çకొద్దిసేపటి తరవాత 4 టీ స్పూన్ల బిసిబేళబాత్‌ మసాలా వేసి సన్నని మంట మీద 20 నిమిషాల పాటు ఉడికించి దింపేయాలి ∙చిన్న బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక నెయ్యి లేదా నూనె వేసి కాగాక పోపు కోసం తీసుకున్న సరుకులను వేసి వేయించి, సిద్ధం చేసుకున్న బిసిబేళబాత్‌ మీద వేసి బాగా కలిపి, వేడివేడిగా అందించాలి. 

మరిన్ని వార్తలు