ఏడేళ్ల ప్రేమకు బ్రేకప్?

29 Sep, 2016 23:38 IST|Sakshi
ఏడేళ్ల ప్రేమకు బ్రేకప్?

అటు తమిళంలో, ఇటు తెలుగులో (డబ్బింగ్) వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న కథానాయకుడు విశాల్. నటుడు శరత్‌కుమార్ కుమార్తెగానే కాకుండా హీరోయిన్‌గానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వరలక్ష్మి. విశాల్, వరలక్ష్మి ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నారని గుసగుసలు వినిపించాయి. ‘‘తమిళ నడిగర్ సంఘం ఆధ్వర్యంలో కల్యాణ మండపం కడుతున్నాం. అది పూర్తి కాగానే అందులో జరిగే మొదటి పెళ్లి నాదే’ అని విశాల్ చెబుతూ వచ్చారు.

ఆయన పెళ్లాడనున్నది వరలక్ష్మీనే అని చాలామంది ఫిక్సయ్యారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో వరలక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమతో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. ‘‘ప్రేమ ఇటీవల పరిహాసంగా మారుతోంది. ఓ వ్యక్తి ఏడేళ్ల బంధాన్ని తేలిగ్గా వద్దనుకున్నాడు. అది కూడా తన మేనేజర్ ద్వారా ఆ అమ్మాయికి ఆ విషయం తెలియజేశాడు. ప్రపంచంలో ప్రేమ ఏమైపోతోందో? ఎక్కడుందో?’’ అంటూ ఆమె ఆవేదనగా ట్వీట్ చేశారు.

విశాల్‌ని ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. విశాల్‌ను వరలక్ష్మి ప్రేమించడం ఆమె తండ్రి శరత్‌కుమార్‌కి నచ్చలేదని, పెళ్లికి ఆయన సమ్మతం వ్యక్తం చేయలేదని ఓ టాక్ ఉంది. దానికి తోడు నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్, శరత్‌కుమార్ మధ్య మనస్పర్థలు వచ్చాయి కూడా. ఒకవేళ విశాల్-వరలక్ష్మి బ్రేకప్ వెనక శరత్‌కుమార్ హస్తం ఉండి ఉంటుందేమోనన్నది కొందరి ఊహ. ఇంతకీ వరలక్ష్మి ట్వీట్ వెనక ఆంతర్యం ఏంటో ఆ పెరుమాళ్లకే ఎరుక.

మరిన్ని వార్తలు