ఏ గగనమో కురులు జారి...

1 Oct, 2018 01:12 IST|Sakshi

పదం పలికింది – పాట నిలిచింది

తన సుందరిని వర్ణిస్తూ పాడుతున్నాడు రసికోత్తముడు. ‘రవివర్మకే అందని ఒకే ఒక అందానివో’. రవివర్మ కూడా కుంచెలోకి దించలేని రూపలావణ్యం! అందమైన అతిశయం. కవులు చేసేది అదేగా. అయితే ఈ పాటలో వేటూరి అసలైన కవిత్వం రెండో చరణంలో కనబడుతుంది.
‘ఏ గగనమో కురులు జారి నీలిమై పోయే
ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే’.
ఆకాశపు నలుపంతా ఆమె వెంట్రుకల్లోకి జారింది. ఉదయకాంతి ఆమె నుదుట చేరి కుంకుమగా మారింది. వినగానే ఆ రెండు భావచిత్రాలు కళ్లముందు మెదులుతాయి. ‘రావణుడే రాముడైతే’ చిత్రం కోసం ఇది వేటూరి సుందరరామ్మూర్తి రాసిన ‘రవివర్మకే అందని ఒకే ఒక అందానివో/ రవి చూడని పాడని నవ్యనాదానివో’ పాట అని మీకు అర్థమైపోయే ఉంటుంది. గీత రచయిత పేరు తెలియకపోతే గనక ఈ మార్కు సి.నారాయణరెడ్డిది అనిపిస్తుంది. ఈ పాట పాడినవారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్‌.జానకి. సంగీతం జి.కె.వెంకటేశ్‌ సమకూర్చారు. 1979లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు దాసరి నారాయణరావు. జయచిత్ర, అక్కినేని నాగేశ్వరరావు ఈ పాటలోని నటీనటులు.

మరిన్ని వార్తలు