ఏకదంతుడికి ఎన్ని ఉండ్రాళ్లో!

31 Aug, 2019 09:19 IST|Sakshi

అంత పెద్ద బొజ్జ! ఒకటే దంతం!! ‘అరిగింపు’ సరే.. ఆరగింపు ఎలా! ఏం పర్లేదు. గణపయ్యకు దంతపుష్టి ఉంది. మనకే.. భక్తిపుష్టి ఉండాలి. స్వామికి దండిగా పెట్టండి. స్వామిని సంతుష్టి పరచండి.అధినాయకా అందుకో..అష్టవిధ ఉండ్రాళ్లు ఇవిగో..

బెల్లంకుడుములు
కావలసినవి
బియ్యప్పిండి – ఒక కప్పు
నీళ్లు – ముప్పావు కప్పు
ఏలకుల పొడి – అర టీ స్పూను
బెల్లం తరుగు – ఒక కప్పు
నెయ్యి – ఒక టీ స్పూను
పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు

తయారీ
స్టౌ మీద బాణలిలో బెల్లం తరుగు, నీళ్లు వేసి బాగా కలుపుతూ బెల్లం కరిగించి దింపేయాలి ∙బియ్యప్పిండి వేస్తూ ఆపకుండా కలుపుతుండాలి               ∙ఏలకుల పొడి, కొబ్బరితురుము జత చేయాలి ∙అన్నీ బాగా కలపాలి (మిశ్రమం గట్టిగా ఉంటే ఉండ్రాళ్లు గట్టిగా వస్తాయి) నెయ్యి జత చేసి, కలియబెట్టి, చల్లారనివ్వాలి ∙కుకర్‌లో రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి ∙తయారు చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని ఉండలు చేసి, ఒక పాత్రలో ఉంచాలి ∙మరుగుతున్న నీళ్లలో ఈ పాత్ర ఉంచాలి ∙మూత పెట్టి, సుమారు పది నిమిషాల పాటు ఉడికించి దింపేయాలి ∙భగవంతుడికి నివేదన చేసి ఆరగించాలి.

జొన్నకుడుములు
కావలసినవి
జొన్నరవ్వ – ఒక కప్పు; పచ్చి సెనగ పప్పు – పావు కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; నీళ్లు – తగినన్ని; ఉప్పు – కొద్దిగా
తయారీ
స్టౌ మీద మందపాటి పాత్రలో నూనె కాగాక, జీలకర్ర వేసి వేయించాలి ∙కరివేపాకు వేసి మరోమారు వేయించాలి ∙నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి ∙మంట తగ్గించి, నీళ్లలో జొన్నరవ్వ వేస్తూ కలపాలి ∙మూత పెట్టి పదినిమిషాల తరవాత దింపేయాలి ∙చల్లారాక ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని కుడుములు తయారు చేయాలి ∙వినాయకుడికి నైవేద్యం పెట్టి, ప్రసాదంలా తినాలి.

ఫ్రైడ్‌మోదకాలు
కావలసినవి
గోధుమ పిండి – 2 కప్పులు; ఉప్పు – అర టీ స్పూను; గోరు వెచ్చని నూనె – 2 టీ స్పూన్లు; నీళ్లు – తగినన్ని

ఫిల్లింగ్‌ కోసం
బెల్లం తరుగు – ఒకటిన్నర కప్పులు; పచ్చి కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పులువేయించిన నువ్వులు – 2 టేబుల్‌ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నీళ్లు – ముప్పావు కప్పు

పైభాగం తయారీ
ఒక పాత్రలో గోధుమ పిండి, గోరు వెచ్చని నూనె, ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలిపి, సుమారు అరగంట సేపు పక్కన ఉంచాలి.

ఫిల్లింగ్‌ తయారీ
ఫిల్లింగ్‌ కోసం చెప్పిన పదార్థాలను ఒక మందపాటి పాత్రలో వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి ఉడికించి, దింపి పక్కన ఉంచాలి.

మోదకాల తయారీ
గోధుమపిండి మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని చపాతీ కర్రతో చపాతీలా ఒత్తి చేతిలోకి తీసుకోవాలి ∙ఫిల్లింగ్‌ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని, ఒత్తిన చపాతీ మధ్యలో ఉంచి, అన్ని పక్కలా కొద్దికొద్దిగా దగ్గరకు తీసుకుంటూ (బొమ్మలో చూపిన విధంగా) మూసేయాలి ∙ఈ విధంగా అన్నీ  తయారుచేసి పక్కన ఉంచుకోవాలి ∙బాణలిలో నూనె పోసి స్టౌ మీద ఉంచి, కాగిన తరవాత, తయారుచేసి ఉంచుకున్న మోదకాలను నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి కిచెన్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.

పల్లీమోదకాలు
కావలసినవి

పల్లీలు – ఒక కప్పు; బెల్లం తరుగు – ముప్పావు కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నీళ్లు – 4 టేబుల్‌ స్పూన్లు; కొబ్బరి తురుము – పావు కప్పు

పైభాగం కోసం
బియ్యప్పిండి – ఒకటిన్నర కప్పులు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; పిండి కలపడం కోసం నీళ్లు – 3 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – చిటికెడు; నెయ్యి – ఒక టీ స్పూను.

తయారీ
∙స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా పల్లీలను వేయించాలి                ∙చల్లారాక పొట్టు తీసేయాలి ∙మిక్సీలో వేసి కొద్దిగా రవ్వలా ఉండేలా మిక్సీ పట్టాలి ∙బెల్లం తరుగు, ఏలకుల పొడి జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి.

పైభాగం తయారీ
∙స్టౌ మీద బాణలిలో నీళ్లు పోసి మరిగించాలి ∙ఒక టీ స్పూను నెయ్యి, చిటికెడు ఉప్పు జత చేయాలి ∙బియ్యప్పిండి జత చేసి, స్టౌ ఆర్పేయాలి ∙కిందకు దింపి గరిటెతో బాగా కలపాలి ∙కొద్దికొద్దిగా పిండి చేతిలోకి తీసుకుని, చెయ్యి తడి చేసుకుంటూ చిన్న పూరీలా ఒత్తాలి ∙పల్లీ మిశ్రమాన్ని చిన్న ఉండలా చేసుకుని, మధ్యలో ఉంచి అంచులు మూసేయాలి ∙మోదకాల మౌల్డ్‌లో ఉంచి కొద్దిగా ఒత్తి, జాగ్రత్తగా బయటకు తీయాలి ∙ కుకర్‌లో రెండు కప్పుల నీళ్లు పోసి, తయారుచేసి ఉంచుకున్న మోదకాలను ఇడ్లీ రేకులలో ఉంచి, ఇడ్లీ స్టాండును కుకర్‌లో ఉంచి మూత పెట్టాలి (విజిల్‌ పెట్టకూడదు) ∙స్టౌ మీద ఉంచి పావు గంట తరవాత దింపేయాలి.

మలై మోదక్‌
కావలసినవి: పాలు – రెండు లీటర్లు; పంచదార – అర కప్పు; నిమ్మ రసం – 2 టేబుల్‌ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; డ్రై ఫ్రూట్స్‌ – అలంకరించడానికి తగినన్ని; కుంకుమ పువ్వు – చిటికెడు.
తయారీ: పాలను స్టౌ మీద ఉంచి మీగడ కట్టే వరకు కాచాలి ∙మీగడను పక్కను జరిపి మరోసారి కాచిన తరవాత, రెండు కప్పుల పాలను విడిగా గిన్నెలోకి తీసి పక్కన ఉంచాలి ∙నిమ్మ రసం జత చేయగానే పాలు విరుగుతాయి ∙విరిగిన పాలను పల్చటి వస్త్రంలో వేసి నీళ్లు పోస్తూ బాగా కడిగి వడకట్టాలి ∙పక్కన ఉంచిన రెండు కప్పుల పాలలో పంచదార వేసి స్టౌ మీద ఉంచి, పాలు సగం అయ్యేవరకు మరిగించాలి ∙వడకట్టిన పనీర్‌ జత చేసి బాగా కలపాలి ∙మిశ్రమం బాగా చిక్కబడ్డాక ఏలకుల పొడి జత చేసి కలిపి దింపి చల్లారబెట్టాలి ∙మోదక్‌ మౌల్డ్స్‌కి నెయ్యి పూసి, అందులో తగినంత మిశ్రమం స్టఫ్‌ చేయాలి (విరగకూడదు) ∙గట్టిగా ప్రెస్‌ చేసి, మౌల్డ్‌ మూత తీసి మోదకాలను బయటకు తీయాలి (చేతితో కూడా గుండ్రంగా చేసుకోవచ్చు)

రాగి మోదక్‌
కావలసినవి: రాగి పిండి – ఒక కప్పు; బెల్లం తరుగు – 4 టేబుల్‌ స్పూన్లు; నీళ్లు – 4 టేబుల్‌ స్పూన్లు; కప్పు – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; నెయ్యి – 3 టేబుల్‌ స్పూన్లు; స్టఫింగ్‌ కోసం.. కొబ్బరి తురుము – ఒక కప్పు; వేయించిన నువ్వులు – 2 టేబుల్‌ స్పూన్లు; బెల్లం తరుగు – పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను.
తయారీ: ఒక పాత్రలో బెల్లానికి కొద్దిగా నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి, బెల్లం కరిగేవరకు కలిపి పక్కన ఉంచాలి ∙ఒక బాణలిలో రెండు టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి ∙రాగి పిండి వేసి దోరగా అయ్యేవరకు కలుపుతూ, మూడు నాలుగు నిమిషాల పాటు వేయించి దింపేయాలి ∙పాలు, నీళ్లు పోసి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుతుండాలి ∙ఏలకుల పొడి జత చేసి, మరోమారు స్టౌ మీద ఉంచి, నీరంతా ఇంకిపోయేవరకు ఉడికించాలి ∙పిండి బాగా ఉడికిన తరవాత ఒక టేబుల్‌ స్పూను నెయ్యి వేసి, అంచులు విడేవరకు ఉడికించి దింపేయాలి ∙గోరు వెచ్చగా ఉన్నప్పుడే మెత్తగా చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో బెల్లం, తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి, బెల్లం కరిగేవరకు కలిపి, మూత పెట్టి, మంట ఆర్పేయాలి ∙కరిగించిన బెల్లాన్ని వడ కట్టాలి ∙కొబ్బరి తురుము, ఏలకుల పొడి జత చేసి స్టౌ మీద ఉంచాలి ∙పాకం కొద్దిగా దగ్గర పడుతుండగా నువ్వులు వేసి కలిపి, దింపి పక్కన ఉంచాలి ∙చేతికి కొద్దిగా నెయ్యి పూసి, రాగి పిండిని కొద్దికొద్దిగా తీసుకుని చేతితో వెడల్పుగా ఒత్తాలి ∙కొబ్బరి మిశ్రమాన్ని చిన్న ఉండలా చేసి ఇందులో ఉంచి అంచులు మూసేయాలి ∙ఇలా అన్నిటినీ తయారుచేసుకోవాలి ∙వీటిని ఇడ్లీ రేకులలో ఉంచాలి ∙కుకర్‌లో కొద్దిగా నీళ్లు పోసి, ఇడ్లీ రేకులను అందులో ఉంచి మూత పెట్టి, స్టౌ మీద ఉంచాలి (విజిల్‌ పెట్టకూడదు) ∙పది నిమిషాల తరవాత దింపేసి, గణనాయకునికి సమర్పించి ప్రసాదం స్వీకరించాలి.

 డ్రై ఫ్రూట్స్‌ మోదక్‌
కావలసినవి: అంజీర్‌ – 6; గింజలు లేని ఖర్జూరాలు – 8; బాదం పప్పులు – 15; వాల్నట్స్‌ – ఒక టీ స్పూను; పల్లీలు – రెండు టేబుల్‌ స్పూన్లు; పిస్తా పప్పులు – 10; జీడి పప్పులు – 10; నువ్వులు – ఒక టీ స్పూను; చిరోంజీ – ఒక టీ స్పూను; గసగసాలు – ఒక టీ స్పూను; కొబ్బరి తురుము – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను; కిస్‌మిస్‌ – 10; ఏలకుల పొడి – అర టీ స్పూను
తయారీ: అంజీర్, ఖర్జూరాలను విడివిడిగా రెండు గంటలసేపు నానబెట్టాలి ∙బాదం పప్పులు, పల్లీలు, వాల్నట్స్, పిస్తాలు, జీడిపప్పులను మిక్సీలో వేసి పొడి చేయాలి (మరీ మెత్తగా చేయకూడదు) ∙స్టౌ మీద బాణలిలో ఈ పొడి వేసి కలియబెట్టాలి ∙మరొక బాణలిలో నువ్వులు, చిరోంజీ, గసగసాలు వేసి దోరగా వేయించాలి ∙నానబెట్టిన అక్రోట్, ఖర్జూరాలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక మెత్తగా చేసిన ఖర్జూరాల మిశ్రమం వేసి కలపాలి ∙సన్నగా తరిగిన కిస్‌మిస్, ఆప్రికాట్స్‌లను జత చేసి మరోమారు కలపాలి ∙మిక్సీ పట్టిన డ్రై ఫ్రూట్స్‌ను జత చేసి మరోమారు కలపాలి ∙కొబ్బరి తురుము, ఏలకుల పొడి జత చేసి మరోమారు బాగా కలపాలి ∙మోదక్‌ మౌల్డ్స్‌లో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని ఉంచాలి ∙మౌల్డ్‌ నొక్కి, మళ్లీ మూత తీసి, మోదకాలను జాగ్రత్తగా బయటకు తీసి పళ్లెంలో ఉంచి, వినాయకుడిని నివేదన చేసి, ప్రసాదంగా స్వీకరించాలి.

బియ్యపు రవ్వ ఉండ్రాళ్లు
కావలసినవి: బియ్యపు రవ్వ – ఒక కప్పు; పచ్చి సెనగ పప్పు – పావు కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – కొద్దిగా; పచ్చి కొబ్బరి తురుము – ఒక టేబుల్‌ స్పూను; కరివేపాకు – ఒక రెమ్మ
తయారీ: స్టౌ మీద మందపాటి పాత్ర ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙జీలకర్ర వేసి వేగాక, కరివేపాకు వేసి వేయించాలి ∙తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి బాగా కలపాలి ∙పచ్చి సెనగ పప్పు జత చేసి కలిపి నీళ్లు మరిగించాలి ∙మంట తగ్గించి, బియ్యం రవ్వ కొద్దికొద్దిగా వేస్తూ ఉండకట్టకుండా కలుపుతుండాలి ∙మూత ఉంచి పది నిమిషాలయ్యాక దింపేయాలి ∙ చల్లారిన తరవాత ఈ పిండిని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుంటూ, ఉండ్రాళ్లు తయారుచేసుకోవాలి ∙వినాయకుడి పూజ చేసి, ఉండ్రాళ్లను బొజ్జ గణపయ్యకు నివేదించి, ప్రసాదంగా తినాలి.

మరిన్ని వార్తలు