సత్గ్రంథం
సాహిత్యమన్నా, కృష్ణదేవరాయలన్నా ప్రాణం పెట్టే మోదుగుల రవికృష్ణ తెలుగు సాహితీ చరిత్రపై లోతైన పరిశోధన చేసి, కొన్ని చక్కటి వ్యాసాలు రాశారు. వాటికే అందమైన పుస్తకరూపమిచ్చారు. పద్నాలుగు వ్యాసాలున్న ఈ చిన్నిపొత్తంలో సంగీత సద్గురు త్యాగరాజస్వామివారిపైన, నిఘంటు రచయిత బహుజనపల్లి సీతారామాచార్యులుపైన, సూర్యరాయాంధ్ర నిఘంటువుపైన, జానపద వాఞ్మయంపైనా చక్కటి పరిశోధన కనిపిస్తుంది. ‘బొబ్బిలియుద్ధం’ వ్యాసం చదువుతుంటే ఆ చారిత్రాత్మక ఘటన కళ్లముందు బొమ్మకడుతుంది. అన్నింటికీ మించి ‘విఠ్ఠలకీర్తనలు అన్నమయ్యవా?’ అంటూ పెట్టిన టైటిల్ని చూసి ముచ్చటేస్తుంది. రచయిత ప్రచురణకర్తగా మారి, తాను కొన్ని పుస్తకాలకు రాసిన ముందుమాటలను కూడా ‘మనవి మాటలు’ పేరుతో పుస్తకంగా మలిచారు. నేటితరానికి అందుబాటులో లేని కొన్ని మంచి గ్రంథాలను పునర్ముద్రించాలన్న తన లక్ష్యసాధనను త్వరలోనే చేరుకుంటారని ఆశిద్దాం.
విఠ్ఠల కీర్తనలు అన్నమయ్యవా? పుటలు:128; వెల రూ. 80; మనవి మాటలు, పుటలు:149; వెల రూ. 80; రచయిత ఫోన్: 9440320580
- డి.వి.ఆర్.