జాబిల్లిపై మరింత నీరు!

25 Jul, 2019 09:11 IST|Sakshi

చందమామపై నీటి ఉనికి, విస్తృతిని గుర్తించేందుకు చంద్రయాన్‌ –2 మూడ్రోజుల క్రితమే నింగికి ఎగిసిన విషయం మనకు తెలిసిందే. ఈలోపుగానే కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు మన సహజ ఉపగ్రహంపై ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలోనే నీరు ఉన్నట్లు ప్రకటించేశారు. నేచర్‌ జియోసైన్సెస్‌ తాజా సంచికలో ప్రచురితమైన వివరాల ప్రకారం.. మంచుతో కూడిన బుధ గ్రహానికి, జాబిల్లిలో నిత్యం నీడలో ఉండే ప్రాంతానికి మధ్య ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. దీనర్థం బుధుడి మాదిరిగానే ఈ ప్రాంతంలోనూ ఉపరితల జలం ఉండే అవకాశం ఉందన్నమాట. బుధ గ్రహపు ధ్రువ ప్రాంతాల్లోనూ భూమి నీడ పడే కొన్ని ప్రాంతాలు ఉన్నాయని.. 2009లో ఈ ప్రాంతంలోకి ప్రయోగించిన శోధక నౌక నీరు, మంచు ఆవిరి ఉన్నట్లు నిర్ధారించిందని ఇప్పటికే జరిగిన కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. నీడలో ఉన్న భారీ గుంతల్లో (క్రేటర్స్‌) మీటర్ల మందంలో మంచు ఉన్నట్లు... నీడ కారణంగా ఆ నీరు సూర్యరశ్మికి ఆవిరైపోకుండా ఉన్నట్లు తెలుస్తోంది. జాబిల్లిపై కూడా అచ్చం బుధ గ్రహ పరిస్థితులను పోలినవి ఉండవచ్చునన్న అంచనాతో తాము పరిశోధనలు మొదలుపెట్టామని జాహ్నవి వెంకటరామన్‌ తెలిపారు. ఉష్ణగ్రతలు, నీడల్లో ఉండే క్రేటర్స్‌ వివరాలన్నింటినీ పరిశీలిస్తే మునుపు వేసిన అంచనాల కంటే ఎక్కువ మొత్తంలో చందమామపై నీరు ఉన్నట్లు తెలుస్తోందని తెలిపారు.

మరిన్ని వార్తలు