రొమ్ము క్యాన్సర్ ముప్పును కనుగొనేందుకు మామోగ్రామ్ ఏ వయసు నుంచి చేయించాలనే అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయి. దీన్ని 40వ పడి నుంచే చేయించాలంటూ కొంతమంది మంది డాక్టర్లు సలహా ఇస్తుండగా, మరికొంతమంది 50 తర్వాత నుంచి చేయించవచ్చని చెబుతుంటారు. ఈ విషయాన్ని నిర్ధారణ చేసేందుకు అమెరికాలోని ఓరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ దాదాపు 66 అధ్యయనాలను నిర్వహించింది. రెండు రకాల రిస్క్లు ఉన్న మహిళల్లో దీన్ని నలభై దాటినప్పటి నుంచే ఈ పరీక్షను రొటీన్గా తరచూ చేయించడం మంచిదని ఆ అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
ఆ రిస్క్లు ఏమిటంటే...
♦ తమకు సమీప బంధువుల్లో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న కుటుంబ చరిత్ర ఉండటం. ముందుగా చేయించిన మామోగ్రామ్లో బ్రెస్ట్ టిష్యూ చాలా మందంగా ఉన్నదనే ఫలితం వచ్చి ఉండటం.
♦ దూరపు బంధువుల్లోనూ రొమ్ము బయాప్సీలో హానికరంకాని (బినైన్) గడ్డలు ఉన్నట్లు తేలినా లేదా అలాంటి బయాప్సీ పరీక్షలో రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు తేలినా.
♦ అంతకు ముందు గర్భనిరోధక మాత్రలు (పిల్స్) వాడే అలవాటు ఉండటం లేదా పిల్లలు లేకపోవడం లేదా 30 ఏళ్ల తర్వాతే తొలిచూలు గర్భం రావడం లాంటి కేసుల్లో రొమ్ము టిష్యూ మందం మరీ ఎక్కువగా లేకుండా ఒక మోస్తరుగా ఉన్నా 40 ఏళ్ల నుంచే మామోగ్రామ్ పరీక్షలు చేయిస్తుండటం మంచిదని ఆ అధ్యయనాలు చెబుతున్నాయి.