సోమవారానికి ఎందుకంత ప్రాధాన్యత?

18 Nov, 2018 01:16 IST|Sakshi

కార్తికంలో సోమవారానికి ఎనలేని ప్రాధాన్యత ఎందుకంటే, సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రంమీద ఉండటం చేత సోమవారాలకు విశిష్టత కలిగింది.

సోమ అంటే చంద్రుడు. శివుని సిగలో వెలిగే చంద్రుని వారం గనుకే సోమవార ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత. అదీగాక సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే భక్తులు ఈ మాసంలో సోమవారాలలో భక్తిశ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తారు. సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించడం వల్ల సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో, ఆనందోత్సాహాలతో వర్థిల్లుతారని విశ్వాసం.

వనసమారాధన కార్తీకమాసంలోనే ఎందుకు?
గడపదాటి వెళ్లనివారు సైతం కార్తీక మాసంలో వన సమారాధనలో పాల్గొంటారు. తక్కిన ఏ మాసమూ కూడా వనభోజనాలకు అనుకూలం కాదు. వసంత రుతువు కొంత అనుకూలమే అయినా, వడగాలులు, ఉక్కపోతా ఉంటాయి కాబట్టి అంత బాగుండదు. ఇక గ్రీష్మరుతువులో ఎండలు మెండు. ఆ తర్వాత వర్ష రుతువులో ఎప్పుడు వాన వస్తుందో తెలియని ఇబ్బంది...తర్వాత వచ్చే శరదృతువులో అందులోనూ కార్తీక మాసంలో చలి మెల మెల్లగా పాకుతూ నెల చివరికి బాగా చలిగా ఉండేలా మారుతుంది కాబట్టీ, సాయంత్రం అయ్యేసరికి చిరుచలిగాలులు వీచి ఈ రోజుకి వనభోజనాలు ముగిసాయని ఆ నాటికి కాలమే హెచ్చరిక చేస్తూంటుంది కాబట్టీ, చిరుచలీ దానితోపాటు వేడిమీ పగలంతా ఉపవాసం కాబట్టీ ఈ చలి వేడిముల వాతావరణంలో భోజనాలు – అదీ సామూహికంగా – ఎంత బాగుంటాయి.

తలచుకున్నప్పుడల్లా సంతోష పరిమళాలని వెదజల్లుతూ ఉంటాయి. ఇక తర్వాత వచ్చే హేమంత రుతువులో మంచు ఎక్కువగా కురుస్తుంది. ఆ తర్వాత శిశిర రుతువులో చెట్లన్నీ బోడిగా ఉంటాయి. నీడ అనేది దొరకని కాలం కాబట్టి అనేక అనుకూలతలు ఉన్న కార్తీకమాసంలోనే  వన భోజనాలు జరుగుతాయి. ఒట్టిగా తిని పోవడానికి మాత్రమే కాకుండా, భగవంతుని పేరిట అభిషేకాన్ని చేసుకుని – లేదా – ఓ వ్రతాన్ని చేసుకుని, అన్నాన్ని భగవత్ప్రసాదంలా స్వీకరించగలిగే అవకాశముండేది ఈ మాసంలో మాత్రమే.వనసమారాధనలో ఉసిరి చెట్టునీడన సాలగ్రామరూపంలో శ్రీహరిని పూజించి శక్తి కొలది అన్నసమారాధన చేసిన వారిని యముడు కన్నెత్తి కూడా చూడలేడని, సకల పాపాలు తొలగిపోయి విష్ణుసాయుజ్యం పొందుతారనీ కార్తీక పురాణం బోధిస్తోంది.

మరిన్ని వార్తలు