మందులతో ఎత్తు పెరగవచ్చా?

15 Oct, 2015 00:17 IST|Sakshi

ఆయుర్వేద కౌన్సెలింగ్
 

ఆలోస్ అనే మొక్క నుంచి తయారు చేసిన ఎన్నో రకాల మందులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి కలబంద మొక్కకు సంబంధించినవేనా? ఆయుర్వేదంలో దీని వివరాలు ఉన్నాయా?
 - పేరి విజయలక్ష్మి, విశాఖపట్నం

ఇంగ్లిష్‌లో ‘అలోవెరా’ అనే జాతికి చెందిన ఈ కలబంద మొక్కకు సంబంధించిన ఎన్నో ఔషధగుణాలను, ప్రయోగాలను ఆయుర్వేదం వివరించింది. దీనికి సంస్కృతంలో అనేక పర్యాయ పదాలున్నాయి. ఉదా: కుమారి, గృహకన్యా, దీర్ఘపత్రికా, తరుణీ, అమరా, అజరా మొదలైనవి. కలబంద గురించి భావిమిశ్రుడు చెప్పిన శ్లోకం ‘‘... కుమారీ భేదనీ శీతా తిక్తానేత్య్రా రసాయనీ, మధురా బృంహాణీ... గుల్మప్లీహ యకృత్‌వృద్ధి, కఫజ్వరా హరీ హరేత్... బల్యా వృష్యావాత విషహరీ...’’

కలబందకు దళసరిగా ఉండే పొడవైన మట్టలుంటాయి. వీటి చుట్టూ ముళ్లుంటాయి. ఆకు లోపల నెయ్యిలాంటి జిగురు పదార్థముంటుంది. ఈ రసంతోనే ముసాంబరాన్ని తయారు చేస్తారు. దీని గుజ్జు తిక్తమధురరసయుక్తంగా (చేదు, తీపి సమ్మేళనంగా) ఉంటుంది.
 ఔషధ గుణాలు : దీని రసాన్ని చర్మంపై పూస్తే చాలా రకాల చర్మరోగాలు తగ్గిపోతాయి. కొంచెం వెన్నతో కలిపిరాస్తే, ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలు తొలగిపోతాయి. చర్మకాంతి పెంపొంది ముఖసౌందర్యం శోభిస్తుంది. ఆ ఆకులను వేడిచేసి, రసం తీసి కాలిన వ్రణాలపై లేపనం చేస్తే నొప్పి తగ్గి, త్వరగా మానిపోతాయి. దెబ్బలు తగిలిన ప్రదేశంలో ఈ గుజ్జును ఉడికించి కడితే సెగ్గడ్డలు తగ్గుతాయి. ఈ గుజ్జును లేదా కలబంద వేరును నూరి పసుపుతో కలిపి పూస్తే మహిళల్లో రొమ్మువాపు తగ్గుతుంది. పన్నునొప్పితో పాటు దంతరోగాలూ తగ్గుతాయి. ఈ రసాన్ని గోరువెచ్చగా చేసి ఒకటి, రెండు చుక్కలు వేస్తే చెవిపోటు తగ్గుతుంది.

కడుపులోకి సేవిస్తే (మోతాదు పెద్దలకు నాలుగు చెంచాలు అంటే 20 మిల్లీలీటర్లు) కడుపుబ్బరం, మలబద్దకం, లివరు, స్ప్లీన్ వ్యాధులు, అర్శవ్యాధులు (పైల్స్), నులిపురుగులు తగ్గుతాయి. ఈ రసాన్ని చక్కెర, పాలతో కలిపి సేవిస్తే ధాతుపుష్టి, బలం కలిగి, ఆరోగ్యం బాగుపడుతుంది. శొంఠిపొడితో కలిపి సేవిస్తే ఎక్కిళ్లు, మిరియాలపొడి, తేనెతో కలిపి సేవిస్తే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. అధికబరువు, కీళ్లనొప్పులు, రుతుశూల (ముట్టునొప్పి), వడదెబ్బ వంటి వికారాలలో చక్కని గుణం కనిపిస్తుంది.  కలబంద గుజ్జులో ఉప్పు వేసి ముద్దగా నూరి కట్టుకడితే కుక్కకాటుకు విరుగుడుగా పనికొస్తుంది.  ఇది శరీరానికి చలవ చేస్తుంది. చాలారకాల జ్వరాలను తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని తగ్గిస్తుంది.  దీని గుజ్జులో మెంతులపొడి కలిపి శిరోజాలకు పట్టించి, రాత్రంతా ఉంచి, మర్నాడు తలస్నానం చేస్తే... చుండ్రు, పేలు పోవడమే కాకుండా, శిరోజాలు దృఢంగా ఉండి, మృదువుగా నిగనిగలాడతాయి.
 
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్

 నా వయసు 21 ఏళ్లు. ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్నాను. నా ఎత్తు ఐదడుగుల మూడు అంగుళాలు మాత్రమే. నేను ఎత్తు పెరగడం లేదు. ఫ్రెండ్స్ మధ్యన పొట్టిగా కనిపిస్తున్నాను. దాంతో ఎంతో ఆత్మన్యూనతకు గురవుతున్నాను. నేను ఎలాగైనా పొడువు పెరగాలని అనుకుంటున్నాను. ఎత్తు పెంచే అడ్వర్టైజ్‌మెంట్లు చూస్తున్నాను. ఆ ప్రకటనల్లో చూపించే మందులు వాడటం వల్ల ఎత్తు పెరుగుతానా? నాకు దయచేసి తగిన సలహా ఇవ్వండి.
 - హుసేన్, కరీంనగర్

 మీ వయసులో ఉన్న వారి ఫీలింగ్స్ అలాగే ఉంటాయి. ఐదడుగుల మూడు అంగుళాలంటే మీరు తగినంత ఎత్తు పెరిగినట్లే లెక్క. మీకంటే చాలమంది పొట్టిగా ఉంటారు. తల్లిదండ్రుల నుంచి పొడవునకు సంబంధించిన జన్యువులు వస్తాయి. అయినప్పటికీ ఇందుకు ఎవరూ బాధ్యులు కాదు. ఎందుకంటే ఒక్కోసారి తల్లిదండ్రుల ఎత్తు కాకుండా తాతముత్తాతల ఎత్తు కూడా పిల్లలకు రావచ్చు. అప్పుడు తల్లిదండ్రులు మామూలు ఎత్తులో ఉన్నా తాతముత్తాతల పొట్టిదనమూ పిల్లలకు రావచ్చు. ఇక దాంతోపాటు తినే ఆహారంలోని పోషకాలూ పిల్లల ఎత్తు పెరగడానికి దోహదం చేసే విషయం వాస్తవమే. అయితే ఎముకల చివర్లలో ఉండే గ్రోత్ ప్లేట్లలో పొడుగు పెరిగే అంశం వాళ్ల పదహారేళ్ల నుంచి పద్ధెనిమిదేళ్ల వయసులో ఆగిపోతుంది.

మీరు ఇప్పటికే పద్ధెనిమిదేళ్లు దాటిపోయారు కాబట్టి దీని గురించి ఆలోచించకండి. అయితే కాళ్ల పొడువు పెంచే సర్జికల్ టెక్నిక్ అందుబాటులో ఉంది. దాన్ని ‘డిస్ట్రాక్షన్ ఆస్టియోజెనెసిస్’ అంటారు. ఇందులో ‘ఇలిజరోవ్ ఫిక్సేటర్స్’ అనే కొన్ని కృత్రిమ ఉపకరణాలను కాలిలో అమర్చుతారు. కానీ అలా పెంచే పొడవుతో కీళ్లనొప్పులూ, కండరం పటిష్టంగా లేకపోవడం, నరాలు దెబ్బతినడం వంటి అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. పైగా ఇలా శస్త్రచికిత్సతో ఎత్తుపెంచడం అన్నది ఒక కాలి కంటే మరో కాలు పొట్టిగా ఉన్నప్పుడు ఆ రెండింటినీ సమంగా చేయడం కోసం మాత్రమే  చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎత్తు గురించి ఆందోళన పడకండి. ప్రకటనల్లో వచ్చేవన్నీ వాణిజ్యపరమైన ఉత్పాదనలే. వాటితో వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఎత్తూ పెరగదు.  ప్రకృతిపరంగా మీరు ఇప్పుడున్న ఎత్తు భారతీయ ప్రమాణాల  ప్రకారం మంచి హైటే. ఇప్పుడు మీరు మంచి కెరియర్ గురించి ఆలోచించండి. వాణిజ్య ప్రకటనలు చూసి మోసపోకండి.
 
న్యూరాలజీ కౌన్సెలింగ్

 
 నా వయసు 45 ఏళ్లు. నాకు పది రోజుల క్రితం నడుము మీద ఒక పక్క కురుపులు వచ్చాయి. తీవ్రమైన నొప్పి వచ్చింది. పది రోజుల తర్వాత అవి మాడిపోయాయి. అయితే ఇప్పుడు లోపలి నుంచి భరించలేనింత నొప్పి వస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.
 - మనోహర్‌రావు, ఆదిలాబాద్

 మీరు పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అనే సమస్యతో బాధపడుతున్నారు. ఇది వారిసెల్లా జోస్టర్ అనే వైరస్ వల్ల వస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారిలోనూ,  రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో ఇది రావచ్చు. అప్పుడు కొన్ని యాంటీవైరల్ మందులు వాడటం వల్ల కురుపులు తగ్గిపోతాయి. అయితే మందు వాడని వారిలో కురుపులు మానిపోయాక ఇలా భరించలేని నొప్పులు వస్తాయి. అయితే ఆందోళన పడాల్సిందేమీ ఉండదు. రెండు, మూడు రకాల మందులతో నొప్పిని నియంత్రించవచ్చు. మీరు వెంటనే డాక్టర్‌కు చూపించుకొని, మీ వయసును బట్టి, బరువును బట్టి తగిన మోతాదులో మందులు వాడటం వల్ల మీ నొప్పి తగ్గుతుంది.
 
 నా వయసు 30. నాకు ఐదేళ్ల క్రితం ఒక యాక్సిడెంట్‌లో తలకు దెబ్బతగిలింది. అప్పుడు మెదడు స్కానింగ్ చేయిస్తే, ఎముక ప్రాక్చర్ అయినట్లుగా తెలిసింది. మెదడులో రక్తస్రావం కూడా అయింది. అప్పట్నుంచి ఏడాదికొకసారి ఫిట్స్ వస్తున్నాయి. నా సమస్య తగ్గే మార్గం చెప్పండి.
 - కిశోర్, ఇల్లందు

 మెదడుకు దెబ్బతగిలిన వారిలో, రక్తస్రావం వల్ల, ఎముక ఫ్రాక్చర్ కావడం వల్ల మెదడులోని కణాలలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. దాంతో ఆ కణాల నుంచి అవసరమైన దానికంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి కావడంతో ఫిట్స్ వస్తాయి. ఇలాంటి పరిణామం చోటు చేసుకున్నప్పుడు చాలా సందర్భాలలో వారికి జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి దెబ్బతగిలినప్పుడు, స్కానింగ్ చేయించినా ఆ రిపోర్టు నార్మల్‌గా ఉంటుంది. అలాంటివాళ్లలో కొన్ని నెలల పాటు మందులు వాడితే సరిపోతుంది. మీరు న్యూరాలజిస్ట్‌కు చూపించుకొని, తగిన స్కానింగ్ చేయించుకోండి. ఆ రిపోర్టును బట్టి మందులు వాడాల్సి ఉంటుంది.
 
 

మరిన్ని వార్తలు