♦ ఒలింపిక్స్లో మూడుసార్లు చాంపియన్ అయిన ఆస్ట్రేలియన్ స్విమ్మింగ్ క్రీడాకారిణి స్టెఫనీ రైస్.. ఇండియాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక స్పోర్ట్స్ ఈవెంట్కు వ్యాఖ్యానం ఇచ్చేందుకు ప్రస్తుతం భువనేశ్వర్లో ఉన్న స్టెఫనీ తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టులో ఇండియాపై తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు.
కొంతకాలం క్రితం భారత్లో లైంగిక వేధింపుల ఘటనలను సోషల్ మీడియాలో కథలు కథలుగా చదివిన స్టెఫనీ, ఇప్పుడు కొనసాగుతున్న ‘మీ టూ’ ఉద్యమం భారతీయ స్త్రీలపై తన గౌరవభావాన్ని మరింత పెంచిందని అన్నారు. స్టెఫనీ గతంలో ఒకసారి చీర కట్టుకుని ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో అప్లోడ్ భారతీయతపై తన అభిమానాన్ని చాటుకున్నారు.
♦ లైంగిక వేధింపులపై ఇస్తున్న ఫిర్యాదుల విషయంలో ప్రతి రెండు గంటలకు ఒక మహిళ పోలీసుల అధికారుల అనాసక్తతకు గురవుతోందని ‘నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్’ నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. మహిళలు నేడు ‘మీ టూ’ ఉద్యమం స్ఫూర్తితో ధైర్యంగా బయటికి వచ్చి తమపై జరిగిన లైంగిక వేధింపులను చెప్పుకోగలుగుతున్నప్పటికీ, న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్నప్పుడు వారికి ఎదురవుతున్న నిర్లక్ష్యం, ఉదాసీనతల విషయంలో నేటికీ మార్పు రాలేదని కమిషన్ తన సర్వే నివేదికలో పేర్కొంది.