స్త్రీలోక సంచారం

5 Jul, 2018 00:12 IST|Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

జీటీవీలో ప్రసారం అవుతున్న రియాల్టీ షో ‘ఇండియాస్‌ బెస్ట్‌ డ్రామేబాజ్‌’ జడ్జీలలో ఒకరైన సోనాలీ బెంద్రే.. వ్యక్తిగత కారణాల వల్ల షో నుంచి తప్పుకుంటున్నందున ఆమె స్థానంలోకి హ్యూమా ఖురేషీని తీసుకుంటున్నట్లు జీనెట్‌వర్క్‌ ప్రకటించిన కొద్ది గంటల్లోనే సోనాలీ బెంద్రే న్యూయార్క్‌లో క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుంటున్నారన్న వార్త బాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. స్వయంగా బెంద్రేనే తన హైగ్రేడ్‌ క్యాన్సర్‌ గురించి బహిర్గతం చేస్తూ, ఎంతో ఎమోషనల్‌గా ట్విట్టర్‌లో పెట్టిన పోస్టింగ్‌ ఆమె అభిమానుల్ని కలవరపరిచింది ::: ఒకప్పుడు ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ ‘హయ్యస్ట్‌ పెయిడ్‌ మోడల్స్‌’ జాబితాలో స్థానం సంపాదించుకున్న పోర్టోరికో మోడల్‌ జోన్‌ స్మాల్‌ ప్రస్తుతం వర్ణ వివక్షకు గురవుతున్నారు! తన ఒంటి చాయ మరీ అంత ‘మిల్కీ’గా లేకపోవడంతో హాలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా తనకు అవకాశాలను నిరాకరిస్తోందని, అయితే తన చుట్టూ ఉన్న కొంతమంది సంస్కారవంతులైన సృజనశీలురకు నిజమైన అందం అంటే ఏమిటో తెలుసు కనుక, ఒంటి రంగు గురించి తను అసలేమీ బాధపడటం లేదని జోన్‌ తాజా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

లైంగిక దాడికి గురయిన చిన్నారుల నుంచి వివరాలను రాబట్టడం అతి సున్నితమైన, క్లిష్టమైన బాధ్యత అని ‘షీటీమ్స్‌’ ఏసీపీ డి. కవిత అన్నారు. ‘ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌ యాక్ట్‌’ (పోక్సో) కింద చిన్నారి బాధితుల నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకోడానికి వారికి ఏ విధంగానూ మానసిక ఒత్తిడి కలగని విధంగా బొమ్మను చూపించి.. ఏం జరిగిందీ, ఎలా జరిగిందీ.. వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తామని చెబుతూ, షీటీమ్స్‌కు ఇంతవరకు అందిన వాటిలో 24 నెలల అతి చిన్న వయస్కురాలైన బాధితురాలి తరఫున నమోదైన ఫిర్యాదు కూడా ఉందని తెలిపారు ::: హైదరాబాద్‌లోని నిజామ్‌ కాలేజీలో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో కొత్త గర్ల్స్‌ హాస్టల్‌ను నిర్మించడానికి పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. గతంలో ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు నిజాం కాలేజీకి వచ్చినప్పుడు గర్ల్స్‌ హాస్టల్‌ నిర్మిస్తామని తను మాట ఇచ్చినట్లు గుర్తుచేస్తూ, ఇప్పుడా మాటకు కట్టుబడి నిర్మాణాన్ని ప్రారంభించడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని కె.టి.ఆర్‌. ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టారు ::: కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేదిపై, ఆమె పదేళ్ల కూతుర్ని ఉద్దేశించి ట్విట్టర్‌లో కామెంట్‌ పెట్టిన వారిని వెంటనే గుర్తించి ‘పోక్సో’ చట్టం కింద చర్య తీసుకోవాలని కేంద్ర హోంశాఖ నుంచి ఢిల్లీ, ముంబై పోలీసులకు ఆదేశాలు అందాయి.

ఇటీవల మధ్యప్రదేశ్‌లోని మంద్సార్‌లో ఏడేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారంపై అనుచితంగా స్పందించినట్లుగా ప్రియాంక పేరిట సోషల్‌ మీడియాలో వచ్చిన ఒక అబద్ధపు వ్యాఖ్యపై తిరుగుదాడిగా ట్విట్టర్‌లో ఆమె కూతురిపై అలా కామెంట్‌ వచ్చింది ::: ఒక అడ్వరై్టజ్‌మెంట్‌ కంపెనీకి చెల్లించవలసిన ఆరు కోట్ల రూపాయలకు పైగా బకాయిల ఎగవేతల విషయంలో తమిళనటుడు రజనీకాంత్‌ భార్య లతను సుప్రీంకోర్టు సుదీర్ఘంగా ప్రశ్నించింది. ‘కొచ్చాడియన్‌’ (2014) పోస్ట్‌ ప్రొడక్షన్‌ ఖర్చుల కోసం తమ వద్ద అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వలేదని ‘యాడ్‌ బ్యూరో’ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు 12 వారాల లోపు ఆ డబ్బును తిరిగి ఇచ్చేయాలని గత ఫిబ్రవరిలోనే ఆదేశాలు జారీ చేసినప్పటికీ చెల్లింపులు జరగకపోవడంతో రుణదాతలు తిరిగి కోర్టును ఆశ్రయించారు ::: యాక్సిస్‌ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈవో శిఖా శర్మ స్థూల వేతనంలో 7.8 శాతం పెరుగుదల ద్వారా ఆమె వేతనం 2.91 కోట్ల రూపాయలు అయిందని 2017–18 బ్యాంకు వార్షిక నివేదిక వెల్లడించింది. గత ఏడాది ఈ మొత్తం 2.70 కోట్ల రూపాయలుగా ఉండేది ::: సంజయ్‌దత్‌ జీవిత కథ ఆధారంగా వచ్చి, అనూహ్యమైన ప్రేక్షకాదరణ పొందుతున్న ‘సంజూ’ చిత్రంలో తన ప్రస్తావన లేకపోవడం çపట్ల సంజయ్‌దత్‌ భార్య రియా పిళ్లై విస్మయం వ్యక్తం చేశారు. రెండో భార్య అయిన రియాతో పాటు, మొదటిభార్య రిచా ఊసు కూడా లేకుండా మూడో భార్య మాన్యతకు (దియామీర్జా) మాత్రమే దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ ‘సంజూ’లో స్థానం కల్పించారు. 

మరిన్ని వార్తలు