మళ్లీ వస్తున్న దీపావళి!

3 Nov, 2019 03:12 IST|Sakshi

బాల

సినీతారలు బాగా ఇష్టపడే పండుగ దీపావళి. ఇంటింటా దీపాలు వెలిగించి, ఆకాశంలోని తారకలతో పోటీపడతారు. ఇతర సెలబ్రిటీస్‌ని పిలిచి పార్టీలు చేసుకుంటారు. స్వస్థలాలకు చేరుకుని, బాణసంచా కాల్చుతూ పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటారు. యామీ గౌతమ్‌కి కూడా అలా ఇంటికి వెళ్లి, అందరితో కలిసి ఆనందంగా దీపావళి జరుపుకోవడం చాలా ఇష్టమట. అయితే కుటుంబం చండీగఢ్‌లో ఉంటుంది. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా యామీ తన తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు నింపడానికి ఇంటికి వెళ్లారు.

రెండు రోజుల పాటు అక్కడే ఉండి అనుబంధాల రుచులు తిని వద్దామనుకున్నారు. కాని పండుగ జరుపుకోలేకపోయారు! దగ్గర బంధువులు దీపావళి రోజునే గతించడంతో, ఆ రోజంతా అక్కడే గడిచిపోయింది. ‘ఈ సంవత్సరం దీపావళికి మా ఇంట్లో స్వీట్స్‌ లేవు, దీపాలు లేవు, టపాసులు లేవు. ఏమీ లేవు’ అన్నారు యామీ. ఆయుష్మాన్‌ ఖురానా, భూమీ పెడ్నేకర్‌లతో తెర మీద కనిపించబోతున్న యామీ.. ‘బాల’ చిత్రం ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఆ దీపావళి వెలుగులు లేకపోయినా, ఈ చిత్రం విజయం సాధించి, యామీ ముఖంలో వెన్నెల కాంతులు కురిస్తే, యామీ దీపావళి జరుపుకున్నట్లేగా. ‘బాల’ ఈనెల 7న విడుదల అవుతోంది.

మరిన్ని వార్తలు